Begin typing your search above and press return to search.

నేను సింహాన్ని అంటున్న బొత్స ?

By:  Tupaki Desk   |   3 Dec 2021 8:41 AM GMT
నేను సింహాన్ని అంటున్న బొత్స ?
X
సింహం అడవిలో ఉన్నా సర్కర్ లో ఉన్నా ఒక్కటే. దాని పవర్ లో ఎలాంటి తేడా అసలు ఉండదు అంటున్నారు బొత్స సత్యనారాయణ. ఆయన జగన్ ప్రభుత్వంలో సీనియర్ మంత్రి. ఆయన తాజాగా ఒక యూట్యూబ్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నేను సింహన్నే అని చెబుతున్న బొత్స ఎపుడూ ఒకేలా ఉంటానని చెప్పుకొచ్చారు.

పార్టీలు వేరు అయినా తన పవర్ మాత్రం ఎపుడూ ఒకేలా ఉంటుందని, అది ఎక్కడా తగ్గేది లేదని కూడా బొత్స హాట్ కామెంట్స్ చేశారు. తన హవా తగ్గింది అంటున్న వారు చేతనైతే దాన్ని నిరూపించాలని అన్నారు.

తాను కాంగ్రెస్ లో ఉన్నా వైసీపీలో ఉన్నా ఒక్కలాగానే వ్యవహరిస్తానని ఆయన అన్నారు. అయితే జాతీయ పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు మధ్య తేడా ఉంటుందని, ఆలోచనలు, ఇతర విషయాలలో కూడా వ్యత్యాసాలు చాలా ఉంటాయని ఆయన వివరించారు. తాను కాంగ్రెస్ లాంటి మహా సముద్రంలో పనిచేశానని, అలాగే జగన్ నాయకత్వాన కూడా హ్యాపీగా పనిచేస్తున్నట్లుగా చెప్పుకున్నారు.

ఇక ఉత్తరాంధ్రాలో బొత్స ఒకనాడు కింగ్, ఇపుడు ఏమీ కాదు అంటూ వస్తున్న వార్తల పట్ల ఆయన మండిపడ్డారు. తనకు ఎపుడూ ప్రజాదరణ ఉందని, అలాగే తాను అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ప్రజలకు చేతనైన సాయం చేస్తానని, తన సాయం కోసం ఉత్తరాంధ్రా జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూంటారని బొత్స చెప్పుకున్నారు.

తాను పార్టీకి మంత్రిని కాదని, ప్రభుత్వానికి అని ఆయన వివరణ ఇచ్చారు. తమ పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేకుండా తాను ప్రజలకు చేతనైన సాయం చేస్తానని ఆయన అంటున్నారు.

ఇక ఉత్తరాంధ్రా జిల్లాల పార్టీ వ్యవహారాల్లో తన పలుకుబడి తగ్గింది అన్న మాటలను ఆయన కొట్టిపారేశారు. గతంలో తాను చెప్పిన వారికే మూడు జిల్లాలలో ఎమ్మెల్యే టికెట్లు వంటివి వచ్చేవన్న దానికి ఆయన బదులిస్తూ ఇపుడు మాత్రం అలా రాని వాళ్ళు ఉన్నారా అని ఎదురు ప్రశ్నించారు.

తాను పార్టీ శ్రేయస్సుతో పాటు నాయకుల మేలు కూడా కోరే మనిషిని అని చెప్పుకున్నారు. ఉత్తరాంధ్రా జిల్లాల వైసీపీ ఇంచార్జి విజయసాయిరెడ్డితో విభేధాలు లేవని, ఆయన పని ఆయన చేస్తారు, తన పని తాను చేస్తాను అని బొత్స వివరించారు.

ఇక తన సతీమణి, బొత్స ఝాన్సీకి టీటీడీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నం చేసినట్లుగా వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. అదే విధంగా మునిసిపాలిటీలు చెత్త పన్ను వసూల్ చేయడాన్ని సమర్ధించుకున్నారు. క్లీన్ ఆంధ్ర ప్రదేశ్ లో భాగంగా కేంద్రం తెచ్చిన సంస్కరణలను తాము అమలు చేస్తున్నామని, ఇది కూడా మునిసిపాలిటీల ఇష్టప్రకారమేనని ఆయన అన్నారు. తమ శాఖకు అవార్డులు రావడం తన సమర్ధతగా భావించడం కంటే అందరి కృషి అని ఆయన అన్నారు.

ఇక మంత్రి వర్గ విస్తరణలో తన పదవి ఉంటుందా ఊడుతుందా అన్నది తాను అసలు ఆలోచించడంలేదని, అది ఊహాజనితమైన ప్రశ్న అని ఆయన అన్నారు. మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోవాలి అన్నది ముఖ్యమంత్రి ఇష్టమని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రిగానే కాకుండా పార్టీ ప్రెసిడెంట్ గా కూడా జగన్ ఉన్న సంగతిని ఆయన గుర్తు చేశారు.

ఎవరు పార్టీలో ఉండాలి, ఎవరికి ప్రభుత్వంలో చోటు ఇవ్వాలి అన్నై సీఎం జగన్ చూసుకుంటారని ఆయన చెప్పారు. ఇక తన మేనల్లుడు చిన్న శ్రీనుతో తనకు విభేదాలు ఉన్నాయన దానికి ఆయన గట్టిగా ఖండించారు. ఇవన్నీ సోషల్ మీడియా రాతలని, ఆ మాటకు వస్తే విజయనగరం జిల్లాలో ఉన్న ఏ వైసీపీ నేతతో కూడా తనకు విభేదాలు లేవని, తామంతా ఒక్కటే కుటుంబం అని ఆయన అన్నారు. మొత్తానికి తాను పవర్ ఫుల్ సింహమనే దాన్ని చెబుతూ బొత్స గట్టిగా సౌండ్ చేస్తున్నారు.