Begin typing your search above and press return to search.

గురి చూసి మరీ ‘ఈటల’ మీదకు పెద్దసారు గుండ్రాయి విసిరారా?

By:  Tupaki Desk   |   23 July 2021 5:30 PM GMT
గురి చూసి మరీ ‘ఈటల’ మీదకు పెద్దసారు గుండ్రాయి విసిరారా?
X
మాస్టర్ మైండ్ కేసీఆర్ తో చతుర్లు కాదు. కొత్త తరానికి సరికొత్త రాజకీయాల్ని నేర్చుకోవాలనుకునే వారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను అధ్యయనం చేస్తే బోలెడన్ని వ్యూహాలు అర్థం కావటమేకాదు.. ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా ఎలా మార్చుకోవాలో తెలీటమే కాదు.. ప్రజల్లో తన మీద వ్యతిరేకత పెంచి.. అంతలోనే సానుకూలత వ్యక్తమయ్యేలా చేయటంలో ఆయనకు మించినోళ్లు మరెవరూ ఉండరు. రోజు నవ్వుతూ పలకరించేవాడు.. ఒక రోజు పలకరించకున్నా కస్సుమంటాం. అదే రోజు ముఖం మాడ్చుకునేటోడు.. ఏదైనా రోజు నవ్వుతూ మాట్లాడితే మురిసిపోతాం. అదేదో ఘనకార్యకం జరిగినట్లు గొప్పగా చెప్పుకుంటాం. అది మనిషి నైజం.

సగటు జీవుల్లో ఉండే అలాంటి బలహీనతలు కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదు. ప్రజలకు దూరంగా ఉండి.. అయితే ప్రగతిభవన్ లోకి.. లేదంటే ఫామ్ హౌస్ కి మాత్రమే పరిమితమయ్యే పాలకుడి పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కాదన్న విషయం వేలాది పుస్తకాలు చదివిన కేసీఆర్ కు తెలీదా? కానీ.. అదే ఎందుకు చేస్తారు? అంటే..అదంతా ఒక వ్యూహంలో భాగం కాబట్టి. ఎప్పుడు పని చేయనోడు.. ఎప్పుడైతే పని చేస్తూ కనిపిస్తే.. ఎంత కష్టపడిపోతున్నడన్న భావన కలిగించటం చాలా ఈజీ. ఈ సింఫుల్ లెక్కను తెలుసుకొని తనదైన శైలిలో వ్యవహరించటంతో పాటు.. ప్రజల్లో తన ఇమేజ్ ను క్రమపద్దతిలో తగ్గించుకొని.. తాను కోరుకున్నప్పుడు భావోద్వేగ అంశాల్ని తెర మీదకు తీసుకొచ్చి.. తగ్గిపోయిన ఇమేజ్ ను వడ్డీతో సహా తిరిగి రాబట్టుకొని.. ఎన్నికల్లో తన పబ్బం పూర్తి చేసుకునే నయా ఆటలో కేసీఆర్ కున్న నైపుణ్యం మరెవరిలోనూ కనిపించదు.

తనకెంత జిగిరీ దోస్తు అయినా.. లెక్కలు తేడా వచ్చిన తర్వాత సంగతి చూడాల్సిందే అన్నట్లుగా వ్యవహరించే కేసీఆర్ కు మాజీ మంత్రి ఈటలతో ఎక్కడ తేడా వచ్చిందన్నది పక్కన పెడితే.. పార్టీ నుంచి పంపించాలనుకున్న వెంటనే.. అందుకు తగ్గ సీన్ ను తీసుకొచ్చేసి.. జరగాల్సింది జరిగేలా చేసేశారు. ఆ మధ్యన బీజేపీలోకి వెళ్లిన ఈటలకు షాకివ్వటంతో పాటు.. ఆయన చేరిన బీజేపీకి సైతం దిమ్మ తిరిగేలా చేయాలని బలంగా అనుకుంటున్న కేసీఆర్.. తాజాగా ఆ పనిలో మొదటి అంకాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

