Begin typing your search above and press return to search.

ఏపీలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు మరో ఎదురుదెబ్బ...ఏంటంటే !

By:  Tupaki Desk   |   29 May 2020 10:10 AM GMT
ఏపీలో ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలకు మరో ఎదురుదెబ్బ...ఏంటంటే !
X
ప్రస్తుతం దేశంలో విద్య ఓ వ్యాపారంలా మారిపోయింది. సరిగా స్కూల్ లో ఎలా ఉండాలో తెలియని వాడికి కూడా లక్షల్లో ఫీజు వాసులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ విద్యాసంస్థలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచడానికి అవకాశం లేకుండా చేసింది. ఇప్పటికే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం అంటూ ప్రైవేట్ విద్యాసంస్థలకు చెక్ పెట్టిన ప్రభుత్వం ..తాజాగా ఫీజుల విషయంలో నియంత్రణ పాటించేలా పాఠశాల విద్యనియంత్రణ కమిషన్ కు ఫీజుల నిర్ణయాధికారాన్ని కట్టబెట్టింది. నాణ్యమైన విద్య అందించే క్రమంలో ఫీజులతో పాటు ప్రైవేటు విద్యాసంస్ధల్లో తీసుకోవాల్సిన చర్యలపై కమిషన్ కు సర్వాధికారాన్ని కట్టబెడుతూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

ఏపీలో ఇన్నాళ్లూ విద్యార్ధుల తల్లితండ్రుల శ్రమను ఇష్టారాజ్యంగా దోచుకున్న ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల యజమాన్యాలకు జగన్ సర్కార్ మరో షాక్ ఇచ్చింది. ఇకపై స్కూళ్లు, కాలేజీల్లో వసతులు లేకుండా, నాణ్యమైన విద్యను అందించకుండా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు, చేస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. ప్రైవేటు స్కూళ్లను వాటిలో వసతులు, విద్యాబోధన నాణ్యత ఆధారంగా ఫీజులను నిర్ణయించే అధికారాన్ని పాఠశాల విద్యా నియంత్రణ కమిషన్ కు కట్టబెడుతూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలన్నీ ఇకపై కమిషన్ పరిధిలోకి వెళ్లి పోబోతున్నాయి.

ఇకపై ఏపీలోని ప్రైవేటు విద్యాసంస్ధల్లో ప్రమాణాల పెంపుతో పాటు ఫీజుల నియంత్రణ, సదుపాయాల కల్పన, సరైన బోధనా విధానాలు వంటి అనేక అంశాల్లో చర్యలు తీసుకునేలా కమిషన్ కు పూర్తి అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం ఇకకపై ప్రైవేటు విద్యా సంస్ధల్లో ఫీజులు, విద్యాబోధన, వసతులతో పాటు అన్ని అంశాలూ కమిషన్ పరిధిలోకి రానున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు సమీక్షించే అధికారం కూడా కమిషన్ కు కల్పించారు. స్కూళ్లు, కాలేజీలతో పాటు ట్యుటోరియర్స్ పైనా కమిషన్ కు అధికారం ఉంటుంది

తాజాగా కమిషన్ కల్పించిన అధికారాలను బట్టి చూస్తే ప్రతీ ఏటా విద్యాసంస్దలు ఫీజుల నిర్ణయానికి కమిషన్ నోటిపికేషన్ జారీ చేస్తుంది. ఆ తర్వాత విద్యాసంస్ధలు ఆన్ లైన్ లో ఫీజుల ప్రతిపాదలను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ విద్యా సంస్ధ ఖాతా పుస్తకాలతో పాటు ఇతర డాక్యుమెంట్లు కమిషన్ కు సమర్పించాలి. విద్యాసంస్ధలు పేర్కొన్న ఫీజులు న్యాయబద్ధంగా ఉన్నాయా లేదా అనేది కమిషన్ పరిశీలిస్తుంది. ఆ ప్రమాణాల ఆధారంగా వీటిని ఖరారు చేస్తుంది. దానిప్రకారం లేకపోతే, ఫీజుల పై కోత పడుతుంది.

అలాగే , కొత్త విధానంలో ఏ విద్యాసంస్ధ కూడా ఏడాది ఫీజును ఒకేసారి తల్లితండ్రుల నుంచి వసూలు చేసేందుకు వీలులేదు. అంటే ఫీజులను విడతల వారీగా చెల్లించేందుకు తప్పనిసరిగా అవకాశం ఇవ్వాల్సిందే. రాష్ట్రంలో ఏ విద్యా సంస్ధ అయినా కమిషన్ నిర్ణయించిన నిబంధనలు, మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే వాటి గుర్తింపును తక్షణం రద్దు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఫీజులను కూడా లాభార్జన కోసం కాకుండా నిర్వహణ ఖర్చులకు అనుగుణంగా తీసుకునేలా కొత్త రూల్స్ తెస్తున్నారు.