Begin typing your search above and press return to search.

అంతా ఊహించిన‌ట్టే.. వైఎస్సార్సీపీలోకి ఆ బీసీ నేత‌!

By:  Tupaki Desk   |   29 Aug 2022 9:57 AM GMT
అంతా ఊహించిన‌ట్టే.. వైఎస్సార్సీపీలోకి ఆ బీసీ నేత‌!
X
అంతా ఊహించిన‌ట్టే జ‌రిగింది. ఇటీవ‌ల టీడీపీకి రాజీనామా చేసిన మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ముఖ్య నేత‌, టీడీపీ రాష్ట్ర అధికార ప్ర‌తినిధి గంజి చిరంజీవి వైఎస్సార్సీపీలో చేరారు. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మక్షంలో వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మంగ‌ళ‌గిరి నుంచి వైఎస్సార్సీపీ త‌ర‌ఫున గంజి చిరంజీవి పోటీ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో ఓడించిన‌ట్టే వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ నారా లోకేష్ ను ఎలాగైనా ఓడించాల‌ని వైఎస్సార్సీపీ కంక‌ణం క‌ట్టుకుంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ప‌రోక్షంగా వెనుక ఉండి గంజి చిరంజీవితో రాజీనామా చేయించిన‌ట్టే మిగ‌తా టీడీపీ నేత‌ల‌తోనూ ఆ పార్టీకి రాజీనామాలు చేయించే యోచ‌న‌లో వైఎస్సార్సీపీ ఉంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ ముఖ్య నేత‌లుగా ఉన్న వారిపై వైఎస్సార్సీపీ దృష్టి పెట్టింద‌ని అంటున్నారు. వారికి అనేక ర‌కాలుగా తాయిలాలు ప్ర‌క‌టించి వైఎస్సార్సీపీలో చేర్చుకుంటార‌నే చ‌ర్చ ఆ నియోజ‌క‌వ‌ర్గంలో జోరుగా సాగుతోంది.

కాగా 2014లో గంజి చిరంజీవి టీడీపీ అభ్య‌ర్థిగా మంగ‌ళ‌గిరి నుంచి పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్య‌ర్థి ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి మీద కేవ‌లం 12 ఓట్ల‌తో ఓడిపోయారు. ఇక 2019లో స్వ‌యంగా నారా లోకేష్ ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌డంతో గంజి చిరంజీవి ఆయ‌న త‌ర‌ఫున ప్ర‌చారంలో కీల‌క పాత్ర పోషించారు.

మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో అత్య‌ధిక సంఖ్య‌లో ఓటర్లు ఉన్న చేనేత సామాజిక‌వ‌ర్గానికి చెందినవారు.. చిరంజీవి. టీడీపీలో ఉన్న‌వారే బీసీ అభ్య‌ర్థి అయిన త‌న‌ను ఇబ్బంది పెట్టార‌ని గంజి చిరంజీవి రాజీనామా చేసిన‌ప్పుడు ఆరోపించారు. 2014లో తాను అతి స్వ‌ల్ప మెజారిటీతో ఓడిపోవ‌డానికి కూడా సొంత పార్టీ నేత‌లే కార‌ణ‌మ‌ని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. పదవులు కోసం తాను టీడీపీకి రాజీనామా చేయడం లేదని.. సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేక రాజీనామా చేస్తున్నట్లు వెల్ల‌డించారు. టీడీపీ వాళ్ళే తన రాజకీయ జీవితం నాశనం చేశారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చివరి నిమిషం వరకు మంగళగిరి ఎమ్మెల్యే సీటు తనదే అని చెప్పి మోసం చేశారని ఆరోపించారు.

టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చి మంగళగిరి నియోజ‌క‌వ‌ర్గ‌ ప్రజలకు త‌న‌ను దూరం చేశారని గంజి చిరంజీవి ఆరోపించారు. చేనేత, బీసీగా ఉన్న తనను అణగదొక్కారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న ఆవేద‌న‌, బాధ తెలిసి కూడా టీడీపీ అధిష్టానం ప‌ట్టించుకోలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు న్యాయం చేసే పార్టీలో చేర‌తాన‌ని అప్ప‌ట్లో చిరంజీవి తెలిపిన సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో చిరంజీవి వైఎస్సార్సీపీలో చేరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగైనా గెలుపొందాల‌ని ఇప్ప‌టికే నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో త‌ర‌చూ ప‌ర్య‌టిస్తున్నారు. అన్ని గ్రామాల్లోనూ ప‌ర్య‌ట‌నలు చేస్తూ వ‌స్తున్నారు. ఈ నేప‌థ్యంలో గంజి చిరంజీవిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైఎస్సార్సీపీ త‌ర‌ఫున దించుతార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

ముఖ్యంగా మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో చేనేత‌లు ఎక్కువ కావ‌డంతో బీసీ నేత‌ల‌పైనే వైఎస్సార్సీపీ దృష్టి సారించింద‌ని తెలుస్తోంది. ద్వితీయ శ్రేణి నేత‌లంద‌రినీ త‌మ పార్టీలోకి చేర్చుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పార్టీ త‌ర‌ఫున ఒక టీమ్ ను కూడా రంగంలోకి దింపార‌ని చెప్పుకుంటున్నారు.

లోకేష్ ను ఎలాగైనా రెండో సారి కూడా ఓడగొడితే ఆయన ఇక నాయకుడిగా ఎదగకుండా చేయొచ్చని వైఎస్సార్సీపీ భావిస్తోంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే మంగ‌ళ‌గిరి టీడీపీలో కీల‌క నేత‌లు లేకుండా చేయ‌డానికి వైఎస్సార్సీపీ ప్ర‌య‌త్నిస్తోంద‌ని అంటున్నారు.

ఇక వైఎస్సార్సీపీలో చేరిన త‌ర్వాత చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ ఆధ్వర్యంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందన్నారు. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల అభివృద్దికి వైఎస్సార్సీపీ కృషి చేస్తోంద‌ని తెలిపారు. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీలో బీసీలకు గౌరవం లేదని మండిప‌డ్డారు. నిరంతరం అవమానాలకు గురిచేస్తూ బీసీలను ఏమి ఉద్ధరిస్తారని టీడీపీ నేత‌ల్ని నిల‌దీశారు. తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్క సామాజిక వర్గానికి గౌరవం లేదన్నారు.