Begin typing your search above and press return to search.

యువతి పై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు !

By:  Tupaki Desk   |   24 Sep 2021 12:30 AM GMT
యువతి పై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం..  దర్యాప్తులో షాకింగ్ విషయాలు !
X
దేశవ్యాపంగా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎంతమంది ఉన్నా ,ఎన్ని చట్టాలు అమల్లోకి తీసుకోని వస్తున్నా కూడా, మహిళలపై జరిగే అఘాయిత్యాలకి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. కామం తో కళ్లు మూసుకుపోయి కామాంధులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం ఎంత నిఘా పెట్టినా, కఠిన శిక్షలు అమలు చేస్తున్నా, సమాజంలో కీచకులకు కనువిప్పు కలగడంలేదు. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో దారుణం వెలుగులోకి వచ్చింది.

స్నేహితుడితో కలిసి పార్టీ చేసుకొని ఇంటికి తిరిగి వస్తున్న మహిళపై ఉబెర్ డ్రైవరు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవన్ బీమానగర్ ప్రాంతంలో గత కొన్నేళ్లుగా నివాసముంటోంది. మహిళ తన స్నేహితుడి వద్ద పార్టీ చేసుకొని హెచ్‌ ఎస్ ఆర్ లేఅవుట్ ప్రాంతం నుంచి మురుగేశ్ పాళ్యానికి వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది.

క్యాబ్ గమ్యస్థానానికి చేరుకోగానే ఉబెర్ డ్రైవరు కారు లాక్ చేసి, మహిళపై అత్యాచారం చేశాడు. అనంతరం మహిళను కారులో నుంచి బయటకు నెట్టాడు. అయితే బాధిత మహిళ అరుపులు విన్న క్యాబ్ డ్రైవరు అక్కడినుంచి పారిపోయాడు. ఆ తర్వాత బాధిత మహిళ అత్యాచార ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడి నుంచి లాక్కున్న సెల్‌ఫోన్‌ను పోలీసులకు ఇచ్చింది బాధితురాలు. నిందితుడైన ఉబెర్ క్యాబ్ డ్రైవరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడని, అతన్ని ప్రశ్నిస్తున్నామని బెంగళూరు అదనపు పోలీసు కమిషనర్ మురుగన్ చెప్పారు. విచారణ ప్రారంభ దశలో ఉన్నందున డ్రైవరు పేరును దాచిపెట్టినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు.

బాధిత మహిళను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి పంపించారు. కర్ణాటక రాష్ట్రంలో బసవరాజ్ బొమ్మై సీఎం అయ్యాక మైసూరులో సామూహిత అత్యాచారం ఘటన జరిగింది. ఇది రెండో ఘటన కావడంతో ప్రతిపక్షాలు సర్కారుపై విమర్శలు చేస్తున్నారు. ఇదిలావుంటే, అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. అయితే, మహిళపై అత్యాచారం చేసినటువంటి ఆరోపణలను క్యాబ్ డ్రైవర్ ఖండించాడు. క్యాబ్ చార్జీ చెల్లింపు విషయంలో ఇద్దరు మధ్య గొడవ జరిగిందని, తాను మహిళా ప్రయాణికురాలిని తాకలేదని చెప్పారు. ఆ మహిళ పోలీసులకి తప్పుడు ఫిర్యాదు చేసిందని అన్నారు.