Begin typing your search above and press return to search.

జగన్ ఇలాకాలో కాషాయ జెండా...?

By:  Tupaki Desk   |   20 Jan 2022 2:30 AM GMT
జగన్ ఇలాకాలో కాషాయ జెండా...?
X
వైసీపీని ఏర్పాటు చేసిన దగ్గర నుంచి జగన్ కి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్న జిల్లాలు రాయలసీమలోని నాలుగు అనే చెప్పాలి. ఈ జిల్లాలలో వైసీపీ ఎపుడూ ఓడలేదు. పైగా మెజారిటీలు పెంచుకుంటూ వచ్చింది. 2014 ఎన్నికల్లో టీడెపీ పొత్తుల వల్ల కొంత మేర ఇబ్బంది వచ్చినా అసలూ వడ్డీని కలిపి చెల్లించేసేలా 2019 ఎన్నికల్లో గట్టిగానే విక్టరీ కొట్టింది. ఇదిలా ఉంటే రాయలసీమలో వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీకి ఎక్కువ సీట్లే వస్తాయని అంటున్నారు. ఇక ఇక్కడ టీడీపీకి కూడా బాగానే బలం ఉంది. అయితే కాలాలు మారడంతో ఇప్పటికైతే కొంత తగ్గింది. 2019 తరువాత సీమలో టీడీపీ నాయకులు పెద్దగా యాక్టివ్ గా ఉండడంలేదు అన్న విమర్శలు ఉన్నాయి.

దాంతో ఈ గ్యాప్ ని తమకు అనుకూలంగా మలచుకుని సీమలో కాషాయం జెండాను పాతడానికి చూస్తోంది. ఈ మధ్యనే ఆత్మకూరులో జరిగిన మతపరమైన వివాదంతో కొంత మేర బీజేపీకి సెంటిమెంట్ పండించడానికి అవకాశం ఏర్పడింది. ఇక కర్నూల్, కడప జిల్లాల్లో మైనారిటీ వర్గం కొన్ని ప్యాకెట్లలో ఉంది. దాంతో హిందూత్వను అక్కడ గట్టిగా నినదించడం ద్వారా తమకు కావాల్సిన రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు.

ఈ నేపధ్యంలో బీజేపీ అగ్ర నాయకులు అంతా నాలుగు రోజుల పాటు కర్నూల్, కడప, అనంతపురం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు సహా కీలక నేతలు అంతా సీమ జిల్లాల టూర్ లో గట్టిగా సౌండ్ చేయనున్నారు. మరో వైపు ఆరెస్సెస్ సమావేశాలకు కూడా సోము వీర్రాజు ఇతర బీజేపీ పెద్దలు హాజరవుతున్నారు.

రాయలసీమలో ఈ నెల 22న భరీ సభను కూడా నిర్వహించడం ద్వరా కమల కాంతులను పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో విరజిమ్మాలని చూస్తున్నారు. ఈ పరిణామల క్రమంలో సీమలో బీజేపీ రాజకీయ దూకుడు ఏ విధంగా ఉంటుంది అన్నది చర్చగా ఉంది. సీమ జిల్లాల్లో హిందూత్వ కార్డుని వాడాలని గత కొన్నాళ్ళుగా బీజేపీ చూస్తోంది.

అయితే అదంతగా వర్కౌట్ కావడంలేదు. ఆ మధ్య పొద్దుటూరు లో టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ వారు ఆందోళన చేశారు. కానీ వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించి ఈ విగ్రహావిష్కరణను నిలుపు చేయడంతో బీజేపీ కి ఊపు రాలేదు. ఇపుడు మాత్రం మరింత గట్టిగానే సీమలో హిందూత్వ కార్డుని వాడాలని డిసైడ్ అవుతున్నారుట. మరి చూడాలి ఏం జరుగుతుందో.