Begin typing your search above and press return to search.

బీఫ్ భారీగా తినేయండి.. బీజేపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

By:  Tupaki Desk   |   1 Aug 2021 2:30 AM GMT
బీఫ్ భారీగా తినేయండి.. బీజేపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..
X
బీఫ్‌(గోమాంసం). ఈ పేరు వినేందుకు.. అనేందుకు కూడా.. బీజేపీ నేత‌లు చాలా ఇబ్బంది ప‌డతారు. గోమాంసాన్ని నిషేధించా ల‌నే ఉద్య‌మం కూడా చేస్తున్న కొంద‌రు నాయ‌కులు బీజేపీలో ఉన్నారు. ఇప్ప‌టికే ఏపీలో గోవ‌ధ‌కు వ్య‌తిరేకంగా.. బీజేపీ తీవ్ర స్థాయిలో రాజ‌కీయం చేస్తోంది. ఇక‌, కేంద్రంలోని కొంద‌రు స‌చివులు కూడా సంద‌ర్భాను సారంగా.. గోవ‌ధ‌కు వ్య‌తిరేకంగా మాట్లాడుతూ.. హిందూ ఓటు బ్యాంకును ప‌దిలంగా కాపాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అస‌లు బీజేపీ ఎన్నిక‌ల గుర్తును కూడా `గోవుగా` మార్చాలంటూ.. గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో కొంద‌రు డిమాండ్లు చేసిన విష‌యం కూడా తెలిసిందే.

అయితే.. ఇంత పెద్ద బీజేపీ సంక‌ల్పాన్ని తోసిపుచ్చుతూ.. బీజేపీకి చెందిన మంత్రి ఒక‌రు.. బ‌హిరంగ వేదిక‌పై.. గోమాంసానికి అనుకూలంగా వ్యాఖ్య‌లు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. బీఫ్ తినడాన్ని మేఘాలయ బీజేపీ మంత్రి ప్రోత్సహిస్తూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు చికెన్, మటన్, చేపల కంటే ఎక్కువగా బీఫ్ తినాలని స్వయంగా ఆయన పిలుపు ఇచ్చారు. బీజేపీ సీనియర్ నేత అయిన సాన్‌బర్ షులియా పశు సంవర్ధక, వెటర్నరీ మంత్రిగా ఉన్నారు. అయితే.. ఆయ‌న బీజేపీ సిద్దాంతాల‌ను బాగానే ఆక‌ళింపు చేసుకున్నారు. కానీ.. స్థానికంగా మేఘాల‌య‌లో ప్ర‌జ‌లు ఎక్కువ‌గా బీఫ్‌ను తీసుకుంటారు. అయితే.. దీనిపై కొంద‌రు బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో మంత్రి షులియా.. తాజాగా చేసిన వ్యాఖ్య‌లు సంచ‌ల‌నంగా మారాయి. ''ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరికీ నచ్చింది తినే స్వేచ్ఛ ఉంటుంది. చికెన్, మటన్ ,చేపల కంటే ఎక్కువగా బీఫ్ తినమని నేను ప్రోత్సహిస్తున్నాను. ఇందువల్ల పశు వధపై బీజేపీ నిషేధం విధించిందనే అపోహలు తొలగిపోతాయి'' అని షులియా అన్నారు. పొరుగు రాష్ట్రంలో ఉన్న 'కౌ లెజిస్లేషన్' ప్రభావం మేఘాలయకు పశువుల రవాణాపై పడకుండా చూడాలని ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మతో మాట్లాడతానని కూడా ఆయన చెప్పారు. మేఘాలయ, అసోం మధ్య చిరకాల సరిహద్దు అంశంపై మంత్రి మాట్లాడుతూ, సరిహద్దులను, రాష్ట్ర ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఇప్పుడెంతైనా ఉందని చెప్పారు.

మ‌రి ఇత‌ర పార్టీల నేత‌లు, వారి సిద్ధాంతాల విష‌యంలో గోవ‌ధ‌ను అడ్డు పెట్టి మీరు హిందువుల‌కు వ్య‌తిరేకులు అనే కామెంట్లు చేసే బీజేపీ నేత‌లు ఇప్పుడు ఏమంటారో చూడాలి. మ‌రీ ముఖ్యంగా.. ఏపీ బీజేపీ సార‌థి.. సోము వీర్రాజు తాజా ప‌రిణామాల‌పై ఎలా రియాక్ట్ అవుతారో.. గోవ‌ధ‌ను వ్య‌తిరేకిస్తున్న ఆయ‌న‌.. బీజేపీ మంత్రిగారి వ్యాఖ్య‌ల‌ను తిప్పి కొడతారో.. నాకెందుకులే అని నిమ్మ‌ళంగా ఉంటారో చూడాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా.. ఎక్క‌డి అవ‌స‌రం మేర‌కు అక్క‌డి పాట పాడే బీజేపీ నేత‌ల‌కు ఇవ‌న్నీ మామూలేన‌ని.. అంటున్నారు ప‌రిశీల‌కులు.