Begin typing your search above and press return to search.

నాడు ఆటో జానీ : కట్ చేస్తే మహారాష్ట్ర సీఎం

By:  Tupaki Desk   |   1 July 2022 4:10 AM GMT
నాడు  ఆటో జానీ  : కట్ చేస్తే మహారాష్ట్ర సీఎం
X
ఇది కదా ప్రజాస్వామ్యం, ఇది కదా బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటే. ఒకనాడు ఇంటి బరువు బాధ్యతలు మోయడం కోసం ఆటో డ్రైవర్ గా మహరాష్ట్ర వీధుల్లో తిరిగిన వ్యక్తి సీన్ కట్ చేస్తే ఇపుడు అదే రాష్ట్రానికి ముఖ్యమంత్రి. దేశానికి ఆర్ధిక రాజధానిగా పేరుపడిన ముంబై నుంచి ఆయన పాలన సాగించనున్నారు. మహారాష్ట్ర సీఎం అంటే ఆ విలువ గౌరవం వేరు. బాలీవుడ్ బాదుషాలతో పాటు చాలా మందికి అది అతి ముఖ్యమైన కేంద్ర స్థానం. అలాంటి రాష్ట్రానికి ఏక్ నాధ్ షిండే సీఎం అయ్యారు.

ఆయన కలలో కూడా ఇలా జరుగుతుందని అనుకోని ఉండరు. 1964 ఫిబ్రవరి 9న మహారాష్ట్రలోని సాతారా జిల్లాలో గల జవాలీ తాలుకాలో నిరుపేద కుటుంబంలో జన్మించిన షిండే ఇంటర్ మధ్యలోనే చదువు ఆపేసి ఆటో తోలడం మొదలెట్టారు. అలా కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చిన ఆయనకు శివసేన అధినాయకుడు బాల్ ధాకరే అంటే ఇష్టం. ఆయన ప్రసంగాలు అంటే ఇంకా ఇష్టం. అలా శివసేన పట్ల ఆకర్షితుడై పార్టీ సభ్యత్వం పుచ్చుకున్నారు. శివసేన అధినాయకుడి అడుగు జాడలలో నడుస్తూ వచ్చారు.

అలాగే పార్టీలో మాస్ లీడర్ గా ఎదుగుతూ వచ్చారు. శివసేనలోని శివావేశానికి ఏక్ నాధ్ షిండే ప్రతీకగా ఉండేవారు. థానే శివసేన జిల్లా అధ్యక్షుడు ఆనంద్ దిగే అంటే గురు భావం. ఇక ఆయన్ని రాజకీయంగా తీర్చిదిద్దింది ఆనంద్ దిగే అని చెప్పుకోవాలి. ఈ ప్రస్థానం ఇలా ఉండగానే 1997 ప్రాంతంలో థానే నగర పాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఫస్ట్ టైం కార్పోరేటర్ గా ఏక్ నాధ్ షిండే అయ్యారు. ఇక 2002లో తన గురువు ఆనంద్ దిగే మరణించడంతో థానే శివసేన జిల్లా ప్రెసిడెంట్ అయ్యారు. 2004లో ఫస్ట్ టైమ్ కోప్రి పచ్చపాఖాది నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అలా 2009, 2014, 2019లలో షిండే వరసగా నెగ్గుతూ వచ్చారు. ఇక 2014లో ఆయన శివసేన శాసనసభా పక్ష నాయకుడిగా కూడా ఉన్నారు. అలా విపక్ష నేత పాత్రలో సత్తా చాటారు.

మరో వైపు 2019లో మహా వికాస్ అగాడీ కూటమిలో కీలకమిన పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అలా ఆయన రెండున్నరేళ్ళుగా ఆ పదవిలో ఉన్నారు. తాజాగా ఆయన ఉద్ధవ్ థాక్రే సర్కార్ మీద తిరుగుబాటు చేసి ఏకంగా తన వైపునకు మొత్తానికి మొత్తం శివసేన పార్టీనే తిప్పుకున్నారు. ఇంత చేసినా ఉప ముఖ్యమంత్రిగా ఆరవ వేలుగా ప్రభుత్వంలో ఉంటారేమో అని అంతా అనుకున్నారు. కానీ ఏకంగా ముఖ్యమంత్రి పీఠమే ఆయన్ని వరించింది.

ఇది నిజంగా గ్రేట్ అనుకోవాలి. శివసేన వ్యవస్థాపకుడు బాల థాక్రే కుమారుడు ఉద్ధవ్ థాక్రేకు 56 మంది ఎమ్మెల్యేలు ఉంటే మహారాష్ట్ర సీఎం అయితే లక్ అన్నారు. కానీ గట్టిగా నలభై మంది ఎమ్మెల్యేలు లేరు. అది కూడా ఆయన సొంత పార్టీ కాదు, కానీ ఆయన నాయకత్వాన్ని నమ్మి ఎమ్మెల్యేలు అంతా వెంట వచ్చారు.

అలా ఏక్ నాధ్ తన నాయకత్వాన్ని రుజువు చేసుకున్నారు. ఫలితంగా ఆయన ఈ రోజు సీఎం అయ్యారు. 288 మంది సభ్యులు కలిగిన సభకు ఆయన నాయకుడుగా మారిపోయారు. ఆటో షిండే నుంచి సీఎం షిండే దాకా ఆయన ప్రయాణం కడు ఆసక్తికరం అని చెప్పుకోవాలి.