Begin typing your search above and press return to search.

ఎమర్జెన్సీ వెనకా ముందూ : ఇందిరమ్మ నాడు ఏం చేశారు...?

By:  Tupaki Desk   |   25 Jun 2022 5:30 PM GMT
ఎమర్జెన్సీ వెనకా ముందూ : ఇందిరమ్మ నాడు ఏం చేశారు...?
X
ఎమర్జెన్సీకి జూన్ 25తో సరిగ్గా 47 ఏళ్ళు నిండాయి. 1975 జూన్ 35న రాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. అది భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక చీకటి అధ్యాయం అని అంటారు. నిజానికి అసలు ఏం జరిగింది. ఇందిగా గాంధీ దోషిగా ఎలా అయ్యారు. చరిత్ర ఏం చెబుతోంది. నిజంగా నాడు ఎమర్జెన్సీ విధించే పరిస్థితులు ఉన్నాయా. రాజ్యాంగ నిర్మాతలు పెట్టిన అరుదైన ఆ నిబంధనను కేవలం ఇందిరాగాంధీ ఒక్కరే ఎలా ఉపయోగించుకున్నారు. ఇవన్నీ ప్రశ్నలే. జవాబులు మాత్రం అంత సులువుగా దొరకవు.

ఎందుకంటే చరిత్రలో తెలిసిన విషయాలు ఉన్నాయి. తెలియనివి, చీకటిలో కలసిపోయినవి ఎన్నో ఉన్నాయి. దేశానికి 1947లో స్వాతంత్రం వచ్చింది. ఆ తరువాత సరిగ్గా 28 ఏళ్ళకు ప్రజాస్వామ్యం గొంతు నొక్కే ఎమర్జెన్సీతో 18 నెలల పాటు భారత్ విలవిలలాడింది. 1947కి ముంది 150 ఏళ్ళ పాటు పరాయి పాలనలో మగ్గి స్వేచ్చ కోసం తపించి ఎంతో మంది బలిదానం చేసి పోరాడి సాధించుకున్న స్వేచ్చా భారతానికి అతి తక్కువ వ్యవధిలో అతి స్వల్పమైన టైమ్ లోనే విఘాతం ఏర్పడింది.

దానికి కాంగ్రెస్ వైపు నుంచి చూస్తే కనిపించే విషయాలు వేరుగా ఉంటాయి. ప్రతిపక్షాల సైడ్ నుంచి ఆలోచిస్తే మాత్రం ఇందిరమ్మ ఘోరమైన తప్పిదం చేసింది అని అంటారు. ఇక తటస్థంగా ఆలోచిస్తే మాత్రం స్వేచ్చను హరించడం దారుణమే. అది ఏ సమయంలో ఏ విపత్కరమైన పరిస్థితుల్లో చేసినా కూడా అతి పెద్ద ఘోరమే అని చెప్పాలి. ఇంతకీ ఎమర్జెన్సీకి దోహదం చేసిన పరిస్థితులు ఏంటి అన్నది ఒక్కసారి ఆలోచిస్తే ఆనాడు ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా అలహాబాద్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆమెను ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధిస్తూ ఆ తీర్పు ఉంది.

జూన్ 12న అలహాబాద్ హై కోర్టు లో ఇందిరకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీనితో పాటు అదే రోజున గుజరాత్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో విపక్షాలు గెలిచాయి. ఇందిరాగాంధీ నాయకత్వాన కాంగ్రెస్ ఫస్ట్ టైమ్ ఓడింది. ఇక చూస్తే షెడ్యూల్ ప్రకారం 1976లో దేశంలో లోక్ సభ ఎన్నికలు జరగాలి. అంటే ఎన్నికలు పది నెలల ముందు ఉందనగా ఈ విపరిణామాలు సంభవించాయి అన్న మాట.

దానికి తోడు విపక్షాల ఐక్యత ఏంటో గుజరాత్ ఎన్నికలు చాటి చెప్పాయి. ఇక ఎమర్జెన్సీ విధించిన రోజు అంటే జూన్ 25న ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో జయప్రకాష్ నారాయణ్ సభ పెడితే నేల ఈనిందా ఆకాశం చిల్లు పడిందా అనేట్లుగా జనాలు లక్షల్లో తరలివచ్చారు. అది మారుతున్న జనం నాడిని కూడా సూచిస్తోంది అని కాంగ్రెస్ పెద్దలు భావించి ఉండవచ్చు. ఇలా అనేక రకాలైన కారణాలు అన్నీ కలసి ఇందిరా గాంధీని మాజీని చేయడానికి చూస్తున్న సమయం అది.

