Begin typing your search above and press return to search.

అయోధ్య భూమి పూజ లైవ్ అప్‌డేట్స్‌ :అభిజిత్ ముహూర్తంలో శంకుస్థాపన చేసిన మోడీ !

By:  Tupaki Desk   |   5 Aug 2020 10:30 AM GMT
అయోధ్య భూమి పూజ లైవ్ అప్‌డేట్స్‌ :అభిజిత్ ముహూర్తంలో శంకుస్థాపన చేసిన మోడీ !
X
-చరిత్రలో చిరస్మరణీయంగా ఉండిపోయే ఘటనలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో శతాబ్దాల పాటూ చెప్పుకునే అరుదైన ఘటన నేడు ఆవిష్కృతం కాబోతుంది. అయోధ్య లో రామ మందిర నిర్మాణానికి నేడు భూమి పూజ జరగబోతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రధాని మోడీ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నోకు బయలు దేరారు. అలాగే రోజువారీ వస్త్రధారణ కు కాస్తా భిన్నంగా ప్రధాని మోదీ పంచకట్టులో అయోధ్య కి బయల్దేరారు. లక్నో విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత హెలికాప్టర్‌ లో అయోధ్యకు ప్రధాని పయనమవుతారు. ముందుగా హనుమాన్‌ గర్హిలో ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు.

-ఇకపోతే ఆలయ నిర్మాణ భూమిపూజ ముహూర్త సమయం కేవలం 32 సెకండ్లు మాత్రమే ఉందని తెలుస్తోంది. 32 సెకండ్లలోనే మోదీ భూమిపూజ పూర్తి చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 08 సెకన్లకు ముహూర్తం ప్రారంభమై, 12 గంటల 44 నిమిషాల 40 సెక్షన్లకు పూర్తవుతుంది. ఇక ఈ కార్యక్రమానికి మొత్తం 175 మంది అతిథులు హాజరుకానున్నారు. వారిలో 135 మంది వివిధ సాంప్రదాయాలకు చెందిన సాధువులు ఉన్నారు. ముహూర్త సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ... 40 కేజీల వెండి ఇటుకను... పునాదిరాయిగా వెయ్యబోతున్నారు. భూమిపూజ కార్యక్రమానికి దేశంలోని 2 వేల ప్రాంతాల నుండి పవిత్రమైన మట్టి, 100 నదుల నుండి నీరు వినియోగించనున్నారు.

అయోధ్య షెడ్యూల్ .. 12.40కి మోదీ పునాది రాయి

1. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై..మధ్యాహ్నం 2 గంటలకు ముగియనుంది. ఈ కార్యక్రమానికి హాజరైయ్యే అతిథులు రెండు గంటలు ముందే అక్కడకు చేరుకుంటారు.
2 ప్రధాని మోదీ... ఉదయం 11.30కి అయోధ్య చేరుకుంటారు. అంతకుముందు ఆయన హనుమాన్ ‌గర్హి ఆలయంలో , యోగి ఆదిత్యనాథ్‌ తో కలిసి పూజలు చేయనున్నారు.
3. మధ్యాహ్నం 12 గంటలకు మోదీ... భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటారు.
4. దేశంలోని 2000 ఆలయాలు, ప్రార్థనా స్థలాల నుంచి తెచ్చిన పవిత్ర మట్టి, 100 నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాల్ని కార్యక్రమంలో ఉపయోగిస్తారు.
5. ఈ కార్యక్రమంలో వేదికపై ప్రధాని మోదీ, మోహన్ భగవత్, శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ చీఫ్ నృత్య గోపాలదాస్ మహరాజ్, యూపీ గవర్నర్, యూపీ సీఎం ఆదిత్యనాథ్ మాత్రమే ఉంటారు.
6. మధ్యాహ్నం 12.30కి అసలైన భూమి పూజ కార్యక్రమం మొదలవుతుంది. 12.40కి మోదీ పునాది రాయి వేస్తారు. 12.45కి ప్రధాని మోడీ
మందిర నిర్మాణం పై మాట్లాడనున్నారు.

అయోధ్య ఆలయ నిర్మాణానికి దేశవ్యాప్తంగా విరాళాాలు అందుతున్నాయి. పలువురు దాతలు వివిధ రూపాల్లో ఆలయ నిర్మాణానికి తమవంతు విరాళాలను అందిస్తున్నారు. కొందరు నగదు రూపంలో, మరి కొందరు వస్తవులు రూపంలో డొనేషన్లను తీర్థ క్షేత్ర ట్రస్టుకు పంపిస్తున్నారు. దేశీయ విరాళాలను మాత్రమే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. సేకరిస్తోంది. మంగళవారం నాటికి రామమందిరం నిర్మాణానికి 30 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కొద్దిరోజుల్లోనే ఇంత భారీ మొత్తం జమ కావడం విశేషం.

