Begin typing your search above and press return to search.

కేంద్రంలో బీజేపీకే ఛాన్స్ అనేసిన చంద్రబాబు!

By:  Tupaki Desk   |   22 April 2019 9:36 AM GMT
కేంద్రంలో బీజేపీకే ఛాన్స్  అనేసిన చంద్రబాబు!
X
ఒకవైపు భారతీయ జనతా పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని అంటూనే.. మరోవైపు ఆ పార్టీకి మంచి స్థాయిలోనే సీట్లు దక్కుతాయని అన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి చంద్రబాబు నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీని ఓడించాలని అంటూ చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ పిలుపు గత కొన్నాళ్లుగా చంద్రబాబు అన్ని చోట్లా ఇస్తున్నారనుకోండి.

అందులో భాగంగా కర్ణాటకకు కూడా వెళ్లి చంద్రబాబు నాయుడు బీజేపీ మీద దుమ్మెత్తి పోశారు. బీజేపీని ఓడించాలని కాంగ్రెస్- జేడీఎస్ కూటమిని గెలిపించాలని చంద్రబాబు నాయుడు కర్ణాటకలో కాలికి బలపం కట్టుకుని తిరిగారు. మోడీ విషయంలో చంద్రబాబు నాయుడు రకరకాల ఆరోపణలు చేశారు. గతంలో తను ఏ విషయంలో మోడీని ప్రశంసించారో ఇప్పుడు అవే విషయాల్లో చంద్రబాబు నాయుడు మోడీని విమర్శించారు. స్థూలంగా మోడీని అధికారం నుంచి దించాల్సిందే అని పిలుపునిచ్చారు.

అయితే చంద్రబాబు అంతటితో ఆగలేదు. కేంద్రంలో బీజేపీకి దక్కే సీట్లు ఎన్నో కూడా ఒక నంబర్ చెప్పేశారు. బీజేపీకి ఓటమి ఖాయమని చెప్పిన చంద్రబాబు ఆ పార్టీ నూటా డెబ్బై ఎంపీ సీట్లను నెగ్గగలదు అనేశారు. ఒక లెక్క ప్రకారం అయితే అది బీజేపీకి ఓటమే. మరో లెక్క ప్రకారం బీజేపీకే మళ్లీ కేంద్రంలో అధికారం దక్కుతుంది.. అని చెప్పారు చంద్రబాబు నాయుడు! మోడీని విపరీతంగా విమర్శిస్తున్న బాబు బీజేపీకి నూటా డెబ్బై ఎంపీ సీట్లు వస్తాయని వ్యాఖ్యానించడం ఆసక్తిదాయకంగా మారింది.

కేంద్రంలో హంగ్ తరహా పరిస్థితి రావొచ్చని చాలా మంది అంచనా వేస్తున్నారు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు బీజేపీ నూటా డెబ్బై సీట్లు గెలుస్తుందని అన్నారు. ఈ మాత్రం సీట్లు దక్కితే చాలు.. ఎంచక్కా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఎవరికైనా అవకాశం ఉంటుంది. నూటా డెబ్బై సీట్లను సాధించడం అంటే బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మిగిలినట్టే!

ఫలితంగా..ఆ పార్టీ కొంతమంది మిత్రులను కలుపుకుంటే ఎంచక్కా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. శివసేన, జేడీయూ, అకాళీదల్ వంటి పార్టీల మద్దతు బీజేపీకే ఉంటుంది. ఇక తమిళనాట అన్నాడీఎంకే కొద్దో గొప్పో సీట్లు సాధించుకున్నా చాలు.

ఆ తర్వాత ఇప్పటి వరకూ కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ ఎస్, బీజేడీ వంటి పార్టీలను కమలం పార్టీ కలుపుకుంటే.. ఎంచక్కా మెజారిటీకి దగ్గరైపోయే అవకాశాలున్నాయి. అయినా బీజేపీని విపరీతంగా వ్యతిరేకిస్తున్న చంద్రబాబే ఆ పార్టీకి నూటా డెబ్బై సీట్లు వస్తాయని అన్నారంటే.. ఆ పార్టీ ప్రదర్శన మరి కాస్త మెరుగ్గా కూడా ఉండొచ్చు. ఏతావాతా చంద్రబాబు చెబుతున్నది ఏమిటంటే.. మళ్లీ బీజేపీ కేంద్రంగానే కేంద్రంలో అధికారం ఉంటుందని.. ఆయన అంటున్నట్టున్నారు.. అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!