Begin typing your search above and press return to search.

చరిత్ర మరువని ఎన్టీఆర్ కు.. బాలయ్య ‘శతజయంతి’ జ్ఞాపికం

By:  Tupaki Desk   |   16 May 2022 6:55 AM GMT
చరిత్ర మరువని ఎన్టీఆర్ కు.. బాలయ్య ‘శతజయంతి’ జ్ఞాపికం
X
తెలుగు జాతి యావత్తు మరిచిపోని ఏకైక వ్యక్తి మన నందమూరి తారక రామారావు.. వెండితెరపై వెలిగినా.. రాజకీయాల్లో మెరిసినా ఆయన స్థానాన్ని భర్తీ చేసే వారు ఎవరూ లేరు. నేటి చంద్రబాబు నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ వరకూ అందరూ ఆయన శిష్యులే. ఇక సినిమాల్లో ఆయనను ఆదర్శంగా తీసుకొని వచ్చి ఇప్పుడు వెండితెరను ఏలుతున్న వారు ఎందరో ఉన్నారు.

తెలుగు ప్రేక్షకుల, ప్రజల గుండెల్లో అన్న నందమూరి తారక రామారావు సృష్టించుకున్న సుస్థిరమైన స్థానం అలాంటిది మరీ.. తెలుగు భాషపై.. తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామరం. అందుకే ఆయన తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అయ్యారు. సినిమా రంగమైనా.. రాజకీయ వేదిక అయినా.. అన్ని చోట్ల కోట్లాది మంది మనసులో నిలిచిపోయిన యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు . ఎన్నేళ్లయినా.. ఎన్నాళ్లైనా ఆ మహానుభావుడు తెలుగు జాతిపై చేసిన సంతకం మరువలేనిది.

ఈ ఏడాది మే 28 నుండి ఆయన శత జయంతి వేడుకలు ప్రారంభం కానున్నాయి. అన్నగారి శత జయంతి వేడుకలు హిందూపురం ఎమ్మెల్యే 'నటసింహ'నందమూరి బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఘనంగా జరగనున్నాయి.

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టిన ఊరు నిమ్మకూరులో ఈ వేడుకలు మే 28న ఉదయం బాలకృష్ణ గారి చేతుల మీదుగా అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. అలాగే మధ్యాహ్నం గుంటూరు లోను, సాయంత్రం తెనాలిలోనూ ఈ శత జయంతి సందర్భంగా ఏడాది పొడవునా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలను సైతం బాలకృష్ణ ఆధ్వర్యంలో, ఆయన చేతుల మీదుగానే ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. వీటికి సంబంధించిన ఏర్పాట్లు భారీగానే జరగనున్నాయి.

ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు అంటే.. 10 కోట్ల మంది తెలుగు వారికి ప్రతి ఇంటి పండగ. ఈ వేడుకలకు అభిమానులు సైతం భారీగా హాజరు కాబోతున్నారు. స్వర్గీయ తారక రామారావు గారి శత జయంతి వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.

ఈ వేడుకకు నందమూరి ఫ్యామిలీ కూడా సపోర్టు చేయనున్నారు. అగ్రహీరోలు సైతం ఇందులో పాల్గొనబోతున్నారని తెలిసింది. ఎన్నడూ లేని విధంగా ఎన్టీఆర్ ను మరోసారి గుర్తు చేసేలా ఆయన జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు బాలకృష్ణ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. టాలీవుడ్ సైతం దీనికి మద్దతుగా ముందుకు వస్తోందని ప్రచారం సాగుతోంది.