Begin typing your search above and press return to search.

వెలిగొండ ప్రాజెక్టు సందర్శనలో వైఎస్ జగన్

By:  Tupaki Desk   |   20 Feb 2020 5:20 AM GMT
వెలిగొండ ప్రాజెక్టు సందర్శనలో వైఎస్ జగన్
X
వైఎస్సార్ కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను కరువు నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2014లో వెలిగొండ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలో ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టగా అనంతరం వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో నత్తనడకన సాగాయి. ప్రాజెక్టు పనులతో అడ్డగోలుగా దోపిడీకి పాల్పడ్డారు.. గానీ ప్రాజెక్టు పూర్తిపై శ్రద్ధ పెట్టలేదు. మూడు జిల్లాలకు వరప్రదాయినిగా మారనున్న ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పలుమార్లు సమీక్ష చేశారు. అందులో భాగంగా రివర్స్ టెండరింగ్ చేసి పనులపై సమగ్రంగా పరిశీలించారు. అనంతరం ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేసి ప్రారంభించాలని వైఎస్ జగన్ ఆదేశించడంతో ప్రస్తుతం పనులు వడివడిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో జగన్ మోహన్ రెడ్డి ప్రాజెక్ట్ సందర్శనకు వస్తున్నారు.

4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించేలా రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.5,107 కోట్లు ఖర్చు చేయగా.. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పూర్తికి రూ.3,480 కోట్లు అవసరం. కృష్ణా నదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ నుంచి 43.5 టీఎంసీల నీటిని వెలిగొండ ప్రాజెక్టును నింపనున్నారు. పెద్దదొర్నాల మండలంలోని కొత్తూరు వద్ద జరుగుతున్న వెలిగొండ ప్రాజెక్టు పనులను ముఖ్యమంత్రి హోదా లో జగన్ మోహన్ రెడ్డి తొలిసారి పరిశీలించనున్నారు. మొదటి టన్నెల్, రెండో టన్నెల్‌ ప్రాంగణాలతో పాటు, ముఖ్యమంత్రి ఇరిగేషన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టు ప్రాంతాలను పరిశీలించి పనుల దశ ఎంతవరకు వచ్చాయో.. ఎంత పూర్తి చేయాలో స్వయంగా తెలుసుకోనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రతా సిబ్బంది పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు.

పనులు త్వరగా పూర్తి చేసి జూన్ లోపు ప్రాజెక్టును ప్రారంభించాలని అధికారులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. వర్షాకాలంలోపు పూర్తయితే ఆ తర్వాత వచ్చే వరద తో ప్రాజెక్టును నింపే అవకాశం ఉంది. అయితే నిపుణుల కమిటీ సూచలనల మేరకు వెలిగొండ ప్రాజెక్టు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లి రూ.62.1 కోట్ల మేర ఆదా చేసిన విషయం తెలిసిందే.