Begin typing your search above and press return to search.

టీడీపీ రచ్చ.. బీజేపీకి అడ్వాంటేజ్!

By:  Tupaki Desk   |   15 July 2019 2:30 PM GMT
టీడీపీ రచ్చ.. బీజేపీకి అడ్వాంటేజ్!
X
తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ సుప్రీమో చంద్రబాబు నాయుడే. ఆయన తనయుడిని తదుపరి సుప్రిమోగా తయారు చేయాలని అనుకుంటున్నారు. ఐదేళ్ల పాటు అధికారం ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలకు ఎవరూ అడ్డు రాలేదు. అయితే అధికారం కోల్పోయిన వేళ చంద్రబాబు తనయుడిపై సొంత వారే ధ్వజమెత్తుతూ ఉన్నారు.

చంద్రబాబుకు నమ్మకమైన వారు అనుకున్న వారే లోకేష్ ను కించపరుస్తూ పోస్టులు పెడుతున్నారంటే పరిస్థితి ఎంత వరకూ వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

లోకేష్ ను పల్లెత్తు మాట అనడానికి అయినా ఎవరికైనా బుద్ధి పుట్టేదా? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నంత సేపూ అలాంటి పరిస్థితే ఉంది. అయితే ఇప్పుడు టీడీపీ అధికారం కోల్పోవడంతో - లోకేష్ ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేకపోవడంతో ఆయన సొంత వాళ్లకే మరింత లోకువ అయ్యారు.

ఈ క్రమంలో గతంలో లోకేష్ ను ఉద్ధేశించి ప్రత్యర్థులు ఎలాంటి మాటలు అనేవారో ఇప్పుడు ఇన్ డైరెక్టుగా టీడీపీలోని కొంతమంది అవే మాటలను అంటున్నారు. ఇలా తెలుగుదేశం పార్టీలో రచ్చ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ పరిస్థితులను అడ్వాంటేజ్ గా మలుచుకోవాలని భారతీయ జనతాపార్టీ భావిస్తున్నట్టుగా ఉంది. ఈ విషయంలో వారు తమదైన రీతిలో మాట్లాడుతూ ఉన్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలకు భవిష్యత్తుపై భయం పట్టుకుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అంటున్నారు. రాజకీయ భవితవ్యంపై ఆశలు ఉన్న వారు టీడీపీలో ఉండటానికే ఆసక్తిని చూపడం లేదని జీవీఎల్ అంటున్నారు. ఇప్పటికే కొందరు బయటకు వచ్చారని, మరి కొందరు త్వరలో రావొచ్చని చెప్పుకొచ్చారు. మొత్తానికి టీడీపీ పడిన వేళ గ్యాప్ ఇవ్వకుడా బీజేపీ పంచ్ లు ఇవ్వాలని చూస్తున్నట్టుగా ఉంది!