Begin typing your search above and press return to search.

తెలంగాణ లో బీసీ కి జై కొడుతున్న బీజేపీ .. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   13 Dec 2019 6:04 AM GMT
తెలంగాణ లో బీసీ కి  జై కొడుతున్న బీజేపీ .. ఎందుకంటే ?
X
దేశంలో మెజారిటీ రాష్ట్రాల్లో అధికారం లో ఉన్న బీజేపీ, రెండోసారి నరేంద్రమోడీ ప్రధాని అయిన తర్వాత దేశవ్యాప్తంగా కమలదళాన్ని విస్తరించే పనిలో నిమగ్నమయ్యింది. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దక్షిణాది రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించేందుకు బీజేపీ పెద్దలు వ్యూహరచన చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణపై కమలనాథులు ఫోకస్ పెట్టారు. నాలుగు పార్లమెంట్‌ స్థానాలు గెలిచి ఊపు మీదున్న కమలదళం, రాష్ట్రం లో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌ను దెబ్బతీయడానికి ప్రణాళికలు రచిస్తోంది. పార్టీలోకి భారీగా చేరికలు చేపట్టిన ఆ పార్టీ కొంతమేర పుంజుకుంది.

మరోవైపు ఏ చిన్న ప్రజా సమస్య రైజ్‌ అయినా, ఆందోళనకు దిగుతూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారుతోంది. అలా ఏ అంశాన్నీ వదలకుండా తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పావులు కదుపుతోంది బీజేపీ. ఇక ఇప్పుడు ఆ పార్టీ దృష్టి బీసీలపై పడింది. తెలంగాణ జనాభాలో ఎక్కువగా ఉన్న బీసీ ఓటర్లను తమవైపు తిప్పుకోవడం ద్వారా రాష్ట్రంలో మరింత బలపడవచ్చని భావిస్తోంది కాషాయ పార్టీ.

బీసీ ఓటర్ల మద్దతు ఉన్న టీడీపీ, తెలంగాణ లో బలహీన పడటంతో ఆ స్థానాన్ని ఎలాగైనా భర్తీ చేయాలని చూస్తోంది బీజేపీ. టి టీడీపీ సగానికిపైగా ఖాళీ అయ్యింది. మిగతా నాయకులు సైతం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అలా టీడీపీ కేడర్ తమ వైపు రావడం వల్ల బీసీ ఓటింగ్ తమకు పెరుగుతుందన్న లెక్కలు వేస్తున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు దేవేందర్ గౌడ్ కుమారుడు, వీరేందర్ గౌడ్ తో పాటు పలువురు బీసీ నాయకులను పార్టీలో చేర్చుకోవడం వ్యూహంలో భాగమేనన్న అభిప్రాయాలను పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

బీసీ వర్గానికే చెందిన ప్రధాని మోడీ ఇప్పటికే జాతీయ స్థాయిలో బీసీలకు పెద్దపీట వేస్తున్నారని, ఆ పార్టీ నాయకులు అంటున్నారు. క బీసీ వర్గానికే చెందిన ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో వైపు అధికార పార్టీ తో పాటు ఇతర పార్టీలకు చెందిన పలు బీసీ నాయకులు పార్టీలో చేరే అవకాశం ఉందని బీజేపీ లీడర్లు చెప్తున్నారు. ఇక 2023లో బీసీనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని పార్టీలోని కొందరు సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.