Begin typing your search above and press return to search.

'హారీ పోటర్' రచయిత్రిని వదలని పాకిస్తాన్ ఉగ్రవాది

By:  Tupaki Desk   |   14 Aug 2022 1:46 PM GMT
హారీ పోటర్ రచయిత్రిని వదలని పాకిస్తాన్ ఉగ్రవాది
X
ఉగ్రమూకలు రెచ్చిపోతున్నాయి. తమ మనోభావాలకు, ఇస్లాంకు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు ఎగబడిపోతున్నాయి. ఇటీవల భారత్ లోని రాజస్థాన్ లో అయితే ఓ వ్యక్తి తల నరికేశారు. తాజాగా బ్రిటన్ కు చెందిన ప్రముఖ 'హారీపోటర్' నవల రచయిత్రి జేకే రౌలింగ్ కు కూడా ఈ బాధలు తప్పలేదు. ఆమె సల్మాన్ రష్దీపై హత్యాయత్నం ఘటనపై స్పందించినందుకు ఏకంగా పాకిస్తాన్ ఉగ్రవాది బెదిరింపులకు దిగడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

బ్రిటీష్ నవలా రచయిత్రి జేకే రౌలింగ్ కు పాకిస్తాన్ కు చెందిన ఇస్లామిక్ ఉగ్రవాది ట్విట్టర్ వేదికగా చంపుతామంటూ బెదిరించడం కలకలం రేపింది. శుక్రవారం అమెరికాలో సల్మాన్ రష్దీపై హత్యాయత్నం ఘటనపై జేకే రౌలింగ్ విచారం వ్యక్తం చేశారు. తీవ్ర వేదనకు గురయ్యానని.. ఆయన క్షేమంగా ఉండాలంటూ ఆమె ట్వీట్ చేశారు.

దీనిపై కరాచీకి చెందిన మీర్ ఆసిఫ్ అజీజ్ స్పందించాడు. 'కంగారు పడొద్దు.. తర్వాత నువ్వే' అనే బెదిరింపుతో కూడిన వ్యాఖ్యలు చేశాడు. దీంతో సల్మాన్ రష్దీ తర్వాత టార్గెట్ జేకే రౌలింగ్ నే అని ఆ ఉగ్రవాది బెదిరించినట్టు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో బెదిరింపులు రావడంతో జేకే రౌలింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సామాజిక కార్యకర్త, రాజకీయ కార్యకర్త, , విద్యార్థిగా తాను పేర్కొనే ఆసిఫ్ అజీజ్ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి మద్దతుగా పోస్టులు పెడుతుంటాడని అధికారులు తెలిపారు.

ఈ పాకిస్తానీ ఆసిఫ్ దృష్టిలో భారత్, ఇజ్రాయెల్, ఉక్రెయిన్ లు ఉగ్రవాద దేశాలని తెలిపారు. వాటిని ఎలా నాశనం చేయాలన్న దానిపై కుళ్లు జోకులు వేస్తుంటాడని తెలిపారు.

ప్రపంచంలోనే ప్రముఖ రచయిత్రిపై సైతం బెదిరింపులకు దిగేంతటి దుస్సహాసం చేస్తున్నారంటే వారు ఎంతగా తెగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.