Begin typing your search above and press return to search.

పార్టీ రంగుల‌పై సుప్రీంలో స‌వాల్‌ కు ఏపీ ప్ర‌భుత్వం సిద్ధం!

By:  Tupaki Desk   |   28 May 2020 5:30 PM GMT
పార్టీ రంగుల‌పై సుప్రీంలో స‌వాల్‌ కు ఏపీ ప్ర‌భుత్వం సిద్ధం!
X
భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంక్షేమ‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు అమ‌లుచేస్తూ దూసుకెళ్తుండ‌గా కొన్ని విష‌యాల్లో ప్ర‌తిప‌క్షాలు, కొంద‌రు అడ్డంకులు సృష్టిస్తున్నారు. న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించి కొన్ని విష‌యాల్లో తీవ్ర ఆటంకం క‌లిగిస్తున్నారు. ఈ స‌మ‌యంలో రాష్ట్ర అత్యున్న‌త న్యాయ‌స్థానంలో ప్ర‌భుత్వానికి నిరాశ ఎదుర‌వుతోంది. వ‌రుస ఎదురుదెబ్బ‌లు త‌గులుతున్నాయి. దీంతో ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ప‌డుతోంది. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఆంగ్ల మాధ్య‌మం, రాజధాని తరలింపు, రాజధానిలో పేదలకు భూములు, కార్యాల‌యాల‌కు పార్టీ రంగులు, డాక్టర్ సుధాకర్, ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ‌ర‌కు ఎన్నో విష‌యాల్లో ప్ర‌త్య‌ర్థులు కోర్టులను ఆశ్ర‌యిస్తూ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిర్ణ‌యం తీసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వానికి వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు త‌గిలిన విష‌యం తెలిసిందే.

దీంతో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. ఈ స‌మ‌యంలో దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించ‌నున్నారు. ముఖ్యంగా ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, ముఖ్యంగా పంచాయ‌తీ కార్యాలయాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రంగులు వేయడంపై సుప్రీంకోర్టులో స‌వాల్‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సిద్ధమైంది. ఈ మేర‌కు హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో శుక్ర‌వారం పిటిష‌న్ వేసేందుకు ప్ర‌క్రియ పూర్త‌యిన‌ట్టు స‌మాచారం. కార్యాల‌యాల‌కు పార్టీ రంగులు వేయాల‌ని జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబ‌ర్ 623పై గ‌త శుక్ర‌వారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స‌రికాద‌ని, దానిపై స్టే ఇవ్వాల‌ని ఏపీ ప్ర‌భుత్వం కోర‌నుంది.

దీనిపై ముఖ్య కార్య‌ద‌ర్శి గురువారం చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్ని, పంచాయ‌తీ రాజ్ కార్య‌ద‌ర్శి గిరీజా శంక‌ర్ స‌మాలోచ‌న‌లు చేశారు. హైకోర్టు జారీ చేసిన ఆదేశాల‌పై సుప్రీంలో స‌వాల్ చేసి స్టే తెచ్చుకునేలా ఉన్న అవ‌కాశాలు చ‌ర్చించారు. ఈ మేర‌కు రేపు అన‌గా మే 28వ తేదీ శుక్ర‌వారం సుప్రీంకోర్టులో పిటిష‌న్ వేయ‌నున్నార‌ని స‌మాచారం.