Begin typing your search above and press return to search.

సంక్షోభంలో బ్రిటన్ ప్రభుత్వం.. రాజీనామాల క్యూ.. ఇన్ఫోసిన్ నారాయణమూర్తి అల్లుడి ‘కీ’రోల్

By:  Tupaki Desk   |   6 July 2022 3:30 PM GMT
సంక్షోభంలో బ్రిటన్ ప్రభుత్వం.. రాజీనామాల క్యూ.. ఇన్ఫోసిన్ నారాయణమూర్తి అల్లుడి ‘కీ’రోల్
X
ప్రపంచంలోని ప్రజాస్వామ్య దేశాల్లోనూ ప్రభుత్వాలు కూలుతున్నాయి. మెజార్టీ లేకపోతే.. ప్రజల్లో అభిమానం లేకుంటే.. ప్రజా ప్రతినిధుల నమ్మకం లేకుంటే ప్రభుత్వాలు నిలబడవు. ఇప్పటికే మహారాష్ట్రలో కూడా ఇలానే జరగగా.. ఇప్పుడు ప్రపంచంలోనే ఆదిపత్యపు ప్రజాస్వామ్య దేశం ‘బ్రిటన్’లో కూడా ప్రభుత్వం పడిపోయే స్థితికి చేరింది.

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. తాజాగా మరో ఆరుగురు మంత్రులు కేబినెట్ నుంచి రాజీనామా చేసి తప్పుకున్నారు. దీంతో ప్రభుత్వం విశ్వాసం కోల్పోయే ప్రమాదంలో పడింది.

బ్రిటన్ ప్రభుత్వంలో కీ రోల్ ప్లే చేయటమే కాదు.. ప్రస్తుతం ఆ దేశ ప్రధానిగా ఉన్న బోరిస్ జాన్సన్ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నాడు ప్రవాస భారతీయుడు.. బ్రిటన్ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుపోయేలా చేసిన వారిలో ఇన్ఫోసిన్ నారాయణమూర్తి అల్లుడు ఉండటం విశేషం.

భారత సంతతికి చెందిన 42 ఏళ్ల రిషి సునాక్.. బోరీస్ జాన్సన్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేయటం.. అతడితో పాటు మరో మంత్రి (ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్)కూడా రాజీనామా చేయటంతో బోరిస్ ప్రభుత్వానికి నూకలు చెల్లుతున్నాయా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

అయితే.. ఇలాంటి పరిస్థితికి బోరిస్ జాన్సన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని చెబుతున్నారు.ఇంతకీ ఈ సంక్షోభానికి కారణం వెతికితే.. పార్లమెంట్ సభ్యుడు క్రిస్ పించర్ గా చెప్పాలి. అతడ్ని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ నెత్తిన పెట్టుకోవటం.. అతగాడి పని తీరుతో మొత్తం డిస్ట్రబ్ అవుతుందన్న ఆరోపణలున్నాయి. గతంలో ఆయన్ను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్ పదవిలో కూర్చోబెడుతూ బోరీస్ జాన్సన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోలేదు.

తాజాగా ఒక క్లబ్ లో తాగిన మత్తులో క్రిస్ పించర్ ఇద్దరు మగాళ్ల విషయంలో తేడాగా వ్యవహరించటం.. దానిపై కంప్లైంట్లు రావటంతో తీవ్ర వివాదానికి కారణమైంది. దీంతో అతడ్ని పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే.. పించ్ ఇలాంటి వాడని తనకు ముందు తెలియదని బోరిస్ జాన్సన్ తప్పుకునే ప్రయత్నం చేశారు. దీనికి బదులుగా.. పించర్ గురించి తాము ముందే చెప్పినట్లుగా మాజీ అధికారి ఒకరు పేర్కొనటంతో బోరీస్ జాన్సన్ అడ్డంగా బుక్ అయ్యారు. ప్రధాని నోటి నుంచి అసత్యాల నేపథ్యంలో గురి చూసి కొట్టిన బాణంలా.. తన ఆర్థిక మంత్రి పదవికి రాజీనామా చేశారు. దీంతో బోరీస్ జాన్సన్ ప్రభుత్వానికి నూకలు చెల్లిన పరిస్థితి.

ఇటీవల కాలంలో బోరీస్ జాన్సన్ ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తుందన్న విమర్శ ఉంది. ప్రజలు వేలెత్తే వరకు విషయాన్ని తీసుకెళ్లి.. తర్వాత క్షమాపణలు చెప్పటం ఒక అలవాటుగా మారిందంటున్నారు. తాజా ఎపిసోడ్ లోనూ తనకేమీ తెలీదన్న మాటను చెప్పి.. అనంతరం తప్పు జరిగిందని చెంపలేసుకున్న బ్రిటన్ ప్రధాని బోరీస్ జాన్సన్ ప్రభుత్వానికి నూకలు చెల్లినట్లేనని చెబుతున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు ఉండటం గమనార్హం.

తాజాగా ఆరుగురు మంత్రులు రాజీనామాలు చేసినా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ మాత్రం తన పదవి నుంచి తప్పుకునేది లేదని స్పష్టం చేశారు. సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడే ఏం జరుగుతుందో అదే జరుగుతుందని దానికి బదులుగా తప్పుకొని వెళ్లనని తేల్చిచెప్పారు.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం.. ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావంతో ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమని తెలుస్తోంది. ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గించి సాయపడుతానని బోరిస్ జాన్సన్ తెలిపారు. అవే కారణాలు ప్రభుత్వం పతనం కావడానికి కారణమన్నారు.