Begin typing your search above and press return to search.

ఈ మిత్రుడికి మోడీ హ్యాండిచ్చారు.. నాటి విషయాల్ని వెల్లడించిన నీతీశ్

By:  Tupaki Desk   |   13 Aug 2022 7:44 AM GMT
ఈ మిత్రుడికి మోడీ హ్యాండిచ్చారు.. నాటి విషయాల్ని వెల్లడించిన నీతీశ్
X
నిత్యం నీతికబుర్లు చెప్పే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతల విషయానికి వస్తే.. మాటలకు ఏ మాత్రం పొంతన లేనట్లుగా ఎందుకు వ్యవహరిస్తారు? అన్నది ప్రశ్న. మిగిలిన రంగాలతో పోలిస్తే రాజకీయ రంగంలో స్నేహధర్మానికి రచాలా ప్రాధాన్యత ఇస్తారు. అవసరానికి సాయంగా ఉండే మిత్రుల అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది.మరి.. ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోరో కానీ.. తమతో స్నేహం చేసే మిత్రులకు షాకులు ఇవ్వటంలో మోడీ తర్వాతే ఎవరైనా అన్న మాట వినిపిస్తుంటుంది. ఆయన తీరు చూస్తే.. ఒకప్పుడు బీజేపీతో జట్టు కట్టటం అంటే అదో పాపంగా.. మహా నేరంగా.. ఘోర అపరాధంగా చూసేవారు.

నాటి పరిస్థితుల్ని గుర్తుకు తెచ్చుకొని మరీ.. మిగిలిన పార్టీల విషయంలో మహా కఠినంగా ఉంటారా? అన్న సందేహం కలుగక మానదు. మోడీషాల చేతికి కమలం పగ్గాలు అందిన నాటి నుంచి సుదీర్ఘకాలంగా మిత్రులను ఒకరి తర్వాత ఒకరిని వదిలించుకున్న వైనం చూస్తే.. వారికి తమ పార్టీ తప్పించి.. మిగిలిన పార్టీలతో మిత్రత్వం మీద పెద్ద ఆసక్తి లేదన్న భావన కలుగక మానదు.

ఇప్పటివరకు మోడీషాల కారణంగా షాకులు తిన్న మిత్రుల్ని చూశాం. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా జేడీయూ పార్టీ ముఖ్యనేత..బిహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆ లోటును తీర్చారు.

తాము టార్గెట్ చేసిన రాష్ట్రాల్లోని ప్రభుత్వాల్ని కూల్చేందుకు ఎప్పటికప్పుడు ప్లాన్లు సిద్ధం చేసుకునే మోడీషాలకు.. రివర్సు గేర్ లో నితీశ్ షాకివ్వటం.. కమలానికి చేయిచ్చి.. కొత్త మిత్రులతో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ఈ సందర్భంగా బీజేపీకి హ్యాండిచ్చిన వైనంపై తన మీద నెగిటివ్ పెరుగుతుందన్న భావనతో కావొచ్చు.. గతంలో మోడీషాలు తమ విషయంలో చేసిన పనుల్ని చెప్పుకొచ్చారు.

2019 లోక్ సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో జేడీయూ ఎంపీల సంఖ్యా బలాన్ని అనుసరించి నాలుగు కేంద్ర మంత్రి పదవులు ఇవ్వాలని తాము కోరితే.. అందుకు స్పందించలేదన్నారు. బిహార్ లో బీజేపీకి 17ఎంపీ స్థానాలు వచ్చాయని.. తమకు 16 ఎంపీ సీట్లలో గెలిచామని.. ఆ సందర్భంగా నాలుగు కేంద్ర మంత్రి పదవులు అడిగితే.. తమ సూచనను స్వీకరించలేదన్నారు.

ఇంతకాలం తమకు జరిగిన అన్యాయం మీద మౌనంగా ఉన్న నితీశ్ తాజాగా మాత్రం.. మూడేళ్ల క్రితం నాటి సంగతుల్ని ప్రస్తావిస్తున్నారు. నితీశ్ మాటల్ని విన్న వారు.. మిత్రుల విషయంలో మోడీషాలు ఒకే పద్దతిని అనుసరిస్తారన్న మాట వినిపిస్తోంది.