Begin typing your search above and press return to search.

బిహారీ బాలికకు కృత్రిమ కాలు..

By:  Tupaki Desk   |   28 May 2022 5:30 PM GMT
బిహారీ బాలికకు కృత్రిమ కాలు..
X
ఇటీవలి కాలంలో ప్రజలందరినీ కదిలించింది సోషల్ మీడియాలో పోస్టయిన ఓ వీడియో.. దానిని చూసి అయ్యో అనని వారే లేరంటే అతిశయోక్తి కాదేమో? అందులోనూ ఆ వీడియోలో ఉన్నది ఓ పదేళ్ల బాలిక కావడంతో అందరికీ జాలి కలిగింది. చాలామంది తాము సాయం చేస్తామంటూ ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఆ బాలిక కష్టాలు తీరే సమయం వచ్చింది.

ఇకపై ఆమె రెండు కాళ్లతో బడికి

సీమా.. బిహార్‌లోని జుముయ్‌ జిల్లాకు చెందిన బాలిక. ప్రస్తుతం వయసు పదేళ్లు. రెండేళ్ల కిందటి వరకు ఆమె అందరు బాలికల్లాగే హుషారుగా ఆడుతూ పాడుతూ ఉండేది. తండ్రి అల్లారుముద్దు పెంపకంలో మురిసిపోయేది. అయితే, అనూహ్యంగా ఆమె జీవితంలో ఓ పరిణామం చోటుచేసుకుంది. ఊహించని ప్రమాదంలో ఆమె ఎడమ కాలును పూర్తిగా తొలగించాల్సి వచ్చింది. లేదంటే ప్రాణాలకే ప్రమాదం అని వైద్యులు చెప్పడంతో తప్పనిసరిగా శస్త్రచికిత్సతో కాలు తీసేశారు. అయితే, సీమా ధైర్యవంతురాలు.

శరీరంలో ఒక అవయవం కోల్పోయినా ఆమెలో ధైర్యం చెక్కుచెదరలేదు. వైకల్యానికి కుంగిపోలేదు. ఏడాదిలోపే కోలుకుంది. కిలోమీటరు దూరంలోని పాఠశాలకు ఒంటి కాలుపైనే వెళ్లసాగింది. చెట్లు, పుట్టలు దాటుకుంటూ.. పొలం గట్లను దాటుకుంటూ ఆమె ఒంటికాలుతో స్కూలుకు వెళ్తున్న సంగతి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. మానవీయ కోణం ఉండడంతో ఈ వీడియోకు భారీ స్పందన వచ్చింది. సీమా.. నువ్వు గ్రేట్ అంటూ లక్షలాది మంది ప్రశంసించారు. ఆమె మనోధైర్యం, చదువుకునేందుకు ఆమె చూపిస్తున్న ఆసక్తి పట్ల ముగ్ధులయ్యారు. ప్రముఖులు, అధికారులు ఆమెకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

సోషల్ మీడియా చొరవతో..
సీమా కష్టాన్ని చూసి చలించని వారు లేరు. పుస్తకాల సంచితో ఒంటికాలిపై బడికి వెళుతున్న ఆమె వీడియో సంచలనంగా మారింది. అయితే, ఈ విషయం విద్యా శాఖ అధికారుల పరిశీలనలోకి వెళ్లింది. ఆమెకు వైద్య శాఖ సహకారంతో వారు కృత్రిమ కాలు అమర్చేలా చూశారు.

సీమా రెండు కాళ్లతో ఉన్న ఫొటోను 2009 బ్యాచ్ ఐఏఎస్‌ అధికారి అవనీష్ శరణ్ ట్వీట్ చేశారు. ఆయన ఛత్తీస్‌గఢ్ కేడర్‌లో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా సీమా కథను వెలుగులోకి తెచ్చిన సోషల్ మీడియాను శరణ్ మెచ్చకున్నారు. ఇదీ సోషల్‌ మీడియా పవర్ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఇక అందరి ఆపద్బాంధవుడు, పలు భాషల నటుడు సోనూసూద్‌ కూడా స్పందించారు. సీమా ఒంటికాలిపై నడుస్తున్న వీడియోను రీట్వీట్‌ చేస్తూ.. ఇకపై ఆమె ఒక కాలితో కాకుండా రెండు కాళ్లతో పాఠశాలకు పరిగెడుతుందని హామీ ఇచ్చారు.

మంచికి మంచి.. సోషల్ మీడియా

సీమా ఉదంతం సోషల్ మీడియా ఎలాంటి పాత్ర పోషించాలనే దానికి ఉదాహరణగా నిలుస్తోంది. ప్రధాన స్రవంతి మీడియా ఎంత ప్రయత్నించినా దొరకని అనేక విశేషాలను సోషల్ మీడియా వెలుగులోకి తెస్తోంది. వీటికి స్పదనలు కూడా అంతే స్థాయిలో ఉంటున్నాయి.

అయితే, ఎటొచ్చి సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నవారితోనే సమస్యంతా. తమ పోస్టులు, చేష్టలతో వారంతా శక్తిమంతమైన సోషల్ మీడియాను తక్కువ చేస్తున్నారు. విద్వేషాలను రెచ్చగొట్టేవారికీ కొదవలేదు. అభిప్రాయాలు చెప్పడం వరకు ఓకే అయినా.. శ్రుతి మంచి ప్రవర్తిస్తున్నవారు ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా మంచి చేయొచ్చనే సంగతిని వీరంతా విస్మరిస్తున్నారు. బిహారీ బాలిక సీమాకు జరిగిన మేలును చూసైనా ఇలాంటి వారంతా కొంతైనా నేర్చుకుంటే మేలు.