త్వరలో జరిగే హుజురాబాద్ ఉప ఎన్నికలో గులాబీ జెండా ఎగిరేలా చేయటం కోసం భారీగా స్కెచ్ వేశారని చెబుతారు. ఈటల లాంటి బలమైన నేతకు చెక్ పెట్టాలంటే అలాంటి ఇలాంటి వ్యూహాలు వర్కువుట్ కావన్న సంగతి కేసీఆర్ కు తెలిసిందే. అందుకే..ఆయన తన అమ్ముల పొదిలో నుంచి అనూహ్యమైన అస్త్రాన్ని తాజాగా బయటకు తీశారన్న మాట రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు తనకు సన్నిహితుడైన మోత్కుపల్లి నర్సింహుల్నితాజాగా ప్రయోగించారన్న మాట వినిపిస్తోంది. టీడీపీకి గుడ్ బై చెప్పిన మోత్కుపల్లి బీజేపీలో చేరటం తెలిసిందే.

తాజాగా ఆయన తాను బీజేపీకి గుడ్ బై చెబుతున్నట్లు చెప్పటమే కాదు.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ మీద ఘాటు విమర్శలు.. తీవ్రమైన ఆరోపణలు చేసి సంచలనంగా మారారు. దీంతో.. ఈటల ఇమేజ్ ను డ్యామేజ్ చేయటమే కాదు.. గురి చూసి కొట్టినట్లుగా మోత్కుపల్లి రాజీనామాతో బీజేపీకి సైతం షాకిచ్చేలా చేశారని చెప్పాలి. సాధారణంగా బీజేపీలోకి ఎంట్రీ ఇవ్వటమే కానీ ఎగ్జిట్ అయ్యే ఛాన్సులు చాలా తక్కువగా చెబుతారు. అలాంటి అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయటం ద్వారా.. కేసీఆర్ తానేమిటన్న విషయాన్ని చెప్పకనే చెప్పేశారన్న మాట వినిపిస్తోంది.

నిజానికి మోత్కుపల్లి బీజేపీకి షాకివ్వటం ఇది రెండోసారి. ఈ మధ్యన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించిన దళిత సాధికారత పథకం సమావేశానికి బీజేపీ నేతలు ఎవరూ హాజరు కాకూడదని పార్టీ లైన్ తీసుకున్నారు. అందుకు భిన్నంగా బీజేపీ నేత హోదాలో ఆయన ఆ సమావేశానికి హాజరయ్యారు. దీనికి కమలనాథులు కస్సుమంటే.. దానికి వారికి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరైన తర్వాత మోత్కుపల్లి మాట్లాడుతూ.. తాను దళిత ప్రజాప్రతినిధిగా వీజేపీ తరఫున హాజరు కావటం పార్టీ గౌరవాన్ని కాపాడినట్లు అయిందని కవర్ చేస్తూనే.. దళిత సాధికారత పథకాన్ని.. సీఎం కేసీఆర్ ను ప్రశంసించారు. ఆ సమయంలోనే ముప్పును బీజేపీ నేతలు గ్రహించి ఉంటే బాగుండేది. మోత్కుపల్లిపై వేటు వేయటంతో జరిగిన జాప్యం.. తాజాగా ఆయనే పార్టీ పదవికి రాజీనామా చేయటంతో.. కమలనాథులు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లుగా చెబుతున్నారు.

మోత్కుపల్లి తాజా ఎపిసోడ్ వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడుఆయన టీఆర్ఎస్ లో చేరకుండా.. బీజేపీని.. ముఖ్యంగా ఈటలను టార్గెట్ చేయటానికే ఆయన్ను గుండ్రాయిలా ప్రయోగించారని అంటున్నారు. సాధారణంగా ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్న సామెతకు కొత్త అర్థాన్ని తీసుకొస్తూ.. మోత్కుపల్లి రాజీనామా దెబ్బకు ఈటల రాజేందర్ మాత్రమే కాదు.. తెలంగాణ బీజేపీ సైతం ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేసిన వైనం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. రానున్న రోజుల్లో ఇలాంటి షాకింగ్ వ్యూహాల్ని కేసీఆర్ మరెన్ని బయటకు తీస్తారో? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.