Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

By:  Tupaki Desk   |   9 July 2020 1:07 PM GMT
బ్రేకింగ్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు
X
కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండడంతో విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. ఇప్పటికే పదోతరగతి పరీక్షలను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇంటర్ అడ్వాన్సుడ్ సప్లిమెంటరీ పరీక్షలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

ఈ క్రమంలోనే మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారందరినీ పాస్ చేస్తున్నట్లు మంత్రి సబిత తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంతో ఫెయిల్ అయిన వారందరూ కంపార్ట్ మెంట్ లో పాస్ అయినట్లుగా మార్కుల మెమోలో వస్తుందని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల 1.47 లక్షలమంది ఇంటర్ విద్యార్థులు పాస్ అయ్యి ప్రయోజనం పొందుతారని తెలిపారు.

మార్కుల మెమోలను జులై 31 తర్వాత సంబంధిత కాలేజీల్లో పొందవచ్చని మంత్రి సబిత తెలిపారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ఫలితాలను పదిరోజుల తర్వాత తెలియజేస్తామని వివరించారు.