Begin typing your search above and press return to search.

కరోనా హాట్ స్పాట్ గా బెల్జియం .. కర్ఫ్యూ , కఠినంగా నియమాలు !

By:  Tupaki Desk   |   20 Oct 2020 10:30 AM GMT
కరోనా హాట్ స్పాట్ గా బెల్జియం ..  కర్ఫ్యూ , కఠినంగా నియమాలు !
X
కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకి పెరుగుతుంది. గత ఏడాది వెలుగులోకి వచ్చినప్పటి , రోజురోజుకి ఈ కరోనా వేవ్ పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారిని అరికట్టడానికి వ్యాక్సిన్ కోసం వైద్య నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆ వ్యాక్సిన్ వచ్చే వరకు ఈ మహమ్మారి విజృంభణ తగ్గేలా కనిపించడం లేదు. ముఖ్యంగా యూరప్‌ దేశాలైతే కరోనా మహమ్మారి దెబ్బకి చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు అక్కడ సెకండ్ ‌వేవ్‌ ప్రారంభమయ్యిందట. దీనితో కరోనాను అరికట్టడానికి ఇప్పటికే బ్రిటన్‌ కరోనా వైరస్ నిబంధనలను చాలా కఠినంగా అమలుచేస్తున్నది, కొన్ని ప్రాంతాలలో భార్యాభర్తలైనా సరే భౌతికదూరం పాటించాల్సిందేనంటూ నిబంధన తీసుకువచ్చింది.

ఇక బెల్జియంలోనూ కరోనా మహమ్మారి తీవ్రంగా ఉంది. కరోనా వైరస్ కేసులు సునామీలా వెల్లువెత్తే ప్రమాదం ఉందని అక్కడి అధికారులు హెచ్చరికలు జారీచేస్తున్నారు. ఇప్పటికే ముందుజాగ్రత్తగా బార్లు, రెస్టారెంట్లు నెల రోజుల పాటు మూసేసింది బెల్జియం ప్రభుత్వం. అలాగే రాత్రిళ్లు కర్ఫ్యూ విధించింది. గత కొన్ని రోజులుగా బెల్జియంలో కరోనా కేసులు ఎక్కువయ్యాయి. హాస్పిటల్స్‌ లో కేవలం ఎమర్జెన్సీ కేసులను మాత్రమే టేకప్‌ చేస్తున్నారు. అన్ని హాస్పిటల్స్‌లో కరోనా మహమ్మారి పేషంట్లే ఉంటున్నారు. మనం కరోనా సునామీకి చాలా దగ్గరలో ఉన్నామని బెల్జియం ఆరోగ్యశాఖ మంత్రి ఫ్రాంక్‌ వాండెన్‌ బ్రౌకే ప్రకటించడంతో ప్రజలు కూడా , ఈ వైరస్ ను ఎదుర్కోవడం కోసం అప్రమత్తమయ్యారు. రోజుకు అక్కడ కనీసం ఎనిమిది వేలకి పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

వారం రోజుల్లో కేసుల సంఖ్య 79 శాతం పెరగడం చూస్తుంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. బెల్జియం జనాభా కోటికి పైగా ఉంటే, ఇప్పటికే రెండు లక్షలకు పైగా కేసులు అక్కడ నమోదయ్యాయి. పదివేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. కోటికి పైగా జనాభా కలిగిన బెల్జియం, మార్చి నెలలో విజృంభించిన వైరస్ ధాటికి కకావికలమైంది. ఇప్పటివరకు 2లక్షల 20వేల కేసులు నమోదయ్యాయి. వీరిలో పదివేల మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, కోలుకుంటున్న వారిసంఖ్య చాలా తక్కువగా ఉండటమే ఆందోళనకు కారణమవుతోంది. వైరస్‌ సోకినవారు చాలా రోజులపాటు ఆసుపత్రులకే పరిమితం కావడం, పూర్తిగా కోలుకునేందుకు ఎక్కువ సమయం పడుతుండటంతో యూరప్‌ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.