Begin typing your search above and press return to search.

బీజేపీకి ఎదురుగాలి

By:  Tupaki Desk   |   2 May 2021 5:30 PM GMT
బీజేపీకి ఎదురుగాలి
X
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. బెంగాల్ , తమిళనాడు, కేరళలో బీజేపీకి భంగపాటు ఎదురైంది. చిన్న రాష్ట్రాలు అసోం, పుదుచ్చేరిలో మాత్రమే బీజేపీ ఉనికి చాటుకుంది.

తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో అయితే బీజేపీకి తీవ్ర నిరాశ ఎదురైంది. తిరుపతి, నాగార్జున సాగర్ లో ఆ పార్టీ అభ్యర్థులు డిపాజిట్ కూడా దక్కించుకోని పరిస్థితి ఏర్పడింది.

దుబ్బాకలో విజయం.. జీహెచ్ఎంసీలో ఎక్కువ సీట్లు సాధించడంతో నాగార్జున సాగర్ లోనూ పాగావేయాలని బీజేపీ భావించింది. కానీ పరాజయం మాత్రం తప్పలేదు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కలేదు.

నాగార్జున సాగర్ లో బీజేపీ అభ్యర్థి రవికుమార్ కు 7159 ఓట్లు దక్కాయి. అయితే గత ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన కంకణాల నివేదిత రెడ్డికి 2675 ఓట్లు వచ్చాయి. గత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో బీజేపీ ఓట్లను పెంచుకుంది. అయితే కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి తామే టీఆర్ఎస్ కు ప్రత్యామ్మాయం అని ప్రచారం చేసుకుంటున్న బీజేపీకి ఈ ఎన్నికల ఫలితాలు మాత్రం రుచించడం లేదు.

ఇక్కడే కాదు.. ఏపీలోనూ రెండో స్థానంలో నిలుస్తామన్న బీజేపీకి శృంగభంగం ఎదురైంది. తిరుపతిలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు కేవలం 40వేల ఓట్లపైనే వచ్చాయి. అదే టీడీపీ అభ్యర్థికి 3 లక్షలపైన ఓట్లు వచ్చాయి. ఇక గెలిచిన వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 5 లక్షలకు పైన ఓట్లు వచ్చాయి. టీడీపీని మూడో స్థానానికి నెట్టివేస్తామని.. రెండో స్థానంలోకి వస్తామన్న బీజేపీ ఆశలు నెరవేరలేదు.

ఇక బెంగాల్ లోనూ మమతను గద్దెదించుతామని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా మోహరించినా కూడా వారి ఆశలు నెరవేరలేదు. ఘోరంగా ఓడిపోయారు. ఇక తమిళనాడు, కేరళలోనూ బీజేపీ తేలిపోయింది. డబుల్ డిజిట్ కు చేరుకోలేదు. దీంతో బీజేపీకి ఈ ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో భంగపాటు ఎదురైందని చెప్పకతప్పదు.