Begin typing your search above and press return to search.

వెల‌వెల బోయిన‌... వైసీపీ బ‌స్సు యాత్ర‌.. రీజ‌న్ ఏంటి?

By:  Tupaki Desk   |   28 May 2022 6:31 AM GMT
వెల‌వెల బోయిన‌... వైసీపీ బ‌స్సు యాత్ర‌.. రీజ‌న్ ఏంటి?
X
సామాజిక న్యాయభేరి పేరిట జరుగుతున్న ఏపీ వైసీపీ స‌ర్కారులోని మంత్రులు చేప‌ట్టిన‌ బస్సుయాత్ర వెల వెల బోతోంది. రాజమహేంద్రవరంలో నిర్వహించిన బహిరంగ సభ జనం లేక వెలవెలబోయింది. అంతమంది మంత్రులు, వైసీపీ ప్రజాప్రతినిధు లు సభా వేదికపై ఉన్నా... సభలో ఏర్పాటు చేసిన కుర్చీలు మాత్రం ఖాళీగానే దర్శనమిచ్చాయి. సభకు ఉపాధి హామీ కూలీలు, డ్వాక్రా మహిళలను భారీగా తరలించగా.... మంత్రులు వేదిక వద్దకు రాకముందే జనం వెళ్లిపోయారు. అమాత్యులు వచ్చేసరికి కుర్చీలు ఖాళీగా కనిపించాయి.

సభా ప్రాంగణం నుంచి బయటికి వెళ్లకుండా పోలీసులు గేట్లు వేసి అడ్డుకున్నా... జనం ఆగకుండా వెళ్లిపోయారు. జనం వెళ్లిపోవడంతో సభలో ముగ్గురు మంత్రులు మాత్రమే ప్రసంగించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా... వైసీపీనే గెలిపించాలని సామాజిక న్యాయభేరి పేరిట నిర్వహిస్తున్న బస్సు యాత్ర ద్వారా మంత్రులు కోరారు.

విశాఖ పాత గాజువాక జంక్షన్‌ నుంచి రెండో రోజు యాత్ర ప్రారంభించిన అమాత్యులు.. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాతే సామాజిక న్యాయం అమలవుతోంద న్నారు. అయితే తొలిరోజు వర్షం కారణంగా నిలిచిపోయిన మంత్రుల బహిరంగ సభ.. రెండో రోజు రాజమహేంద్రవరంలో జనం లేక వెలవెలబోయింది. దీంతో వైసీపీలో అంత‌ర్మ‌థ‌నం ప్రారంభ‌మైంది.

సామాజిక న్యాయభేరి పేరుతో మంత్రులు నిర్వహిస్తున్న బస్సు యాత్ర రెండో రోజు విశాఖ పాత గాజువాక నుంచి ప్రారంభమైంది. సీఎం జగన్ మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 70 శాతం పదవులు ఇచ్చారని.... దేశంలో ఎక్కడా ఇలా పదవులు ఇచ్చిన దాఖలాలు లేవని హోంమంత్రి తానేటి వనిత తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, మహిళలకు సీఎం అండగా ఉంటారని మంత్రి విడదల రజని అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు, కులాలకు ఏ ప్రభుత్వం అందించని అవకాశాల్ని జగన్‌ కల్పించారని ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. రాబోయే ఎన్నికల్లోనూ జగన్‌ను ఆశీర్వదించాలని ప్రజల్ని కోరారు. వెనుకబడిన వర్గాలకు జ‌గ‌న్ పాలనలోనే న్యాయం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నారు.

గాజువాక నుంచి లంకలపాలెం, అనకాపల్లి, తాళ్లపాలెం, యలమంచిలి మీదుగా వైసీపీ బస్సు యాత్ర సాగింది. నక్కపల్లి, తుని, కత్తిపూడి, జగ్గంపేట మీదుగా రాజమహేంద్రవరం వరకు సాగింది. రాజమహేంద్రవరంలో మంత్రుల బస్సు యాత్ర, సభ సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

ఇప్పుడు ఏం చేద్దాం!!

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు త‌మ ప‌నులు ప‌క్క‌న పెట్టి మ‌రీ.. మంత్రులు రంగంలోకి దిగి బ‌స్సు యాత్ర చేప‌ట్టారు. అయితే.. దీనికి స్పంద‌న లేక‌పోవ‌డం.. మంత్రుల‌ను, నాయ‌కుల‌ను కూడా అంత‌ర్హ‌థ‌నంలోకి నెట్టేసింది. ఇప్పుడు ఏం చేద్దాం! అనే చ‌ర్చ వారి మ‌ధ్య జ‌రుగుతోంది. నిజానికి మూడేళ్ల పాల‌న‌లో ఎవ‌రూ అందించ‌ని సంక్షేమాన్ని అందించామ‌ని చెబుతున్న‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల్లో ఆ త‌ర‌హా స్పంద‌న మాత్రం క‌నిపించ‌డం లేదు. దీనికితోడు ఎక్కడిక‌క్క‌డ నిల‌దీత‌లు క‌నిపిస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌పై ఏదో ఒక టి చేయాల‌ని.. నేరుగా జ‌గ‌నే రంగంలోకి దిగితే మంచిద‌ని కొంద‌రు నాయ‌కులు భావిస్తున్నారు. ఏదేమైనా.. వైసీపీలో ఈ యాత్ర‌.. తీర‌ని.. ఇబ్బందిని మిగుల్చుతోంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.