Begin typing your search above and press return to search.

ఏపీ, తెలంగాణ ప్రయాణికులపై ఢిల్లీ సర్కార్ ఆంక్షలు...కాదని వెళ్తే ?

By:  Tupaki Desk   |   7 May 2021 5:36 AM GMT
ఏపీ, తెలంగాణ ప్రయాణికులపై ఢిల్లీ సర్కార్ ఆంక్షలు...కాదని వెళ్తే ?
X
కరోనా మహమ్మారి దేశ రాజధాని ఢిల్లీలో అల్లకల్లోలం సృష్టిస్తుంది. దీనితో కరోనా కట్టడిలో భాగంగా కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కరోనా ను అదుపులోకి తీసుకురావడానికి లాక్‌ డౌన్ పెట్టి కఠిన నిబంధనలను అమలు చేస్తున్న ఢిల్లీ సర్కార్, తాజాగా తెలుగు రాష్ట్రాల ప్రయాణికులపై ఆంక్షలు పెట్టింది. ఏపీ, తెలంగాణ నుంచి ఎవరూ ఢిల్లీకి రాకూడదని , ఒకవేల కరోనా నియమాలు పాటించకుండా వస్తే వారు 14 రోజుల పాటు క్వారంటైన్‌ లో ఉండాల్సిందే అని స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ విపత్తు నిర్వహణ చట్టం కింద కేజ్రీవాల్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే ఏపీ, తెలంగాణలో విస్తృతంగా వ్యాపించే కొత్త కరోనా వేరియంట్‌ను కనుగొన్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీకి చేరుకునే సమయానికి ముందు ఆర్టీపీసీఆర్‌ టెస్టు చేయించుకుని, నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తో వచ్చేవారు సైతం ఏడు రోజుల పాటు ఏడు రోజుల హోమ్ క్వారంటైన్‌ లో ఉండాల్సిందే. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఇది వర్తిస్తుంది. ఏపీ, తెలంగాణ నుంచి ఢిల్లీ ఎన్సీఆర్ మీదుగా రోడ్డు మార్గంలో వేరే రాష్ట్రాలకు వెళ్లవచ్చు. అయితే , మధ్యలో ఢిల్లీలో దిగకూడదు. ఆగకూడదు. అయితే , ఎంపీలు, కేంద్రమంత్రులు, ఇతర రాజ్యాంగ పదవుల్లో ఉండేవారితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం కొంత మినహాయింపు ఇచ్చారు. ఎలాంటి లక్షణాలు లేకుంటే ఢిల్లీకి అనుమతిస్తారు. కాగా, ఏపీలో, ముఖ్యంగా విశాఖపట్నంలో ఎన్‌440కే అనే కొత్త స్ట్రెయిన్‌ వ్యాపిస్తోందన్న కథనాలను సీసీఎంబీ కొట్టిపారేసిన కొద్దిసేపటికే ఢిల్లీ సర్కారు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

మరోవైపు.. ఎన్‌440కే స్ట్రెయిన్‌ విషయంలో ఆందోళన అవసరం లేదని ఏపీ సర్కారు స్పష్టం చేసింది. ఏపీలో కొత్త రకం వైరస్ అనేది లేదని కేంద్ర బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శి రేణూ స్వరూప్ వెల్లడించారు. ఎన్ 440కే రకం వైరస్ ప్రభావం అసలు దేశంలోనే ఎక్కడా కన్పించలేదని చెప్పారు. మనదేశంలో బీ 167 వైరస్ ప్రభావం మాత్రమే ఉందని స్పష్టం చేశారు.అలాగే ,ఈ వైరస్‌ను గత ఏడాది జూన్‌, జూలైలోనే గుర్తించారని.. అది కొత్తగా పుట్టుకొచ్చింది కాదని కొవిడ్‌ నిరోధక కమాండ్‌ కంట్రోల్‌ చైర్మన్‌ డాక్టర్‌ కెఎస్‌ జవహర్‌ రెడ్డి తెలిపారు.కానీ ఢిల్లీ ప్రభుత్వం మాత్రం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఏపీ, తెలంగాణ ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. ఈ రెండు రాష్ట్రాల నుంచి వచ్చే వారికి క్వారంటైన్ తప్పనిసరి చేసింది.