Begin typing your search above and press return to search.

అక్క‌డ జ‌గ‌న్ ఇంత క‌సిగా ఉన్నారా ?

By:  Tupaki Desk   |   19 July 2021 3:37 AM GMT
అక్క‌డ జ‌గ‌న్ ఇంత క‌సిగా ఉన్నారా ?
X
జగన్ విశాఖ‌ మీద ఫోకస్ బాగా పెట్టేశారు. ఏ అవకాశం వచ్చినా విశాఖనే ఆయన ముందుగా గుర్తుంచుకుంటున్నారు. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన జగన్ రాజకీయంగా ఇక్కడ బాగా పటిష్టం కావాలని ఎపుడూ ఆలోచిస్తూ వ‌స్తున్నారు. జ‌గ‌న్ ఎప్పుడెప్పుడు రాజ‌ధానిని విశాఖ‌కు మార్చాలా ? అని చాలా ఆత్రంగానే ఉంటోన్నారు. ఇక తాజాగా జగన్ మనసులో రాజధానిగా ఉన్న విశాఖ నుంచి నామినేటెడ్ పదవులు కూడా పెద్ద ఎత్తున భర్తీ చేశారు అంటున్నారు. ఏపీలో ఉన్న రాష్ట్ర స్థాయి కార్పోరేషన్ పదవుల్లో ఎక్కువగా విశాఖ నుంచే తీసుకున్నారు. కాకినాడ, విశాఖ పెట్రో రీజియన్ కార్పోరేషన్, నెడ్ క్యాప్, మైనారిటీ కార్పోరేషన్, విద్యా కార్పోరేషన్, బ్రాహ్మణ కార్పోరేషన్ వంటి కీలకమైనవి అన్నీ కూడా విశాఖ నుంచే జగన్ భర్తీ చేయడం విశేషం.

అదే విధంగా పార్టీ కోసం గత పన్నెండేళ్ళుగా పనిచేస్తూ వస్తున్న సిసలైన క్యాడర్ ని చూసి మరీ జగన్ వారికి పదవులు అప్పగించారు. అదే విధంగా సామాజిక న్యాయం చూసుకుంటే ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు, ముఖ్యంగా మహిళలకు జగన్ పదవుల పంపిణీ చేయడం ద్వారా ఆయా వర్గాలలో విశ్వాసం నింపారనే చెప్పాలి. దీంతో విశాఖ వైసీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది. పదవులే పదవులు అన్నట్లుగా క్యాడర్ హుషార్ చేస్తోంది. ఇక మొన్న‌టికి మొన్న కీల‌క‌మైన జీవీఎంసీ మేయ‌ర్ ప‌ద‌వి బీసీ జ‌న‌ర‌ల్ అయితే దానిని కూడా మ‌హిళ‌కు కేటాయించి సంచ‌ల‌నం క్రియేట్ చేశారు.

గతంలో బీసీలకు కూడా పెద్ద ఎత్తున కార్పోరేషన్లు జగన్ ఇచ్చారు. వాటిలో కూడా విశాఖకు భారీ వాటాయే దక్కింది. దీంతో విశాఖను పొలిటికల్ గా జగన్ బాగా ఫోకస్ చేస్తున్నారు అంటున్నారు. విశాఖ సిటీలో కూడా వైసీపీ బాగా బలం పుంజుకోవడం ప్రత్యర్ధులు లేకుండానే జీవీఎంసీలో పాలన సాగడం వంటి కారణాలను చూస్తే జగన్ వేసిన ఎత్తులు పారుతున్నాయనే అంటున్నారు. అదే సమయంలో జగన్ విధేయత, పార్టీ పట్ల నిబధ్ధత కలిగిన వారికే పదవులు ఇస్తాను అని గట్టి సందేశాన్ని కూడా క్యాడర్ కి పంపించారు అంటున్నారు.

ఈ రోజు కాకపోతే రేపు అయినా పదవులు వస్తాయి. అయితే ఓపికగా వేచి ఉండాలి. పార్టీ పటిష్టత కోసం పనిచేయాలి అన్నదే తాజాగా పదవుల పంపిణీతో జగన్ చాటి చెప్పారని అంటున్నారు. మొత్తానికి జగన్ మార్క్ పాలిట్రిక్స్ తో విశాఖలో వైసీపీలో ఆనందం రెట్టింపు అవుతూంటే టీడీపీ నిండా నిరాశలో కృంగిపోతోందనే చెప్పాలి. అదే స‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల్లో న‌గ‌రంలోని నాలుగు అసెంబ్లీ సీట్ల‌లో నాలుగు సీట్లు టీడీపీ ఖాతాలో ప‌డ్డాయి. ఇది జ‌గ‌న్‌కు ఎంత మాత్రం న‌చ్చ‌లేదు. అందుకే ఈ సారి టీడీపీకి ఒక్క సీటు ఛాన్స్ కూడా ఇవ్వ‌కూడ‌ద‌న్న‌దే జ‌గ‌న్ క‌సిగా క‌నిపిస్తోంది.