అందుకే ఇందిరాగాంధీ రాజ్యాంగంలో ఉన్న 352 అధికరణాన్ని ఉపయోగించి. దేశంలో అత్యవసర పరిస్థితి విధించింది. అత్యవసర పరిస్థితి అంటే ఎవరికీ నోరు ఎత్తే చాన్స్ లేదు. అంతా కేంద్రం కంట్రోల్ లోనే సాగుతుంది. పెదవి విప్పితే కఠిన శిక్షలే. ఇక విపక్షాలకు జైలు దారి ఎమర్జెన్సీ చూపించింది. జయ ప్రకాష్ నారాయణ్, వాజ్ పేయ్, అద్వానీ సహా కీలక నేతలు అంతా జైళ్ళలో మగ్గారు. అలా సుదీర్ఘ కాలం జైలు జీవితాన్ని చూసి తీవ్ర అస్వస్థకు గురి అయిన జయ ప్రకాష్ నారాయణ్ తరువాత రోజులో అంటే 1979 ప్రాంతంలో మరణించారు.

అంటే ఎమెర్జెన్సీ చేసిన పాపాలలో ఆయనకు తీవ్ర అనారోగ్యం సోకడం కూడా ఒక కారణంగా ప్రజాస్వామ్య ప్రియులు చెబుతారు. ఇక ఎమర్జెన్సీ టైమ్ లో ఇందిరాగాంధీర్ రాజకీయ వారసుడిగా అప్పటికే చలామణీలో ఉన్న సంజయ్ గాంధీ చక్రం తిప్పారని, ఏకంగా ప్రధాని నివాసం నుంచే ఆయన దేశం మొత్తానికి ఆదేశాలు జారీ చేసేవారు అని చెబుతారు. సుమారుగా పద్దెనిమిది నెలల పాటు సాగిన ఎమెర్జెన్సీలో ఎన్నో ఘోరాలు జరిగాయని కూడా చెబుతారు.

విపక్షాలను అడ్డుకోవడానికి తనకు రాజకీఅయంగా సానుకూలతను తెచ్చుకోవడానికి ఇందిరా గాంధీ ఎమెర్జెన్సీ విధించింది అని అంటారు. అది నిజం అనిపించేలా ఈ దేశంలో ఫస్ట్ టైమ్ ఆరేళ్ళ కాలానికి లోక్ సభ ఎన్నికలు జరిగాయి. 1971లో ఎన్నికలు జరిగితే తిరిగి ఎమెర్జెన్సీ తరువాత 1977 లో ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీ ఓడిపోయింది. కాంగ్రెస్ కూడా ఓడి భారీ మూల్యం చెల్లించుకుంది. అలా ఎమెర్జెన్సీని దేశంలో విధించి ఇందిరా విలన్ అయ్యారు, ఆమెను అలా చేశారు అని కాంగ్రెస్ వాదులు అంటారు.

ఇక వారి దృష్టిలో ఎమెర్జెన్సీ విధింపు ఎంతవరకూ సమంజసం అంటే దేశంలో అరాచకాన్ని తీసుకునివచ్చి పాలనను లేకుండా చేయాలని విపక్షాలు అన్నీ కలసి కుట్ర పన్నాయని, దాన్ని చేదించడానికే అంతటి కఠిన నిర్ణయం ఇందిర గాంధీ తీసుకోవాల్సి వచ్చింది అని చెబుతారు. 1971లో ఇందిర బంపర్ మెజారిటీతో గెలిచారు. ఆ తరువాత అదే ఏడాది పాకిస్థాన్ తో భారత్ చేసిన యుద్ధంలో ఆమె గెలిచారు. అలా బంగ్లాదేశ్ ఏర్పడింది. ఇందిరను అపర కాళి అని ఏకంగా నాటి విపక్ష నేత వాజ్ పేయి పొగిడారు.

