Begin typing your search above and press return to search.

బీజేపీలో చేరితే వ్య‌భిచారి అయినా ప్ర‌తివ‌త్రేనా...!

By:  Tupaki Desk   |   14 July 2019 5:35 AM GMT
బీజేపీలో చేరితే వ్య‌భిచారి అయినా ప్ర‌తివ‌త్రేనా...!
X
1970 - 80వ దశకంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశ రాజకీయాలను ఆమె చాలా వరకు భ్రష్టు పట్టించేశారన్న విమర్శలు ఉన్నాయి. గవర్నర్ పదవిని అడ్డంపెట్టుకుని ఎన్నో రాష్ట్రాల్లో తిరుగులేని మెజార్టీతో అధికారంలో ఉన్న ప్రభుత్వాల‌ను కూలదోయడం ఆమెకే చెల్లింది. ఓ నియంత మాదిరిగా ఇందిర‌ దేశాన్ని పాలించారు. గత ఐదారేళ్లుగా మోడీతో పాటు బీజేపీ నేతలు కూడా తమ విమర్శల్లో తరచూ ఇందిర‌ ప్రస్తావన తీసుకు వచ్చి కాంగ్రెస్ నేతలపై తీవ్రంగా విరుచుకుప‌డేవారు. ఎంతో ప్ర‌తివ‌తా మాట‌లు మాట్లాడే బీజేపీ ఇప్పుడు ఏం ? చేస్తోంద‌న్న ప్రశ్నకు మోడీతో పాటు ఆ పార్టీ నేతలే సమాధానం చెప్పాలి.

గ‌త ఐదారేళ్లుగా పార్టీ ఫిరాయింపుల‌తో దేశ రాజ‌కీయాలు క‌లుషితం అయిపోయాయి. ప‌దేళ్ల కాంగ్రెస్ పాల‌న‌లో ఈ త‌ర‌హా ఫిరాయింపులు ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు. 2014 ఎన్నిక‌ల త‌ర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో నైతిక విలువ‌లు లేని ఫిరాయింపులు ప్రారంభ‌మ‌వ్వ‌గా బీజేపీ వాటిని పీక్స్‌ కు తీసుకుపోయింది.... దేశ‌వ్యాప్తంగా అమ‌లు చేసేస్తోంది. పార్టీ ఫిరాయింపులపై గ‌తంలో బిజెపి నేతలు తెలంగాణలో కేసీఆర్‌ తో పాటు ఏపీలో చంద్రబాబుని టార్గెట్ గా చేసుకొని ఎన్నో విమర్శలు చేశారు. తాజా ఎన్నికల్లో మోడీ గెలిచి రెండోసారి ప్ర‌ధాన‌మంత్రి అయ్యాక బిజెపి దేశ పరిపాలనను గాలికి వదిలేసి... పూర్తిగా ఫిరాయింపు రాజకీయాల మీద దృష్టి పెట్టినట్టు కనపడుతోంది.

తెలంగాణలో టీఆర్ ఎస్ - కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కీలక నేతలపై వేసి మరి వాళ్ళను తమ పార్టీలోకి లాగేసుకుంటుంది. ఈ క్రమంలోనే బతిమిలాడటం... బుజ్జగింపుల నుంచి బెదిరింపులు వరకు సామదాన దండోపాయాల‌న్నింటిని ప్రయోగిస్తోంది. ఎంత దారుణం అంటే టీడీపీ ఎన్డీయేలో ఉన్నప్పుడు ఉంటే సాక్షాత్తు మోడీయే సుజ‌నా అవినీతి.... ఆరోపణలపై టిడిపికే చెందిన మరో మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజుతో మీరు ఇలాంటి నేతలతో ఎలా? కలిసి పని చేస్తున్నారని అన్న‌ట్టు కూడా అప్పట్లో జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. టిడిపి ఎన్డీయే నుంచి బయటకు వచ్చాక బిజెపి నేతలు అందరూ సుజ‌నాతో పాటు సీఎం రమేష్ లాంటి వాళ్ళను బాగా టార్గెట్ చేశారు. సోము వీర్రాజు లాంటి వాళ్లు అయితే ప్ర‌తి రోజు వీళ్ల‌పై విమ‌ర్శ‌లు చేసేవారు.

సుజనా కంపెనీలు తీవ్రమైన అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయాయి. అలాంటి సుజన చౌదరికి ఇప్పుడు బిజెపి రెడ్ కార్పెట్ వేసి మరీ పార్టీలోకి ఆహ్వానించింది. సుజన ఆధ్వర్యంలోనే టిడిపికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరిన సంగతి విదితమే. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పార్టీని బలోపేతం చేసే పని కూడా సుజనాకే ఇస్తుందట. టీడీపీలో ఉన్నప్పుడు సుజ‌నాను ప్రతిరోజు విమర్శించిన ఆ బిజెపి నేతలే ఇప్పుడు ఆయనకు పూలమాలలు వేసి సన్మాన... సత్కారాలు చేస్తున్నారు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఎలాంటి వ్యభిచారి అయినా బిజెపిలో చేరితే ప్ర‌తివ్ర‌తా శిరోమ‌ణి అయిపోయినట్టే అన్న చందంగా ఆ పార్టీ నేతల తీరు ఉంది.

చివ‌ర‌కు నీర‌వ్ మోడీ - విజ‌య్ మాల్యా లాంటి వాళ్లు కూడా ఇప్పుడు బీజేపీలో చేరితే వాళ్లు కూడా శుద్ధ‌పూస‌లు అయిపోయిన‌ట్టే అనుకోవాలేమో... రాజకీయాల్లో ఫిరాయింపుల‌ను చంద్రబాబు - కేసీఆర్ ఒక దశకు తీసుకెళ్తే.. బీజేపీ జనాలు అసహ్యించుకునేలా నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. జ‌నం ఏమ‌నుకున్నా అధికార దాహం - ఆధిప‌త్యం కోసం బీజేపీ దేశ రాజ‌కీయాల్లో ఏక‌పార్టీ విధానంతో ఇందిర‌ను మించిపోయేలా స‌రికొత్త నియంతృత్వ రాజ‌కీయాల‌కు తెర‌లేపింది.