Begin typing your search above and press return to search.

ఎన్నికల బరిలో మరో బాలీవుడ్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   23 April 2019 12:34 PM GMT
ఎన్నికల బరిలో మరో బాలీవుడ్‌ స్టార్‌
X
గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ ఎన్నికల్లో సెలబ్రెటీలు సందడి చేస్తున్నారు. ప్రతి సారి పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో సినీ తారలు పోటీ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కాని ఈసారి మాత్రం గతంతో పోల్చితే ఎక్కువ మంది దేశంలో వివిధ ప్రాంతాల నుండి పోటీ పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాదిన పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ రాజకీయాలు చేస్తున్నారు, కొందరు ఎంపీగా పోటీ చేస్తున్నారు. తాజాగా బీజేపీ నుండి బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సన్నీడియోల్‌ పార్లమెంట్‌ కు పోటీ పడేందుకు సిద్దం అయ్యాడు.

రెండు రోజుల క్రితం అమిత్‌ షాను కలిసిన సన్నీడియోల్‌ బీజేపీలో చేరడం పక్కా అనుకున్నారు. అనుకున్నట్లుగా ఈయన బీజేపీ తీర్థం తీసుకున్నాడు. ఇక తాజాగా పంజాబ్‌ లోని గురుదాస్‌ పుర పార్లమెంట్‌ స్థానం నుండి ఈయన్ను పోటీ చేయించాలని అధిష్టానం నిర్ణయించిందట. గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి బీజేపీ తరపున బాలీవుడ్‌ స్టార్‌ వినోద్‌ ఖన్నా పోటీ చేసి గెలుపొందాడు. అయితే ఆయన మరణంతో ఉప ఎన్నికలు రాగా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఆ స్థానంను దక్కించుకుంది. సిట్టింగ్‌ స్థానంను పోగొట్టుకున్న కసితో బీజేపీ ఉంది.

పోగొట్టుకున్న ఆ స్థానంను మళ్లీ ఎలాగైనా సంపాదించే ఉద్దేశ్యంతో అమిత్‌ షా వ్యూహాత్మకంగా మళ్లీ బాలీవుడ్‌ నటుడే అయిన సన్నీ డియోల్‌ ను రంగంలోకి దించడం జరుగుతుంది. బీజేపీకి అక్కడ తప్పకుండా విజయం ఖాయం అంటూ స్థానికంగా సర్వే ఫలితాలు వస్తున్నాయి. సన్నీ డియోల్‌ పోటీ చేస్తే గెలుపు అనేది నల్లేరు పై నడకే అంటున్నారు. బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ అయిన ధర్మేంద్ర రెండవ భార్య హేమా మాలిని మధుర పార్లమెంటు నియోజక వర్గం నుండి పోటీ చేస్తుండగా, ఆయన తనయుడు అయిన సన్నీడియోల్‌ అదే పార్టీ నుండి ఎంపీగా పోటీ చేస్తున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో మరియు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. వీరిద్దరు గెలిచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తూ పార్లమెంట్‌ లో కలిసి కూర్చునే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందా అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.