శ్రీరాముడు జన్మించిన పవిత్ర పుణ్య స్థలంలో భారీ ఆలయ నిర్మాణానికి కొద్దిసేపట్లో పునాదిరాయి పడబోతోంది. ఈ ఆలయ నిర్మాణానికి అనేకమంది విరాళం ప్రకటిస్తున్నారు. అయితే , కేవలం దేశీయ విరాళాలు మాత్రమే స్వీకరిస్తున్నారు. విదేశీ విరాళాలు స్వీకరించడం లేదు. విదేశీ విరాళాల క్రమబద్దీకరణ చట్టం-2010 ప్రకారం.. తీర్థ క్షేత్ర ట్రస్టుకు ఇంకా సర్టిఫికేషన్ అందాల్సి ఉంది. ఎఫ్‌సీఆర్ ఏ సర్టిఫికేట్ అందిన తరువాతే విదేశాల నుంచి విరాళాలను స్వీకరిస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది.

దేశంలో ఉన్న హిందువులందరు ఎదురుచూస్తున్న ఆ క్షణాలు వచ్చేశాయి. అయోధ్యలో అత్యంత వైభవంగా రామాలయం నిర్మాణానికి పూజలు మొదలయ్యాయి. ఈ మధ్యాహ్నం ఆలయ శంకుస్థాపన జరుగనుండగా, శ్రీరాముని విగ్రహం ఎన్నో ఏళ్ల తరువాత జన్మభూమిగా భావిస్తున్న ప్రాంతానికి చేర్చారు.

అయోధ్యలో శ్రీరామ మందిర భూమి పూజ మరికొద్ది గంటల్లో జరగనుంది. ఈ తరుణంలో అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం ఎంతో శ్రమించిన బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ భావోద్వేగానికి గురయ్యారు. తనతోపాటు భారత ప్రజలందరికీ ఇదో చారిత్రక, ఉద్వేగభరిత క్షణాలని, అలాగే 1990లో సోమనాథ్ నుంచి అయోధ్య వరకు తాను చేపట్టిన రథయాత్రను అద్వానీ గుర్తు చేసుకున్నారు. దృఢమైన, సుసంపన్నమైన, శాంతి సామరస్యాలతో కూడిన భారతవానికి రామ మందిరం ఓ ప్రతీకగా నిలుస్తుందని , అందరికీ సమ న్యాయం, సుపరిపాలన అందాలని, దేశం రామరాజ్యంలా వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

తిరంగా యాత్రలో భాగంగా మోడీ చివరగా 1992 జనవరి 18న అయోధ్యకు వెళ్లారు. సరిగ్గా 28 ఏళ్ల కిందట అయోధ్యలో అడుగుపెట్టిన మోదీ.. రామ్ లల్లాను దర్శించుకున్నారు.ఆ సమయంలో మోడీ మాట్లాడుతూ .. ఆలయం నిర్మించే సమయంలో మరోసారి వస్తానని, అప్పటివరకు అయోధ్య కి మళ్లీ రానని శపథం చేశారు. నాడు మోదీ చేసిన శపథం నెరవేరబోతోంది. నేడు ప్రధాని హోదా లో అయోధ్య రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేయడానికి అయోధ్యకి రాబోతున్నారు.

రామాలయ భూమి పూజా కోసం అయోధ్యలో అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ .. అయోధ్యలో ప్రధాని మోదీ దాదాపు మూడు గంటల పాటు గడపనున్నారు.

అయోధ్య రామ జన్మ స్థలంలో భూమి పూజ మధ్యాహ్నం 12.30కి మొదలవ్వనుంది. దీనికోసం ఇప్పటికే ప్రధాని మోడీ అయోధ్య చేరుకున్నారు. ముందుగా శిలాపూజ, భూమిపూజ, కర్మ శిలాపూజల్లో పాల్గొంటారు. అధికారిక ప్రకటన ప్రకారం... అసలైన భూమిపూజ మధ్యాహ్నం 12.44కి మొదలై... 12.45లోపలే ముగుస్తుంది. శ్రీరామచంద్రస్వామి పుట్టిన అభిజిత్ ముహూర్తంనే భూమి పూజ ముహూర్తంగా ఫిక్స్ చేశారు. అందువల్ల అది 32 సెకండ్లలో పూర్తి కావాల్సి ఉంది.

