Begin typing your search above and press return to search.

ఏప్రిల్ 14ను అధికారిక సెలవు దినంగా ప్రకటించిన కేంద్రం

By:  Tupaki Desk   |   9 April 2020 5:15 AM GMT
ఏప్రిల్ 14ను అధికారిక సెలవు దినంగా ప్రకటించిన కేంద్రం
X
మామూలుగా చూస్తే ఏప్రిల్ 14ను ప్రత్యేకంగా గుర్తు పెట్టుకునే వారు కొద్దిమందే. కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఇరవై ఒక్కరోజులు లాక్ డౌన్ విధించటం.. దాని గడువు ఏప్రిల్ 14కు ముగుస్తుండటంతో ఈ తేదీకి అపరిమితమైన ప్రాధాన్యత లభించింది. ఇంతకాలంలో స్వేచ్ఛగా వీధుల్లోకి వచ్చేవారికి.. పరిమితుల గురించి పెద్దగా అవగాహన లేని వారికి తాజా లాక్ డౌన్ నరకాన్ని తలపిస్తోంది. కాస్త ఖాళీ దొరికినా.. సెలవు వచ్చినా మరింత బిజీబిజీగా ఉండటం అలవాటు చేసుకున్న జీవితాలకు లాక్ డౌన్ సరికొత్త అనుభవాన్ని మిగిలుస్తోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. లాక్ డౌన్ ముగిసే ఏప్రిల్ 14ను అధికారిక సెలవు దినంగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని అన్ని కార్యాలయాలకే కాదు.. దేశంలోని అన్ని పరిశ్రమలకు ఆ రోజు అధికారిక సెలవు దినంగా ప్రకటించారు. ఎందుకిలా అంటే.. రాజ్యాంగ నిర్మాణ బీఆర్ అంబేడ్కర్ జయంతి కావటంతో.. ఆ రోజును సెలవుగా ప్రకటించారు.

ఇక.. లాక్ డౌన్ ను ఎత్తి వేస్తారా? పొడిగిస్తారా? అన్న దానిపై సాగుతున్న చర్చకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పుల్ స్టాప్ పెట్టటం.. ఎందుకన్న విషయాన్ని వివరంగా తన మీడియా సమావేశంలో వివరించిన నేపథ్యంలో లాక్ డౌన్ ఎత్తేసే ఆలోచనలు ఏమీ లేవన్నది ఆయన క్లియర్ చేశారు.

ఇలాంటి నిర్ణయాన్ని ప్రకటించాల్సింది కేంద్రం కావటంతో.. తాను ఒక సూచన చేస్తున్నట్లుగా చెప్పారు కేసీఆర్. కరోనాను కంట్రోల్ చేయాలంటే లాక్ డౌన్ పొడిగింపు మినహా మరో మార్గం లేదన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఆయన తర్వాత మాట్లాడిన వారంతా అదే విషయాన్ని చెప్పారు. ఇదే సమయంలో ప్రధాని మోడీ సైతం లాక్ డౌన్ ఎత్తి వేసే ఆలోచన లేదని.. ఎన్ని రోజుల వరకూ పొడిగిస్తామన్న విషయాన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి చెబుతానని చెప్పారు. అదే సమయంలో లాక్ డౌన్ ఎత్తేయాల్సిన ఏప్రిల్ 14ను జాతీయ సెలవు దినంగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేశారు.