Begin typing your search above and press return to search.

కానిస్టేబుల్ పాడె మోసిన సజ్జనార్ .. ఎందుకంటే?

By:  Tupaki Desk   |   22 Nov 2020 2:50 PM GMT
కానిస్టేబుల్ పాడె మోసిన సజ్జనార్ .. ఎందుకంటే?
X
ఓ కానిస్టేబుల్ తాను మరణిస్తూ మరో 8 మంది జీవితాల్లో వెలుగులు నింపారు. సీఏఆర్‌ హెడ్‌ క్వార్టర్స్‌ స్పెషల్‌ పార్టీలో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కోనేరి ఆంజనేయులు ఈ నెల 18న డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సోమన్‌గుర్తి గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయాలపాలయ్యాడు. తలకు బలమైన గాయమైంది. దీంతో స్థానికులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ ‌లోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా సోమవారం తెల్లవారు జామున ఆంజనేయులు బ్రెయిన్‌ డెడ్‌కు గురయ్యారు.

ఆంజనేయులు కుటుంబ సభ్యులను సైబరాబాద్ సీపీ శ్రీ వీసీ సజ్జనార్ పరామర్శించారు. సీపీ రిక్వెస్ట్ తో ఆంజనేయులు గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, కళ్లు ఇతరులకు ఉపయోగించేందుకు ప్రభుత్వ రంగ సంస్థ జీవన్ దాన్ కు అప్పగించారు కుటుంబ సభ్యులు. బాధలో ఉండి కూడా మరో 8 మంది ప్రాణాన్ని కాపాడేందుకు ముందుకి వచ్చిన కుటుంబ సభ్యులను అభినందించారు సజ్జనార్. ఈయన వికారాబాద్‌ జిల్లా పరిగి మండలం బాబాపూర్‌ గ్రామానికి చెందిన వ్యక్తి. 2018 బ్యాచ్‌‌కు చెందిన వారు.

ఆర్గాన్‌ డొనేషన్‌ ఇనీషియేటివ్‌ ‘మరోజన్మ’ సహకారంతో ప్రభుత్వ రంగ సంస్థ ‘జీవన్‌ దాన్‌’కు అవయవాలను అప్పగించారు. మరో 8 మంది ప్రాణాన్ని కాపాడేందుకు ముందు కొచ్చిన ఆంజనేయులు కుటుంబ సభ్యులను సీపీ సజ్జనార్‌ అభినందించారు. కానిస్టేబుల్ ఆంజనేయులు అంత్యక్రియల్లో వీసీ సజ్జనార్ కూడా పాల్గొన్నారు. ఆయన చనిపోతూ మరో 8 మందికి ప్రాణం పోసినందున అంత్యక్రియల్లో పాడె మోశారు. అవయవదానం చేసి పలువురికి స్ఫూర్తిగా నిలవాలని కమిషనర్ కోరారు.