Begin typing your search above and press return to search.

హైదరాబాద్‌లో బెట్టింగ్‌ భూతంపై సీబీఐ దాడులు!

By:  Tupaki Desk   |   18 May 2022 3:21 AM GMT
హైదరాబాద్‌లో బెట్టింగ్‌ భూతంపై సీబీఐ దాడులు!
X
హైదరాబాద్‌లో బెట్టింగ్‌ భూతం మరోమారు పడగ విప్పింది. ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) మ్యాచులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బెట్టింగ్‌ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. భారత్‌ క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు (బీసీసీఐ), పోలీసు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా బెట్టింగ్‌కు అడ్డుకట్ట పడటం లేదు. ఒక్కో మ్యాచ్‌కు వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

బెట్టింగ్‌ రాకెట్‌ వెనుక కూడా మన శత్రు దేశం పాకిస్థాన్‌ ఉందని సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (సీబీఐ) దర్యాప్తులో వెల్లడైంది. తాజాగా హైదరాబాద్‌ కేంద్రంగా జరుగుతున్న భారీ బెట్టింగ్‌పై విశ్వసనీయ సమాచారం అందుకున్న సీబీఐ అధికారులు నగరంలో నాలుగు చోట్ల దాడులు చేశారు. ఈ దాడుల్లో పాకిస్థాన్‌ ప్రమేయముందనడానికి పక్కా ఆధారాలు దొరికాయి. 2010 నుంచే పాకిస్థాన్‌ కేంద్రంగా గుట్టుచప్పుడు కాకుండా హైదరాబాద్‌ నగరంలో బెట్టింగ్‌ జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

సీబీఐ తన దాడుల్లో భాగంగా బెట్టింగ్‌తో సంబంధమున్న పలువురిపై కేసులు పెట్టింది. వీరిలో ౖహైదరాబాద్‌కు చెందినవారితోపాటు జైపూర్, జో«ద్‌పూర్‌ (రాజస్థాన్‌), ఢిల్లీకి చెందినవారు ఉన్నారు. సాధారణ వ్యక్తులతోపాటు కొంత మంది ప్రభుత్వ అధికారులు కూడా బెట్టింగ్‌కు పాల్పడుతున్నారని తెలుస్తోంది. సీబీఐ అధికారులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీకి చెందిన దిలీప్‌ కుమార్‌తోపాటు హైదరాబాద్‌కు చెందిన గుర్రం సతీష్, సజ్జన్‌ సింగ్, ప్రభులాల్‌ మీనా, రామ్‌ అవతార్, అమిత్‌ కుమార్‌ తదితరుల పేర్లు ఉన్నాయి.

ఇప్పటివరకు నిందితులు రూ.10 కోట్ల విలువైన బెట్టింగ్‌లు జరిపారని సీబీఐ అధికారులు గుర్తించారు. దిలీప్‌ కుమార్‌ అనే వ్యక్తి ఖాతాలో రూ.43 లక్షలకుపైగా ఉన్నాయని తెలిపారు. ఒక పెద్ద నెట్‌వర్క్‌లా ఏర్పడి ఐపీఎల్‌ మ్యాచ్‌ల ఫలితాలను ప్రభావితం చేసేలా ఇది పనిచేస్తోందని తెలుసుకున్నారు. ఈ బెట్టింగ్‌ రాకెట్‌లో ప్రధాన పాత్ర మాత్రం పాకిస్థాన్‌కు చెందిన వాకస్‌ మాలికేదేనని తెలుస్తోంది. అతడు హైదరాబాద్‌కు చెందిన గుర్రం సతీష్‌తో నేరుగా సంప్రదించి బెట్టింగ్‌కు పాల్పడుతున్నాడు.

కాగా, బెట్టింగ్‌కు పబ్‌లు, హోటళ్లు, లాడ్జిలు, ప్రైవేటు అపార్ట్‌మెంట్లే కేంద్రంగా బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు. ఇక్కడయితే పోలీసులకు అనుమానం రాదనే ఇలా చేస్తున్నారు. అలాగే పోలీసులకు చిక్కకుండా ఎప్పటికప్పుడు తమ స్థావరాలను మార్చేస్తున్నారు. దాదాపు ఫోన్‌ల ద్వారానే దందా అంతా నడిపిస్తున్నారు.