Begin typing your search above and press return to search.

బ్రదర్స్ సైలెంట్ : బీజేపీతో అంత వీజీ కాదు...

By:  Tupaki Desk   |   1 July 2022 2:30 PM GMT
బ్రదర్స్  సైలెంట్ : బీజేపీతో  అంత వీజీ  కాదు...
X
ఆ ఇద్దరూ టీడీపీకి అతి పెద్ద అండ. రాజ్యసభ ఎన్నికలు వస్తే చాలు ఆ ఇద్దరు పేర్లను దాటి ఎవరూ ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అలా వారు పార్టీ కోసం చేసిన సేవ అధినాయకత్వానికే బాగా తెలుసు. అందుకే చెరి రెండు సార్లు ఇద్దరినీ రాజ్యసభకు నామినేట్ చేసి రుణం బాగా  తీర్చుకుంది. వారే ఏపీకి చెందిన సీఎం రమేష్, సుజనా చౌదరి. ఈ ఇద్దరు నేతలనూ చంద్రబాబుకు కుడి ఎడమలు అని కూడా పార్టీలో గుసగుసలు పోయేవారు.

ఇక 2019 ఎన్నికలలో టీడీపీ చేదు ఫలితాలను చవిచూసింది. బొత్తిగా 23 సీట్లకు పరిమితం అయిపోయింది. అంతే ఈ ఇద్దరు నేతలూ కూడబలుక్కున్నట్లుగా ఒకేసారి బీజేపీలోకి ఫిరాయించారు. అంతేనా తమ వెంట మరో ఇద్దరిని తీసుకెళ్ళి రాజ్యసభలో మొత్తం టీడీపీ బీజేపీలో విలీనం అయినట్లుగా కూడా చూపించి మమ అనిపించారు. ఇక నాటి నుంచి వారు బీజేపీ ఎంపీలు అయిపోయారు. అప్పట్లో ఢిల్లీ నుంచి నేరుగా విజయవాడ వచ్చే సుజనా చౌదరి వైసీపీ సర్కార్ కి ఇచ్చిన వార్నింగులు ఇన్నీ అన్నీ కావు. అమరావతి రాజధానిలో ఆయన పర్యటించి కేంద్రం అండగా ఉంటుందని చెప్పి మరీ వచ్చారు.

తనకు కేంద్రంలో మంత్రి పదవి వస్తుందని, తన హవా చాటుకోవచ్చునని సుజనా చౌదరి ఇదంతా చేశారు అని అంటారు. ఇక మరో ఎంపీ సీఎం రమేష్ కూడా ఇదే తీరు. ఆయన మీడియా సమావేశాలు పెట్టి కేంద్రం చూస్తోంది జాగ్రత్త అని ఏపీ పాలకుల మీద కత్తులు దూసేవారు. ఇక ఈ ఇద్దరు నాయకులు పక్కా  రాజకీయ వ్యూహాలతోనే బీజేపీలో చేరారు అని ప్రచారం సాగింది. ఏపీలో బీజేపీ టీడీపీల మధ్య పొత్తులు కుదర్చడానికి అనుసంధానం చేయడానికే వీరు బీజేపీ శిబిరంలోకి ఎంట్రీ ఇచ్చారు అని కూడా అంటూ వచ్చారు.

మొత్తానికి ఏమైందో ఏమో కానీ ఈ ఇద్దరు నాయకుల హవా అయితే బీజేపీ జాతీయ నాయకత్వం వద్ద అసలు నడవలేదని తేలిపోయింది. ఇక బీజేపీ పెద్దలు అయితే ఏపీలో టీడీపీతో పొత్తు లేదనేశారు. అంతేనా తన మిత్రపక్షం జనసేనను కూడా టీడీపీ నుంచి దూరం జరిగేలా చూశారు. ఇక ఈ పరిణామాలతో కాషాయం కషాయం తాగించేస్తోందని గ్రహించిన టీడీపీ హై కమాండ్ ఏం చేయలేక కాలం మీద భారం మోపింది. ప్రస్తుతానికి పొత్తుల ఊసే లేకుండా తన మానాన తాను రాజకీయం చేస్తూ వస్తోంది.

ఇవన్నీ పక్కన పెడితే సుజనా చౌదరికి మంత్రి పదవి అటుంచి ఆయన రాజ్యసభ సీటుని మరోసారి కంటిన్యూ చేయడానికి కూడా బీజేపీ పెద్దలు కనీసమాత్రంగా ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. దాంతో ఆయన ఈ తాజాగా మాజీ అయ్యారు. ఇక బీజేపీలో ఆయనకు పెద్ద పదవులు లేవు. దాంతో గమ్మున ఉంటున్నారు అని తెలుస్తోంది. సీఎం రమేష్ కి పదవీ కాలం మరో రెండేళ్ళు ఉంది. దాంతో ఆయన జస్ట్  ఎంపీగా ఉన్నారు.

అయితే ఆయన కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఇక ఏపీకి మోడీ వస్తున్నారు. బీజేపీ నేతలు తెగ హడావుడి చేస్తున్నారు. ఈ టైమ్ ఓ బిగ్ షాట్స్ గా బీజేపీ బ్రదర్స్ గా పేరు తెచ్చున్న ఈ ఇద్దరూ ఏమయ్యారు అని అంతటా చర్చ సాగుతోంది. అయితే ఈ ఇద్దరు నేతలూ అయిపూ అజా లేరు అని తెలుస్తోంది. బీజేపీ ఈ నేతలను లైట్ తీసుకోవడం వల్లనే వారు కూడా ఏం చేయలేక ఫుల్ సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఇక వారి మీద ఆశలు పెట్టుకున్న టీడీపీ అధినాయకత్వానికి వాస్తవ పరిస్థితి బోధపడింది అని చెబుతున్నారు. మొత్తానికి బీజేపీలో రాజకీయం చేయడం అంత వీజీ కాదు సుమా.