Begin typing your search above and press return to search.

వారికి టెస్ట్ చేశాకే అనుమతి : ఏపీ ప్రభుత్వం !

By:  Tupaki Desk   |   29 May 2020 3:00 PM GMT
వారికి టెస్ట్ చేశాకే అనుమతి : ఏపీ ప్రభుత్వం !
X
ఏపీలో వైరస్ రోజురోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా కూడా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఏపీలో అనుమతించాలని ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు :

మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. నెగటివ్ వస్తే 7 రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాలి. పాజిటివ్ తేలితే మాత్రం కోవిడ్ ఆసుపత్రులకు వెళ్ళాలి.

ఈ ఆరు హైరిస్క్ స్టేట్స్ నుంచి వచ్చిన లక్షణాలు కనిపించని వారిని నిర్ధారణ చేసిన తర్వాతే ఇన్ ‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్ ‌లో ఉంచుతారు.

అంతర్జాతీయ ప్రయాణాలు చేసి వచ్చిన వారికీ కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. లక్షణాలు లేని వారికి 14 రోజులు హోం క్వారంటైన్ తప్పనిసరి.

వృద్దులు, గర్భిణులు, 10ఏళ్ల లోపు చిన్నారులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు నేరుగా ఇంటికి వెళ్లవచ్చు.

విమానాలు, రైళ్లలో ఏపీకి చేరుకునే ప్రతీ ఒక్కరికి పరీక్షలు నిర్వహిస్తారు.

ఇకపోతే , గడిచిన 24 గంటల్లో 11,638 శాంపిల్స్‌ను పరీక్షించగా 33 కొత్త కేసులు బయటపడ్డాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. మరో 79 మంది కరోనా బాధితులు ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 2874 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 2037 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 777 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య 60 కి చేరింది.