Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో ప్రముఖ స్టార్ హోటల్లో ఒక హత్య ప్లస్ ఆత్మహత్య

By:  Tupaki Desk   |   30 July 2021 4:32 AM GMT
హైదరాబాద్ లో ప్రముఖ స్టార్ హోటల్లో ఒక హత్య ప్లస్ ఆత్మహత్య
X
ఇటీవల కాలంలో ఎప్పుడూ చూడని ఒక దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఐటీ హబ్ అయిన మాదాపూర్ లో ఫేమస్ అయిన లెమన్ ట్రీ హోటల్లో ఒక హత్య.. మరో ఆత్మహత్య చోటు చేసుకోవటం సంచలనంగా మారింది. చిన్ననాటి నుంచి స్నేహితులైన ఇద్దరు హోటల్లోకి దిగటం.. రోజు గడిచేసరికి విగతజీవులుగా మారటం సంచలనంగా మారింది. తన స్నేహితురాలిని బ్లేడ్ తో గొంతు కోసి హత్యకు పాల్పడిన యువకుడు అనంతరం ఆత్మహత్య చేసుకున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఈ ఉదంతం ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసింది. అసలేమైంది? మరణించిన వారు ఎవరు? ఎక్కడి వారు? అన్న విషయాల్లోకి వెళితే..

వికారాబాద్ జిల్లా బొమ్మరాజుపేటకు చెందిన సంతోషి.. మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మండలానికి చెందిన రాములు ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. బుధవారం మధ్యాహ్నం వారు మాదాపూర్ లోని లెమన్ ట్రీ హోటల్ కు వచ్చారు. ఇరువురు కలిసి రూం తీసుకున్నారు. ఒక రోజుకు రూంను అద్దెకు తీసుకున్న వారు.. గురువారం సాయంత్రానికి రూం ఖాళీ చేయాల్సి ఉంది. కానీ.. రూం ఖాళీ చేయకపోవటం.. తలుపు కొట్టినా స్పందన లేకపోవటంతో అనుమానానికి గురయ్యారు.

దీనికితోడు.. మధ్యాహ్నం వేళలో వారిద్దరు గొడవ పడిన వైనాన్ని హోటల్ సిబ్బంది గుర్తించటంతో రూం తలుపును బలవంతంగా ఓపెన్ చేశారు. అందులో సంతోషి బాత్రూంలో రక్తపు మడుగులో పడి ఉండగా.. చున్నీతో ఉరి వేసుకొని రాములు కనిపించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించటంతో మాదాపూర్ పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసుల అంచనా ప్రకారం.. సంతోషిని గొంతును రాములు బ్లేడ్ తో గాయపర్చటంతో ఆమె మరణించి ఉంటారని భావిస్తున్నారు. తన చిన్ననాటి స్నేహితురాలిని రాములు ఎందుకు హత్య చేశారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది.

ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం సంతోషి హత్య చేసిన రాములు.. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నారు. వేర్వేరు ప్రాంతాలకు చెందిన వీరిద్దరి మధ్య స్నేహం ఎలా మొదలైందన్న ప్రశ్నకు సమాధానం.. వారిద్దరూ హకీంపేటలో పదో తరగతి వరకు కలిసి చదువుకున్నట్లుగా చెబుతున్నారు. అప్పటినుంచి వారి మధ్య స్నేహం మాత్రం కంటిన్యూ అవుతున్నట్లు చెబుతుంటే.. మరోవైపు వారిద్దరు ఈ మధ్యనే గుట్టుచప్పుడు పెళ్లి చేసుకున్నారని.. ఇంట్లో వారికి తెలిసి గొడవ అయినట్లుగా తెలుస్తోంది.

సంతోషి పోలీసు జాబ్ కోసం ట్రై చేస్తుందని చెబుతున్నారు. ఇక.. రాములకు హైదరాబాద్ లో ట్రావెల్ ఏజెన్సీ ఉన్నట్లు చెబుతున్నారు. రాములు కోసం మూడు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన సంతోషి లెమన్ ట్రీ హోటల్ లో రూం తీసుకున్నారు. అనంతరం వారి మధ్య ఎందుకు గొడవలు జరిగాయి? ఈ దారుణానికి కారణం ఏమిటన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె హత్య సమాచారాన్ని పోలీసులు సంతోషిని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇరు కుటుంబాల్ని విచారించిన తర్వాత అసలు విషయాలు తెలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.