Begin typing your search above and press return to search.

మ‌న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల‌కు క‌రోనా..ఏకంగా క్యాంప‌స్ మూత‌

By:  Tupaki Desk   |   7 July 2020 6:19 PM GMT
మ‌న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల‌కు క‌రోనా..ఏకంగా క్యాంప‌స్ మూత‌
X
దేశంలో క‌రోనా విస్తృతి అంత‌టా కొన‌సాగుతోంది. మాన్యుల నుంచి సామాన్యుల వ‌ర‌కు ఈ మ‌హ‌మ్మారి బారిన ప‌డుతున్నారు. తాజాగా కొంద‌రు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఇలాగే ఈ మ‌హ‌మ్మారి ప్ర‌భావానికి గుర‌య్యారు. టెక్కీల‌కు కరోనా మహమ్మారి కారణంగా ఒడిషా రాజధాని భువనేశ్వర్‌లో టెక్‌ మహీంద్ర కార్యాలయం తాత్కాలికంగా మూతపడింది.

టెక్ మ‌హీంద్రాకు చెందిన భువ‌నేశ్వ‌ర్‌ నగరంలోని ఈ క్యాంపస్‌లో మొదటి కేసు జూన్ 29న నమోదైంది. దీంతో మిగ‌తా ఉద్యోగుల‌కు గతవారం టెస్టులు చేయ‌గా ఏడుగురు ఉద్యోగులు కరోనా బారిన పడట్లు తేలింది. దీంతో టెక్ మహీంద్ర క్యాంపస్‌కు సీల్‌ వేసిన‌ట్లు స్థానిక మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంపీ) వెల్ల‌డించారు. కోవిడ్-19 కేసులను గుర్తించిన తరువాత శానిటైజేషన్ కోసం గురువారం వరకు సంస్థ కార్యాలయాన్ని 72 గంటలు మూసి వేసినట్లు బీఎంసీ నార్త్ జోనల్ డిప్యూటీ కమిషనర్ ప్రమోద్ కుమార్ ప్రస్టీ పేర్కొన్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 65 మంది ఉద్యోగులు హోం క్వారంటైన్‌లో ఉన్నారని, కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా ఈ ఏడుగురు వ్యక్తులతో పరిచయం ఉన్న ఇతరులను వేరుచేయడానికి ప్రయత్నిస్తున్నట్టు వివరించారు. ఉద్యోగుల్లో ఎవరిలోనైనా లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకుంటారని ఆయ‌న తెలిపారు.

ఇదిలాఉండ‌గా, ఒడిశాలో కొవిడ్‌-19 కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి. రాష్ట్రంలో మంగళవారం 572 కేసులు నమోదవగా, ఆరుగురు మృతి చెందారు. దీంతో 10వేల మార్కును దాటింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 10,097 మంది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 42 మంది మృతి చెందారు.