Begin typing your search above and press return to search.

గుజరాత్‌ ఎన్నికల తర్వాత ఏపీపైనే బీజేపీ అధిష్టానం దృష్టి: బీజేపీ మాజీ ఎంపీ హాట్‌ కామెంట్స్‌

By:  Tupaki Desk   |   5 Dec 2022 6:30 AM GMT
గుజరాత్‌ ఎన్నికల తర్వాత ఏపీపైనే బీజేపీ అధిష్టానం దృష్టి: బీజేపీ మాజీ ఎంపీ హాట్‌ కామెంట్స్‌
X
మూడు రాజధానుల వ్యవహారంలో జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై బీజేపీ మాజీ టీజీ వెంకటేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోనే హైకోర్టు ఉందని కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందని ఆయన గుర్తు చేశారు. మళ్లీ ఇంతలోనే రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వమే సీమ గర్జనలు నిర్వహించడం ఏమిటని టీజీ వెంకటేష్‌ నిలదీశారు.

అధికారంలో ఉన్న వైసీపీ సీమగర్జన పేరిట ప్రజలను సమీకరించి ఆందోళనలు చేయించడం.. తన నెత్తిపై తానే రాయి వేసుకున్నట్లుగా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల పేరిట జగన్‌ ప్రభుత్వం త్రిశంకుస్వర్గంలో, గాలిమేడల్లో విహరిస్తోందని ఎద్దేవా చేశారు.

చంద్రబాబు కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తానంటే.. జగన్‌ ఏకంగా హైకోర్టు ఇస్తామన్నారని... దేనికీ దిక్కులేదని హాట్‌ కామెంట్స్‌ చేశారు. పైగా, ప్రభుత్వం హైకోర్టు అమరావతిలో ఉంటుందని ఇటీవల సుప్రీంకోర్టులో తన న్యాయవాదితో చెప్పించిందని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టులో చెప్పినదానికి విరుద్ధంగా మళ్లీ ప్రజలతో ఉద్యమాలు చేయిస్తోందని మండిపడ్డారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ దీనిపై స్పందించాలని టీజీ వెంకటేష్‌ మండిపడ్డారు.

వికేంద్రీకరణతో ఎవరికీ ప్రయోజనం ఉండదని అన్నారు. హైకోర్టు రాజధానిలోనే ఉంచాలని కోరారు. హైకోర్టు బెంచి, మినీ సచివాలయం మరోచోట ఏర్పాటు చేయాలని సూచించారు. జమ్మూ–కశ్మీర్, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ ఇలాగే ఉన్నాయని గుర్తు చేశారు. ఏపీ రాజధాని అమరావతే అన్నది బీజేపీ విధానమని తేల్చిచెప్పారు. కర్నూలులో హైకోర్టు విషయంలోనూ ఎవరిపైనో బాణాన్ని గురిపెట్టి మనపైనే వేసుకున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. గుజరాత్‌ ఎన్నికలు ముగింపునకు వచ్చినందున ఇక ఆంధ్రాపై బీజేపీ అధిష్టానం దృష్టి సారిస్తుందని తేల్చిచెప్పారు.

జగన్‌ ప్రభుత్వం రాయలసీమలో పరిశ్రమలకు భూములు కేటాయించిందా? సాగునీటి ప్రాజెక్టులు కట్టించిందా? అని టీజీ వెంకటేశ్‌ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ బిల్లులకు పార్లమెంటులో వైసీపీ మద్దతు ఇస్తున్నందున.. బీజేపీ సైతం వైసీపీని అదే కోణంలో చూస్తుందని తెలిపారు. అంతమాత్రం చేత వైసీపీ పాలనలో లోపాలను బీజేపీ చూస్తూ ఊరుకోబోదని టీజీ వెంకటేష్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రత్యేక హోదాపై వైసీపీ, టీడీపీ రెండూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని తెలిపారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని టీజీ వెంకటేష్‌ తేల్చేశారు. సీఎం సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఇప్పటికీ దిక్కులేదన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.