Begin typing your search above and press return to search.

ఎన్ కౌంటర్: పోలీసుల కు జన నీరాజనం.. దేశమంతా సంబురం

By:  Tupaki Desk   |   6 Dec 2019 7:10 AM GMT
ఎన్ కౌంటర్: పోలీసుల కు జన నీరాజనం.. దేశమంతా సంబురం
X
హైదరాబాద్ లో దిశాను అత్యాచారం, హత్య చేసిన నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన తెలంగాణ పోలీసుల తీరుపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు.

దిశ హంతకులను ఎన్ కౌంటర్ చేయడంపై విజయవాడలోని ఒక కళాశాల విద్యార్థులు డప్పులు కొడుతూ , ఢంకా బజాయించి మరీ పోలీసులను అభినందిస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చి సంతోషంతో డ్యాన్సులు చేస్తున్నారు. పోలీసులు, కనిపించిన ప్రజలకు స్వీట్లు పంచుతున్నారు.

దేశవ్యాప్తంగా మహిళలు, కాలేజీ విద్యార్థినులు రోడ్ల మీదకు వచ్చి దిశ హంతకులను ఎన్ కౌంటర్ చేయడంపై సంబరాలు చేసుకుంటున్నారు. విద్యార్థినుల ముఖాల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో మహిళలపై ఎవ్వరూ ఇలాంటి అఘాయిత్యాలు చేసినా ఇలాంటి నిర్ణయాలే తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

ఇక దిశ హంతకులను ఎన్ కౌంటర్ చేయించిన తెలంగాణ పోలీసులకు విద్యార్థినులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సైబరాబాద్ సిపీ సజ్జనార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. శభాష్ అంటూ ప్రోత్సహిస్తున్నారు.

తెలంగాణ, ఏపీలోని ప్రతి జిల్లాలో కూడా మహిళలు స్వయంగా రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ లో పోలీసులకు రాఖీ కట్టి స్వీట్లు తినిపిస్తూ వారికి సెల్యూట్ చేశారు. పోలీసులపై జనాలు పూలవర్షం కురిపిస్తున్నారు. బాణా సంచా కాలుస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ కౌంటర్ చేయించిన సీపీ సజ్జనార్ ఇప్పుడు ప్రజల మనసులో హీరోగా మారిపోయారు. ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తున్నారు. కాలనీ, అపార్ట్ మెంట్, నగరాలు, పట్టణాల్లో మహిళలు గుంపులుగా రోడ్ల మీదకు వచ్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.