Begin typing your search above and press return to search.

బాబు ఏపీ ఎంట్రీ: జగన్ ఓకే.. మోడీ నాట్ ఓకే

By:  Tupaki Desk   |   25 May 2020 3:31 AM GMT
బాబు ఏపీ ఎంట్రీ: జగన్ ఓకే.. మోడీ నాట్ ఓకే
X
రాకరాక చంద్రబాబు ఏపీ వస్తున్నాడు.. దాదాపు రెండు నెలలు దాటింది చంద్రబాబు ఏపీ ముఖం చూసి.. పోనీలే పెద్దాయన అని ఏపీ సీఎం జగన్ అనుమతిచ్చాడు. కానీ మోడీ మోకాలడ్డేశాడు.

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనకు ప్రధాని మోడీ అడ్డుపుల్ల వేశాడు. రెండు నెలల తరువాత సొంత రాష్ట్రానికి రావడానికి ఆయన పూర్తి ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ.. చివరి నిమిషంలో ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల చంద్రబాబు విశాఖ పర్యటన రద్దయింది.

ప్రస్తుతం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో గల సొంత నివాసంలో చంద్రబాబు ఉంటున్నారు. లాక్డౌన్ కు ముందే హైదరాబాద్ వచ్చి చిక్కుకుపోయారు. రెండు నెలలుగా ఏపీకి దూరంగా పక్కరాష్ట్రంలో ఉంటున్నారు. తాజాగా లాక్ డౌన్ సడలింపులు ఏపీలో భారీగా ఇవ్వడంతో ఏపీకి వస్తానంటూ అనుమతి ఇవ్వాలని డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు.

చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ విశాఖపట్నంలో పర్యటించడానికి ఆదివారం మధ్యాహ్నమే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అనుమతి ఇచ్చారు. ఈ ఉదయం 10.30 గంటలకు చంద్రబాబు శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలు దేరి విశాఖపట్నం చేరుకోవాల్సి ఉంది. ఎల్జీ పాలిమర్స్ మృతుల కుటుంబాలు, బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన రోడ్డు మార్గంలో గుంటూరు జిల్లా ఉండవల్లి లోని తన నివాసానికి చేరుకోవాల్సి ఉంటుంది.

అయితే చంద్రబాబు పర్యటనకు కేంద్రం షాకిచ్చింది. ఏపీలో విమాన సర్వీసుల పునరుద్ధరణను వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం. దేశం మొత్తం సోమవారం నుంచే డొమెస్టివ్ విమాన సర్వీసులు ఆరంభం కాబోతున్నప్పటికీ ఏపీ, పశ్చిమ బెంగాల్ లో మంగళవారం ఆరంభమవుతాయి. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వశాఖ ఓ ప్రకటన జారీ చేసింది. కేంద్రం చివరి నిమిషంలో తీసుకున్న అనూహ్య నిర్ణయం వల్ల చంద్రబాబు పర్యటన రద్దు అయ్యింది.

విమాన సర్వీసులు వాయిదా పడడం వల్ల చంద్రబాబు, నారా లోకేష్ మార్గంలో అమరావతికి చేరుకోవచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుగుదేశం కూడా కన్ఫం చేసింది. దీంతో హైదరాబాద్ నుంచి నేరుగా అమరావతికి చంద్రబాబు రాబోతున్నారు. విశాఖపట్నం పర్యటన దాదాపుగా రద్దు అయినట్టే. ఇలా జగన్ సర్కార్ అనుమతిచ్చినా కానీ మోడీ మాత్రం బాబుకు మోకాలడ్డేశారు.