Begin typing your search above and press return to search.

బెంగాల్ పోలీసులతో బూట్లు నాకిస్తామన్నా బీజేపీ నేత ... ఎవరంటే ?

By:  Tupaki Desk   |   26 Nov 2020 12:30 AM GMT
బెంగాల్ పోలీసులతో బూట్లు నాకిస్తామన్నా బీజేపీ నేత ... ఎవరంటే ?
X
ప్రభుత్వాలు , ప్రజాప్రతినిధులు వస్తుంటారు , పోతుంటారు కానీ పోలీస్ వ్యవస్థ అనేది శాశ్వతం. పోలీసులు నిత్యం ప్రజల కోసం , ప్రజా క్షేమం కోసమే పనిచేస్తుంటారు. అలాంటి ప్రజా సేవకుల పై పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయన మరెవరో కాదు .. బెంగాల్ బీజేపీ ఉపాధ్య‌క్షుడు రాజు బెన‌ర్జీ. రాష్ట్రంలో దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని , గూండాగిరి ఎక్కువైంది అని , దాన్ని అడ్డుకోవాల్సిన పోలీసులు కూడా వారికి వత్తాసు పలుకుతున్నారని , బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే పోలీసుల‌తో బూట్లు నాకిస్తామ‌ని అన్నారు. దుర్గాపూర్‌లో జ‌రిగిన ఓ స‌మావేశంలో పాల్గొన ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

రాష్ట్రంలో గుండాల రాజ్యం కొనసాగుతోంది . పోలీసులు ఎటువంటి సహాయ సహకారాలను సామాన్య ప్రజలకు అందించడం లేదన్నారు. అలాంటి పోలీస్ సిబ్బంది ని ఏం చేయాలి. మేమైతే బిజెపి అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయ‌న చేసిన ఈ వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. మమతా బెనర్జీ ప్రభుత్వం హయాంలో పశ్చిమ బెంగాల్లో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రజలకు సరైన న్యాయం జరగడం లేదని బిజెపి నాయకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గ‌త కొద్దిరోజులుగా భాజ‌పా నేత‌ల‌కు, మ‌మ‌త బెన‌ర్జీ తృణ‌ముల్ కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి మ‌ధ్య మాట‌ల యుద్దం కొన‌సాగుతోంది. బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కైలాశ్ విజ‌య్‌వార్గియా సైతం మంగ‌ళ‌వారం ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. మహిళా నేత ముఖ్య‌మంత్రిగా ఉన్నా కూడా రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని.. వారి పరిస్థితి అత్యంత ద‌య‌నీయంగా మారింద‌న్నారు. దేశ‌మంత‌టా ఒక చ‌ట్టం న‌డుస్తుంటే.. బెంగాల్ ‌లో మాత్రం టీఎంసీ చ‌ట్టం న‌డుస్తోందని ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు.

బీజేపీ నేత రాజు బెనర్జీ తాజా వ్యాఖ్యలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా, బీజేపీ నేత చేసిన దారుణ వ్యాఖ్యలకు పోలీసు యంత్రాంగం ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి . తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ సీఎం గా ఉన్న పశ్చిమ బెంగాల్ లో 2021 జనవరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీ బెంగాల్ లో పాగా వేయాలని ఆలోచిస్తుంది. అయితే , మమత కూడా బీజేపీ వ్యూహాలకి చెక్ పెట్టాలా ప్రణాళికలు రచిస్తుంది.