అయోధ్యలో ఆలయ భూమి పూజ కోసం ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అయోధ్యకు చేరుకున్నారు. స్థానిక హనుమాన్ గఢీలోని ఆలయంలో స్వామివారిని దర్శించి ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. ఆ తరువాత మాట్లాడుతూ .. భారతదేశంలో ఇది చారిత్రాత్మక రోజు. చరిత్రలో ఈరోజు ఎప్పటికీ నిలిచిపోతుంది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతుందని నేను ఎప్పటినుంచో ధీమాగా ఉన్నాను. రామాలయం నిర్మాణంతో భారత్‌లో రామ రాజ్యం వస్తుందని భావిస్తున్నానంటూ’ రాందేవ్ బాబా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ అపూర్వ ఘట్టం భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తుంది.రామమందిర నిర్మాణంతో ప్రజల మధ్య వైషమ్యాలను తీసివేసి అందరిని కలుపుతుంది.అంతా వసుదైక కుటుంబకం అని చెబుతుంది: స్వామి చిదానంద సరస్వతి.

హనుమాన్ గర్హికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఆలయంలోకి వెళ్లి ఆలయంలో తిరుగుతూ అక్కడి పరిస్థితులని తెలుసుకున్నారు. ఆ తరువాత హనుమాన్ గర్హిలో ప్రత్యేక పూజలు చేసారు.

అయోధ్యలోని రామ్‌లల్లా కు సాష్టాంగ నమస్కారం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ. శ్రీరామచంద్రుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ. శ్రీరాముడి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిన ప్రధాని మోడీ. అక్కడ పారిజాత మొక్కని నాటిన మోడీ .

శంకుస్థాపన మహోత్సవంలో భాగంగా అయోధ్యలో అర్చకులు రామార్చన పూజ నిర్వహించారు. భూమి పూజ కోసం తరలి రావాలంటూ వేదమంత్రాలు జపిస్తూ ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. ఇందులో నాలుగు దశల్లో ఈ పూజను నిర్వహించారు. తొలిదశలో రాముడు మినహా ఇతర దేవతలను ప్రార్థించారు. వారికి పేరు పేరునా ఈ ఆలయ శంకుస్థాపనకు ఆహ్వానించారు. రెండో దశలో అయోధ్య నగరంతోపాటు రాముడి సైన్యాధికారులైన నలుడు, నీలుడు, సుగ్రీవుడిని పూజించారు. మూడో దశలో రాముడి తండ్రి దశరుథుడు,ముగ్గురు తల్లులు కౌసల్య, సుమిత్ర, కైకేయిలకు స్వాగతించారు, రాముడి సోదలులకు పూజలు నిర్వహించారు అనంతరం నాలుగో దశలో శ్రీరామచంద్రమూర్తిని ప్రార్థించారు.

అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆ అద్భుతమైన ఘట్టం ప్రారంభమైంది . పండితుల వేదమంత్రాల మధ్య సాగుతున్న చారిత్రాత్మక వేడుక .. మరికాసేపట్లో మోడీ భూమి పూజ.

అయోధ్య రామమందిర భూమిపూజలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ. ప్రస్తుతం భూమిపూజ కార్యక్రమం కొనసాగుతుంది. అయోధ్యలో వేదమంత్రాలతో అయోధ్య మారుమోగిపోతుంది.

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మరికాసేపట్లో భూమి పూజ జరగనున్న నేపథ్యంలో భద్రాచలంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామ మందిర నిర్మాణ పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తికావాలని కోరుకుంటూ ప్రధాన అర్చకుడు సీతారామానుజాచార్యులు నేతృత్వంలో బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమి పూజ ప్రారంభమైంది. రామమందిర నిర్మాణంకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసారు. అయోధ్యలో ఆవిష్కృతమైన చారిత్రాత్మక ఘట్టం. రామ నామ స్మరణతో మారుమోగుతున్న అయోధ్య .

రామమందిర నిర్మాణానికి అభిజిత్ ముహూర్తంలో శంకుస్థాపన జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం 12.44 నిమిషాలకు వెండి ఇటుకను ప్రధాని నరేంద్ర మోదీతో అక్కడి పండితులు ప్రతిష్ఠ చేయించారు.