Begin typing your search above and press return to search.

బ్రేకింగ్ : మాజీ ఎంపీ సబ్బంహరి కన్నుమూత

By:  Tupaki Desk   |   3 May 2021 9:07 AM GMT
బ్రేకింగ్ : మాజీ ఎంపీ సబ్బంహరి  కన్నుమూత
X
కరోనా జోరు దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. కరోనా కాటుకి సామాన్యుల నుండి ప్రముఖుల వరకు అందరూ బలైపోతున్నారు. సామాన్యులతో పాటుగా పలువురు రాజకీయ నేతలు సైతం ఇప్పటికే కరోనా తో పోరాడి విజయం సాధించలేక మృతిచెందారు. తాజాగా మరో ప్రముఖ రాజకీయ నేత కన్నుమూశారు. కరోనా బారిన పడి కొంతకాలంగా చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ సబ్బం హరి , ఆరోగ్య విషమించడంతో కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. కొద్దిరోజుల కరోనా బారినపడ్డ ఆయన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. కొద్ది రోజుల కిందట సబ్బం హరి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో ఆయన కరోనా పాజిటివ్‌‌ గా తేలింది.

అయితే వైద్యుల సూచన మేరకు తొలుత ఆయన హోం ఐసోలేషన్‌ లో ఉన్నారు. ఆ తర్వాత, కరోనా తీవ్రత ఎక్కువ కావడంతో ఆస్పత్రిలో చేరారు. ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సబ్బం హరి ఆరోగ్యం నేడు విషమించినట్టు వైద్యులు తెలిపారు. కరోనాతో పాటు ఇతర ఇన్‌ఫెక్షన్లు కూడా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొద్దిరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో కొద్దిసేపటి క్రితం ఆయన కన్నుమూశారు. సబ్బం హరి విశాఖపట్నం మేయర్‌ గా భాద్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. 15 వ లోక్ సభకు విశాఖ జిల్లాలోని అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి విజయం సాధించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ కు ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కాంగ్రెస్‌ తో వైఎస్ జగన్ విభేదించిన సమయంలో ఆయనతో కలిసి రాజకీయ ప్రయాణం సాగించిన వ్యక్తిగా సబ్బం హరి నిలిచారు. ఓదార్పు యాత్రలో వైఎస్ జగన్ వెంట నడిచారు. అయితే ఆ తరువాత వైఎస్ జగన్‌ తో విభేదాలు రావడంతో సబ్బం హరి కొంతకాలం రాజకీయాలకు దూరమయ్యారు. అనంతరం టీడీపీలో చేరిన సబ్బం హరి గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.