Begin typing your search above and press return to search.

ఇద్దరి అరెస్టు..ఇక మిగిలింది ఆశిషే!

By:  Tupaki Desk   |   5 Dec 2019 1:19 PM GMT
ఇద్దరి అరెస్టు..ఇక మిగిలింది ఆశిషే!
X
ఓ వైపు దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న దిశ హ‌త్యోదంతం క‌ల‌కలం రేపుతుండ‌గానే..మ‌రోవైపు హైదరాబాద్ మాదాపూర్‌ లోని నోవాటెల్ ఆర్టిస్ట్రీ పబ్‌ లో పటాన్‌ చెరు మాజీ ఎమ్మెల్యే - బీజేపీ నేత టీ నందీశ్వర్‌ గౌడ్ కుమారుడు ఆశిష్‌ గౌడ్‌ వీరంగం సృష్టించడం - సినీనటి సంజ‌న‌ పాటు ఆమె స్నేహితురాల్ల‌తో అసభ్యంగా ప్రవర్తించిన ఉదంతం క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌లో ఆశిష్ ఇద్ద‌రు అనుచ‌రుల‌ను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆశిష్ గౌడ్ ప‌రారీలో ఉన్నారంటున్న మాదాపూర్ పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

బిగ్‌ బాస్-2 కంటెస్ట్ సంజన మరికొందరు అమ్మాయిలు మాదాపూర్ పోలీసుల‌ను ఆశ్ర‌యించి త‌మ ప‌ట్ల మాదాపూర్‌ లోని నోవాటెల్ హోటల్‌ లో ఆశిష్ గౌడ్ అసభ్యంగా ప్రవర్తించాడని, అంతేగాకుండా దాడికి ప్రయత్నించాడని ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆశిష్‌ గౌడ్‌ తోపాటు మరో ఇద్దరు నిందితులపై ఐపీసీ 354. 354ఏ - 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతోపాటుగా ఆర్టిస్ట్రీ పబ్‌ లోని సీసీ కెమేరాల వీడియో ఫుటేజీలను పరిశీలించారు. పరారీలో ఉన్న నిందితుల గురించి గాలింపు చేప‌ట్ట‌గా అశిష్‌ గౌడ్‌ స్నేహితులు ముత్తంగికి చెందిన గౌండ్ల శ్రీకాంత్‌ అలియాస్‌ బిన్ను - ఇస్నాపూర్‌ కు చెందిన పూసాని పవన్‌ కుమార్‌ గౌడ్‌ ల జాడ దొర‌క‌డంతో వారిని అరెస్టు చేశారు. ప్ర‌ధాన నిందితుడైన‌ అశిష్‌ గౌడ్‌ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు స‌మాచారం.

కాగా, ఆశిష్‌ పై ఫిర్యాదు న‌మోద‌వ‌డం - ఆయ‌న అడ్ర‌స్ దొరక్కుండా పారిపోయిన నేప‌థ్యంలో బీజేపీ అధిష్టానం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఆశిష్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన నేపథ్యంలో సీరియ‌స్‌ గా స్పందించి రంగారెడ్డి జిల్లా అధ్య‌క్షుడి ఎం.న‌రేంద‌ర్‌ రెడ్డికి ఆదేశాలు జారీ చేయ‌డంతో ఆయ‌న సస్పెండ్ చేస్తూ పత్రిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కాగా, ఆశిష్ జాడ తెలుసుకోవ‌డంలో జాప్యం జ‌రుగుతుండ‌టంపై ప‌లువురు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌కీయ నాయ‌కుడి కుమారుడు కావ‌డం వ‌ల్లే..కేసు నీరు గార్చే ప్ర‌య‌త్నం జ‌రుగుతోంద‌ని ఆరోపించారు.