Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్, పీవీ సమాధులు కూల్చాలన్న అక్బరుద్దీన్ .. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేటీఆర్, బండి సంజయ్

By:  Tupaki Desk   |   25 Nov 2020 5:30 PM GMT
ఎన్టీఆర్, పీవీ సమాధులు కూల్చాలన్న అక్బరుద్దీన్ .. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కేటీఆర్, బండి సంజయ్
X
గ్రేటర్ పోరు తారా స్థాయికి చేరుకుంది. డిసెంబర్ 1 న పోలింగ్ జరగబోతుండటం తో ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని పార్టీల నేతలు విమర్శలు , ఆరోపణలు, హామీలతో నగరాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హుస్సేన్ సాగర్ సమీపంలో ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చేయాలంటూ అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర దుమారం రేగుతుంది.

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పై తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. అలాగే అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలని ఖండించారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ ఎన్టీఆర్ గార్లపై ఈ రోజు మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన అనుచితమైన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ఇరువురు నాయకులు కూడా తెలుగు ప్రజల గౌరవాన్ని నిలబెట్టిన మహనీయులు. ఒకరు ప్రధానిగా, మరొకరు ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ప్రజాసేవలో ఉన్నారు. అటువంటి మహానాయకులపై అనుచిత వ్యాఖ్యలు గర్హనీయం. ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యాఖ్యలకు చోటులేదు అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

హుస్సేన్ సాగర్ పై ఉన్న ఎన్టీఆర్, పీవీ సమాధులను కూల్చాలని చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నగరంలో అమీర్ పేట్ కార్పొరేటర్ అభ్యర్థి ప్రచార సభలో బుధవారం పాల్గొన్నఆయన.. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలన్న అక్బర్ వ్యాఖ్యలను ఖండించారు. ‘హుస్సేన్ సాగర్‌పై ఉన్న పీవీ సమాధిని, ఎన్టీఆర్ సమాధిని కూల్చే దమ్ము నీకుందా, నీ అయ్య జాగీరా, నీ తాత జాగీరా భాయ్. పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చిన రెండుగంటల్లో నీ దారుస్సలాంను బీజేపీ కార్యకర్తలు కూల్చేస్తారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మభ్యపెట్టి, ఏమార్చి ఓట్లు పొందాలని టీఆర్ఎస్, ఎంఐఎం నేతలు చూస్తున్నారన్నారు. ఏమార్చి ఓట్లు పొందే ప్రయత్నం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఎంఐఎం చేస్తున్న సవాళ్లను కూడా టీఆర్ఎస్ నేతలు స్వీకరించడం లేదని అన్నారు. హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితే హైదరాబాదులో బీజేపీ గెలుస్తుందని చెప్పారు.