Begin typing your search above and press return to search.

ఎంపీ ర‌ఘురామ అరెస్టుపై బండి సంజ‌య్ కామెంట్స్ !

By:  Tupaki Desk   |   15 May 2021 9:30 AM GMT
ఎంపీ ర‌ఘురామ అరెస్టుపై బండి సంజ‌య్  కామెంట్స్ !
X
ఆంధ్రప్రదేశ్ వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం రేపుతోంది. ఈయ‌న అరెస్టుపై అటు ఏపీలోని, ఇటు తెలంగాణ‌లోని ప్ర‌తిప‌క్ష పార్టీలు భ‌గ్గుమంటున్నాయి. ఇప్పుడు తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ స్పందించారు. లాక్‌ డౌన్ ఉన్న‌టైమ్‌ లో తెలంగాణ‌లోకి అంత‌మంది పోలీసులు ఎలా వ‌చ్చారంటూ మండిప‌డ్డారు. ఏపీ నుంచి అంబులెన్సుల్లో హైదరాబాద్ వస్తున్న రోగులను సరిహద్దుల వద్ద అడ్డుకుంటున్న తెలంగాణ పోలీసులు, ఏపీ పోలీసులను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ఎంపీ రఘురామ అరెస్టు దారుణమని అన్నారు.రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోలేని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిత్రుడు జగన్ కోసం కేసీఆర్ నిబంధనలను తుంగలో తొక్కారని మండిపడ్డారు.

లోక్‌సభ స్పీకర్ అనుమతి లేకుండా ఎంపీ రఘురామను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. దీనికి తెలంగాణ ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించారు. ఓ ఎంపీని ఈడ్చుకెళ్లి కారులో తోయడమేంటని బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రఘరామను అరెస్టు చేశారో లేక అపహరించారో ఆయన కుటుంబ సభ్యులకు అర్థం కాలేదంటే పరిస్థితి ఎంత దారుణమో అర్థం చేసుకోవచ్చని , ఎంపీ రఘురామకు 4 నెలల కిందట గుండెకు శస్త్రచికిత్స అయింది. ఒక హృద్రోగితో పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా, ప్రాణాలను అరచేత పట్టుకుని హైదరాబాద్‌ కు వస్తున్న ప్రజలను సరిహద్దుల్లో ఆపేస్తున్న తెలంగాణ ప్రభుత్వం, ఎంపీని అరెస్టు చేయించేందుకు పోలీసులను ఎలా రానిచ్చింది. లాక్‌ డౌన్‌ నిబంధనలను తుంగలో తొక్కి, పదుల సంఖ్యలో ఏపీ సీఐడీ పోలీసుల్ని ఇంత అత్యవసరంగా రాష్ట్రంలోకి ఎందుకు అనుమతించారు, రఘురామ కృష్ణంరాజేమైనా దేశం వదిలి పారిపోతున్నారా, ఎంపీకి ఎన్నో రకాల ప్రత్యేక హక్కులు ఉంటాయి. ఈ విషయం ఏపీ, తెలంగాణ పోలీసులకు తెలియదా అని బండి సంజయ్‌ మండిపడ్డారు.