Begin typing your search above and press return to search.

నగదు బదిలీ పధకాలే కొంప ముంచుతాయా...?

By:  Tupaki Desk   |   13 Aug 2022 3:30 PM GMT
నగదు బదిలీ పధకాలే కొంప ముంచుతాయా...?
X
ఏపీలో రాజకీయం వైసీపీ వర్సెస్ వైసీపీగా ఉంది. ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుంది అంటే అయితే వైసీపీ లేకపోతే టీడీపీ అనే ఎవరైనా చెబుతారు. అంటే జనాల మెదళ్లల్లో ఈ రెండు పార్టీలే రిజిష్టర్ అయ్యాయి. ఇక వరసబెట్టి వస్తున్న జాతీయ సర్వేలు వైసీపీకే పట్టం కట్టాయి. ఏపీలో ఇప్పటిపుడు ఎన్నికలు పెడితే వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఇండియా టీవీ. ఇండియా టుడే వంటి జాతీయ స్థాయి ఇచ్చిన సర్వేల మీద అన్ని రాజకీయ పార్టీలలో చర్చ సాగుతోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో అంతర్మధనం చెందుతోంది అంటున్నారు.

ఈసారి గ్యారంటీగా అధికారంలోకి వస్తామని టీడీపీ చెప్పుకుటోంది. తమను తప్ప జనాలు వేరే పార్టీని ఆదరించరు అని కూడా ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే సర్వేలు చూస్తే వేరేగా వస్తున్నాయి. ఈ సర్వేలను పూర్తిగా కొట్టిపారేయడానికి లేదని కూడా టీడీపీలోనే చర్చ సాగుతోందిట. వైసీపీ మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఉందని టీడీపీ అంచనా వేస్తూంటే సర్వేలు మాత్రం మళ్ళీ ఏపీ వైసీపీదే అని చెప్పడాన్ని ఆ పార్టీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు అని అంటున్నారు.

అయితే వైసీపీకి ఎక్కడ ప్లస్ అవుతోంది అన్న చర్చ కూడా ఇపుడు సాగుతోంది. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమలు చేస్తున్న సంక్షేమ పధకాలే ఆ పార్టీకి ఇపుడు శ్రీరామర‌క్షగా ఉంటున్నాయని అంటున్నారు. దాని వల్లనే వైసీపీ వైపు జనాలు మొగ్గు చూపుతున్నారు అని కూడా అంటున్నారు. మరో వైపు ఏపీలో జగన్ సంక్షేమ పధకాల పేరిట లక్షా యాభై వేల కోట్ల రూపాయలను నేరుగా నగదు బదిలీ కింద లబిదారుల ఖాతాలో వేశారు.

మరో రెండేళ్లలో ఈ మొత్తం రెండు లక్షల కోట్లకు చేరవచ్చు. అయితే ఇంత పెద్ద మొత్తం ఇప్పటిదాకా పేదల ఖాతాలో వేయడం అన్నది జరగలేదు. దాంతో వైసీపీకి ఇది పొలిటికల్ అడ్వాంటేజ్ గా మారుతోంది అని అంటున్నారు. అదే టైమ్ లో తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఈ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారా లేదా అన్న సందేహాలు కూడా లబ్దిదారులలో ఉండడం వల్ల కూడా వైసీపీకి జై కొడుతున్నారు అని అంటున్నారు. టీడీపీ కూడా 2014 వేళ చాలా హామీలు ఇచ్చింది. అయితే వాటిని అమలు చేయడంలో మాత్రం ఆ పార్టీ సరిగ్గా వ్యవహరించలేదు అన్న విమర్శలు ఉన్నాయి.

దాంతోనే టీడీపీకి అది ఇపుడు దెబ్బగా మారుతుందా అన్న చర్చగా ఉంది. మరో వైపు అభివృద్ధి సంక్షేమం ఈ రెండు విషయాల్లో పోలిక పెట్టినపుడు సగటు జనాలు సంక్షేమానికే ఓటు వేస్తారు. ఊరిలో రోడ్లు, భవనాల సంగతి ఎలా ఉన్నా ముందు మన ఖాతాలో డబ్బులు పడ్డాయా లేదా అన్నదే ప్రజల ఆలోచనగా ఉంటుంది. దాంతో ఇపుడు తెలుగుదేశం ఒక విషయం గట్టిగా తేల్చుకోవాల్సి వస్తోందని అంటున్నారు.

సంక్షేమం మీద తెలుగుదేశం కూడా తన గొంతు పెంచాల్సిన అవసరం ఉంది అంతున్నారు. మేము వస్తే కచ్చితంగా సంక్షేమ పధకాలు అమలు చేస్తామని టీడీపీ ఇక మీదట చెప్పుకోవాల్సిన ఆవశ్యకతను జాతీయ సర్వే ఫలితాలు కలిగించాయని అంటున్నారు. మొత్తానికి చూస్తే ఏపీలో వైసీపీకి అనుకూలం అంటూ వస్తున్న సర్వేలు టీడీపీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయని అంటున్నారు మరి టీడీపీ మేధావులు, ఆ పార్టీ అభిమానులు పార్టీని జనాల్లో పెట్టేందుకు ఏ రకమైన సలహా సూచనలు అధినాయకత్వానికి ఇస్తారో చూడాలి.