మరి ఆ జోరుని తరువాత ఇందిర ఎందుకు కంటిన్యూ చేయలేకపోయారు అంటే నాడు ఇందిర బలపడకుండా విపక్షాలు కుడిఎడమల తేడా లేకుండా కలసిపోయాయి. 1974లో జాతీయ స్థాయిలో జరిగిన రైల్వే సమ్మె జన జీవనాన్ని స్థంభింపచేసింది. అలాగే విపక్షాలు ఆందోళాపధం ఎంచుకుని దేశంలో ఘర్షణ వైఖరిని తీసుకువచ్చేలా చూశారని కాంగ్రెస్ వాదులు అంటారు. ఇందిరను ఎలాగైనా దించేయాలని తరచూ ఆందోళను చేయడంతో పాటు హిం సాంత్మక ఘటనకు కూడా నాడు చోటు చేసుకున్నాయని చెబుతారు.

అనాడు దేశ రాజధానిలో భారత ప్రధాన న్యాయమూర్తి ఎఎన్‌రేపై హత్యాయత్నం జరిగింది. బీహార్‌లోని సమస్తిపూర్‌లో కేంద్ర రైల్వే మంత్రి లలిత్ నారాయణ్ మిశ్రా హత్యకు గురయ్యారు. జూన్ 25, 1975న విపక్షాలు ఢిల్లీలో జరిపిన సభలో సాయుధ బలగాలు పోలీసులు తిరుగుబాటు చేయాలని పిలుపు ఇచ్చారు అని చెబుతారు. అంతే కాదు సఫ్దర్‌జంగ్ రోడ్ నంబర్ వన్ లోని ఇందిరమ్మ అధికార నివాసం వద్దకు విపక్షాలు వెళ్ళి ఘోరావ్ చేయాలని ప్లాన్ చేశాయని అంటారు.

ఇక అప్పటికే బీహార్, గుజరాత్ లలో నవ నిర్మాణ్‌ ఉద్యమాలు విపక్షాల నాయకత్వాన రాజుకున్నాయి. నాడు అంతర్జాతీయ పరిణామాలు చూస్తే దేశం కూడా ఆర్ధికంగా ఇబ్బందులో ఉంది. ద్రవ్యోల్బనం పెరిగిపోయింది. ఒక విధంగా అసహహం అంతటా కనిపిస్తోంది. దాన్ని రెచ్చగొట్టి విపక్షాలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బలమైన ఇందిరను గద్దె దించడానికి కుడి ఎడమల తేడా లేకుండా అంతా ఏకం కావడమే ఇదిరమ్మకు మండించి ఎమెర్జెన్సీని ప్రయోగించారు అని అంటారు.

దానిని ఇందిరా గాంధీ కూడా గట్టిగా సమర్ధించుకున్నారు. జూలై 3, 1975న టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇందిరా గాంధీ మాట్లాడుతూ హింస ఆటంకం, అన్నదే విపక్షాల సిద్ధాంతం అని ఆరోపించారు. ఇలాంటి విధానాలు ప్రజాస్వామ్యంలో చెల్లవని, వారు ప్రజాస్వామ్యవాదులు ఎప్పటికీ కాలేరని ఆమే స్పష్టంగా చెప్పారు. వారు అరాచకాలు చేసి దానికి ప్రజాస్వామ్యం పేరు పెట్టుకోవడం అంటే తన తల్లిదండ్రులను చంపి అనాధను వదిలేయాలి అని వేడుకున్న యువకుడి మాదిరిగా ఉంటుందని ఎద్దేవా చేశారు.

ఇక ఎమెర్జెన్సీ విధించినా పార్లమెంట్ సాఫీగా నడిచిందని కాబట్టి స్వేచ్చకు ముప్పు లేదని ఆమె అభిప్రాయపడ్డారు. దేశాన్ని అరాచకం నుంచి గాడిన‌ పెట్టడానికే ఇందిరాగాంధీ ఎమెర్జెన్సీ మార్గం ఎంచుకున్నారు అని కాంగ్రెస్ వాదులు అంటారు. ఈ రెండింటిలో ఏది నిజం, ఏది కాదు అంటే చరిత్రలో రెండూ భద్రంగానే ఉన్నాయి. వాటిని ఎవరికి వారు బేరీజు వేసుకుని ఆలోచించుకోవాల్సిందే.