Begin typing your search above and press return to search.

అబ్దుల్ కలాంకు బీఎస్ ఎన్ ఎల్ నోటీసులు

By:  Tupaki Desk   |   5 Dec 2015 9:29 AM GMT
అబ్దుల్ కలాంకు బీఎస్ ఎన్ ఎల్ నోటీసులు
X
మాజీ రాష్ట్రపతి - మార్గదర్శి అబ్దుల్ కలాం ఇప్పుడు మన మధ్య లేరు.. కానీ, బీఎస్ ఎన్ ఎల్ సంస్థ మాత్రం ఆయన పేరుతో నోటీసు పంపించింది. ఆయన తమకు రూ.1029 బకాయి ఉన్నారని పేర్కొంటూ నోటీసు ఇవ్వడంతోపాటు దాన్ని ఒన్ టైం సెటిల్ మెంటు చేసుకోవాలని.. లేకుంటే ఆయన ఆస్తులు జప్తు చేస్తామని కూడా హెచ్చరించారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం.

2724800 నంబరుపై కలాం రూ.1029 బిల్లు బాకీ ఉన్నారని పేర్కొంటూ ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ ఎన్ ఎల్ ఆయన పేరిట నోటీసు పంపింది. నవంబరు 18వ తేదీన బీఎస్ ఎన్ ఎల్ త్రివేండ్రం రీజియన్ అకౌంట్స్ అధికారి ఈ నోటీసు ఇష్యూ చేశారు. గడువులోగా బిల్లు కట్టకపోతే కలాం ఇళ్లూపొలాలు స్వాధీనం చేసుకుంటామని అందులో హెచ్చరించారు. ఆ మేరకు బీఎస్ ఎన్ ఎల్ రికవరీ అధికారికి ఆదేశాలు జారీ చేసింది.

కేరళ రాజ్ భవన్ లో కలాం గతంలో రెండు రోజులు అతిథిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన ఫోన్ వినియోగానికి సంబంధించిన బిల్లుగా దీన్ని పంపించారు.

అయితే.. రాజ్ భవన్ లో కలాం ఉన్నప్పుడు దానికి సంబంధించిన బిల్లు అని... అది రాజ్ భవన్ ఖాతాలో రావాలే కాని, కలాం పేరిట ఎలా బిల్లు ఇష్యూ చేస్తారన్న ప్రశ్న వస్తోంది. దీంతో బీఎస్ ఎన్ ఎల్ వ్యవహారంపై విమర్శలు వస్తున్నాయి.