Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు తగ్గించవచ్చు కదా?: బీజేపీ కేంద్ర మంత్రి

By:  Tupaki Desk   |   14 Jun 2021 9:30 AM GMT
కాంగ్రెస్ రాష్ట్రాల్లో పెట్రోల్ రేటు తగ్గించవచ్చు కదా?: బీజేపీ కేంద్ర మంత్రి
X
పెట్రోధరలపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ కౌంటర్ ఇచ్చారు. పెట్రోల్ ధరలపై ఆందోళన చేసే బదులు కాంగ్రెస్ రాష్ట్రాలైన రాజస్థాన్, మహారాష్ట్రలు సేల్స్ ట్యాక్స్ ఎత్తివేయవచ్చు కదా అని కౌంటర్ ఇచ్చారు.

ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనంతరం మాట్లాడారు. పెరుగుతున్న ధరలు పేదలకు భారంగా మారుతున్నాయన్న ఆందోళన చేసే బదులు కాంగ్రెస్ రాష్ట్రాల సీఎంలు ప్రజలపై భారాన్ని సేల్స్ ట్యాక్స్ తగ్గించి తొలగించుకోవచ్చు కదా అని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎదురు ప్రశ్నించారు.

కరోనాతో పోరాడుతున్న కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఖర్చులు, అభివృద్ధి పనులకు అదనపు సొమ్ములు అవసరమని.. వీటిని పెట్రోల్ , డీజిల్ నుంచి రాబట్టుకోవాలని చూస్తున్నట్టు చెప్పారు.

పెరుగుతున్న ధరలు వినియోగదారులకు ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తనకు తెలుసు అని కేంద్రమంత్రి తెలిపారు. ఆహార ధాన్యాలకు ఉచితంగా ఇచ్చేందుకు ప్రభుత్వం ఒక్క ఏడాదే ఏకంగా లక్ష కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని చెప్పుకొచ్చారు.

ఇవే కాక టీకాలు, ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాల కోసం మరికొంత ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. కాంగ్రెస్ పాలిత మహారాష్ట్ర, రాజస్థాన్, పంజాబ్ లలోనే ధరలు ఎక్కువగా ఉన్నాయని కేంద్రమంత్రి ధర్మేంద్ర ఆరోపించారు. రాహుల్ గాంధీకి ప్రేమే ఉంటే పన్నులను రద్దు చేయాలని ఆయా రాష్ట్రాల సీఎంలను కోరాలి అని ధర్మేంద్రప్రధాన్ సవాల్ చేశారు. ఇక బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అలా చేయాలన్న ప్రశ్నకు కేంద్రమంత్రి బదులివ్వకపోవడం విశేషం.