Begin typing your search above and press return to search.

'అల్ల‌ర్ల‌కు మా పార్టీ వాళ్లు కార‌ణ‌మైతే రెట్టింపు శిక్ష వేయండి!'

By:  Tupaki Desk   |   27 Feb 2020 7:30 PM GMT
అల్ల‌ర్ల‌కు మా పార్టీ వాళ్లు కార‌ణ‌మైతే రెట్టింపు శిక్ష వేయండి!
X
ఢిల్లీ అల్ల‌ర్ల‌కు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్లు కార‌ణం అనే ప్ర‌చారంపై ఆ పార్టీ క‌న్వీన‌ర్, ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ధీటుగా స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఒక ముస్లిం నేత పేరును ఈ వ్య‌వ‌హారంలో ప్ర‌స్తావిస్తూ ఉన్నారు. ఒక ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్ హ‌త్య వెనుక ఆయ‌న కుట్ర ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతూ ఉంది. అయితే దీనికి ఇంకా ఎలాంటి అధికారిక ధ్రువీక‌ర‌ణ లేదు. ఇదంతా ప్ర‌చారం మాత్ర‌మే. వాస్త‌వాలు బ‌య‌ట‌కు రావాల్సి ఉంది.

ఈ నేప‌థ్యంలో అర‌వింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఇలాంటి విష‌యాల్లో రాజ‌కీయ‌మే వ‌ద్ద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. అల్ల‌ర్ల‌కు కార‌ణం అయిన వారికి త‌గిన శిక్ష ప‌డాల‌ని ఆయ‌న అప్పీల్ చేశారు. ఒక‌వేళ త‌మ పార్టీ వాళ్లు అల్ల‌ర్ల‌కు కార‌ణం అయి ఉంటే.. మామూలుగా వేసే శిక్ష క‌న్నా రెట్టింపు శిక్ష వేయాలంటూ కేజ్రీవాల్ కోరారు. త‌మ పార్టీ వాళ్ల‌ను ర‌క్షించుకునే ప్ర‌య‌త్నాలేమీ తాము చేయ‌మ‌ని, దోషుల‌కు శిక్ష ప‌డాల్సిందే అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

ఇలా త‌మ అల్ల‌ర్ల‌పై వ‌స్తున్న ఊహాగానాల విష‌యంలో అర‌వింద్ కేజ్రీవాల్ సామాన్యుల మ‌నసును గెలుస్తూ ఉంది. త‌మ పార్టీ వాళ్ల‌ని వెన‌కేసుకు వ‌చ్చేది లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. త‌మ వాళ్లు త‌ప్పు చేసి ఉంటే.. మ‌రింత‌గా శిక్షించాల‌ని కోరారు. ఇలా డిఫెన్స్ మోడ్ లేకుండా కేజ్రీవాల్ స్పందించారు.

ఇక అల్ల‌ర్ల బాధితుల‌కు ప‌రిహారాన్ని కూడా ప్ర‌క‌టించారు ఢిల్లీ ముఖ్య‌మంత్రి. ఈ అల్ల‌ర్ల‌లో మ‌ర‌ణించిన వారి కుటుంబాల‌కు ప‌ది ల‌క్ష‌ల రూపాయ‌ల ప‌రిహారాన్ని ప్ర‌క‌టించారు. ఇళ్లు త‌గ‌ల‌బ‌డ‌టం, ధ్వంసానికి గురి కావ‌డం వంటి బాధితుల‌కు ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల ప‌రిహారాన్ని ఇచ్చారు. అల్ల‌ర్ల‌లో విక‌లాంగులు అయిన వారికి ఐదు ల‌క్ష‌ల రూపాయ‌ల ప‌రిహారాన్ని ఆయ‌న ప్ర‌క‌టించారు.