Begin typing your search above and press return to search.

నందమూరి హీరోల మల్టీస్టారర్ పై స్పందించిన బాలయ్య...!

By:  Tupaki Desk   |   2 Jun 2020 9:50 AM GMT
నందమూరి హీరోల మల్టీస్టారర్ పై స్పందించిన బాలయ్య...!
X
ఇటీవల కాలంలో టాలీవుడ్ లో మల్టీస్టారర్ చిత్రాలు ఊపందుకుంటున్నాయి. ఇద్దరు స్టార్ హీరోలు సైతం ఒకే ఫ్రేమ్ లో కనిపించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' 'గోపాల గోపాల' 'మసాలా' 'వెంకీమామ' లాంటి మల్టీస్టారర్ చిత్రాలు తెరకెక్కాయి. అలానే 'మనం' లాంటి సినిమాలో అక్కినేని హీరోలందరూ కలిసి నటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మల్టీస్టారర్ చిత్రాలపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు నందమూరి బాలకృష్ణ. మల్టీస్టారర్ చిత్రాలు చేసే అవకాశం ఉందా అని సదరు యాంకర్ అడుగగా లేదు అన్నట్లు తల ఊపి.. చిన్న హీరోలతో చేసుకుంటే బెటర్ అని సమాధానం ఇచ్చాడు. ''గతంలో కొన్ని సినిమాలు చేదు అనుభవం మిగిల్చింది. అంతేకాకుండా నాన్నగారు, ఏఏన్నాఆర్ కలిసి ఎన్నో చిత్రాలు నటించారు. కానీ వాటిలో చాలా సినిమాలు నిరాశను కలిగించాయి. నాకు కొన్ని అసంతృప్తిని కలిగించాయి. అందుకే మొహమాటం లేకుండా నటించనని చెబుతాను. నేను ఏదైనా అభిప్రాయాన్ని చెప్పానంటే దాని వెనుక చాలా బలమైన కారణం ఉంటుంది. పదవులు మాకు అలంకారం కాదు. పదవులకు మేమే అలంకారం అని అన్నారు. కొన్ని కథలు నచ్చి కొందరు హీరోలకు కాల్ చేస్తే సమాధానం చెప్పలేదు. అందుకే నేను అలాంటి వారితో మాట్లాడటం మానేస్తాను.. వారికి రెస్పెక్ట్ కూడా ఇవ్వను'' అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య.

కల్యాణ్ రామ్ నిర్మాతగా బాలయ్య - ఎన్టీఆర్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ చిత్రం రాబోతోందని వార్తలు వస్తున్నాయి.. నందమూరి అభిమానుల కోసం మీరు కలిసి నటించే అవకాశం ఉందా అని అడుగగా.. ''మంచి కథ కుదిరితే ఖచ్చితంగా మల్టీ స్టారర్ చేస్తాం.. చాలా మంది మల్టీస్టారర్ చిత్రాలకు సంబంధించి కథను చెప్పారు. కానీ అంతగా నచ్చలేదు.. మల్టీస్టారర్ అంటే 'షోలే' సినిమా అంత భారీగా బ్రహ్మాండంగా ఉండాలి స్టోరీ కుదరాలి'' అని బాలకృష్ణ వెల్లడించారు. అంతేకాకుండా ''నా జీవితంలో స్వర్గీయ ఎన్టీఆర్ నాకు దైవం స్పూర్తి అన్నీ ఆయనే. అందుకే ప్రతీ రోజు నాన్నగారి సినిమాలు చూస్తుంటాను. నెట్‌ ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాలు చూస్తాను. ఎన్ని ఉన్నా నాన్నగారి సినిమాలు చూడంది పడుకోను. షూటింగ్ ఉంటే మాత్రం కనీసం 10 లేదా 15 నిమిషాలు అయినా సినిమా చూస్తాను'' అని బాలయ్య చెప్పుకొచ్చారు. మొత్తం మీద మంచి స్టోరీ దొరికితే బాబాయ్ బాలయ్య - అబ్బాయ్ ఎన్టీఆర్ లను ఒకే స్క్రీన్ పై చూసే అవకాశం నందమూరి అభిమానులకు కలగబోతోంది.