Begin typing your search above and press return to search.

'సర్జికల్ స్ట్రైక్' చేద్దామని అనుకున్నాం కానీ చివరకు 'శాఫ్రన్ స్ట్రైక్' చేసాం

By:  Tupaki Desk   |   4 Dec 2020 3:36 PM GMT
సర్జికల్ స్ట్రైక్ చేద్దామని అనుకున్నాం కానీ చివరకు శాఫ్రన్ స్ట్రైక్ చేసాం
X
తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఫుల్లు జోష్ మీదున్నారు. గ్రేటర్ ఎన్నికల్లో 46 డివిజన్లలో గెలువటంతో బీజేపీ నేతలు పట్టరాని ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే పోయిన ఎన్నికల్లో గెలిచిన 4 డివిజన్ల నుండి తాజా ఎన్నికల్లో 46 డివిజన్లకు బలం పెంచుకోవటం అంటే మామూలు విషయం కాదు కదా. అందులోను కేసీయార్ ను చావుదెబ్బ కొట్టి. కేసీయార్ కు చావుదెబ్బ ఎందుకంటే గ్రేటర్ పరిధిలో టీఆర్ఎస్ బలం 99 డివిజన్ల నుండి 56 డివిజన్లకు పడిపోయింది కాబట్టే.

ఇదే విషయమై బండి మాట్లాడుతూ 4 డివిజన్ల నుండి ఇన్ని డివిజన్లు గెలుచుకుంటామని తాము అనుకోలేదన్నారు. ఇన్ని డివిజన్లలో గెలిపించటం ద్వారా జనాలు తమపై గురుతర బాధ్యతనే మోపినట్లు బండి అభిప్రాయపడ్డారు. గ్రేటర్ పరిధిలో సర్జికల్ స్ట్రైక్ చేద్దామని అనుకున్నాం కానీ చివరకు శాఫ్రన్ స్ట్రైక్ (కషాయం) చేసినట్లు చెప్పారు. గతంలో జీహెచ్ఎంసిలో కాంట్రాక్టర్లు, కార్పొరేటర్ల దందాలు నడిచేవని ఇకనుండి ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తమాన్నారు.

దుబ్బాక ఉపఎన్నికలో అల్లుడు (హరీష్) పని పట్టామని, ఇపుడు గ్రేటర్ పరిధిలో కొడుకు పనికూడా అయిపోయిందంటు బండి ఎద్దేవా చేశారు. ఇక తమ ముందున్న మిషన్ రాబోయే అసెంబ్లీ ఎన్నికలే అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీనే కచ్చితంగా గెలవబోయే పార్టీగా ప్రకటించేశారు. తమ విజయాన్ని స్టేట్ ఎలక్షన్ కమీషనర్ పార్ధసారధి, డీజీపీ మహేందర్ రెడ్డికి అంకితం ఇస్తున్నట్లు ఎగతాళిగా చెప్పారు.

పార్టీ తరపున ప్రచారం చేసి అభ్యర్ధుల విజయానికి కృషి చేసిన జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, భూపటి యాదవ్ తదితరులకు బండి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ఓల్డ్ సిటిలోని బాగ్యలక్ష్మి అమ్మవారి దయవల్లే తమ అభ్యర్ధులు గెలిచినట్లు బండి చెప్పటం కాస్త ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే భాగ్యలక్ష్మి ఆలయం దర్శనానికి వెళ్ళినపుడు అక్కడ ఎంఐఎం కార్యకర్తలతో గొడవ జరిగిన విషయం తెలిసిందే.