Begin typing your search above and press return to search.

మోడీ చేతిలో కత్తెర : బాబు.. జగన్ నోరిప్పకపోతే...?

By:  Tupaki Desk   |   12 Aug 2022 9:40 AM GMT
మోడీ చేతిలో కత్తెర : బాబు.. జగన్ నోరిప్పకపోతే...?
X
ఏపీ అంటే గుండె మీద చేయి వేసుకుని హాయిగా పడుకోవచ్చు అన్నట్లుగా కేంద్రంలోని బీజేపీ పరిస్థితి ఉంది. ఒక్క సీటు లేదు. నోటా కంటే తక్కువగా ఓట్లు వచ్చాయి. అయినా సరే బీజేపీకి ఏపీలో తిరుగులేని హవా ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా నూటికి నూరు శాతం ఓట్లు బీజేపీ నిలబెట్టిన రాష్ట్రపతి ఉప రాష్ట్రపతి అభ్యర్ధులకు పడ్డాయి అంటే అది బీజేపీ గొప్పతనం కాక మరేమిటి.

అందుకే బీజేపీ ఏపీ విషయంలో బే ఫికర్ గా ఉంటోంది. బాబుతో మోడీ టీ తాగినా జగన్ కి ఏమీ కంగారు లేదు. జగన్ తో లంచ్ మీటింగ్ కి మోడీ వెళ్ళినా బాబు అసలు ఏ కోశానా కలవరం పడరు. ఎందుకంటే ఈ ఇద్దరికీ కావాల్సింది మోడీ ప్రాపకమే అంటున్నారు. బాబుకు అయితే గత అనుభవం ఉంది. ఏ కారణం చేత అయినా బీజేపీ చేయి వీడితే మళ్లీ ఓడుతామన్న భయమూ ఉంది. సరిగ్గా ఇలాంటి భయాలే జగన్ లోనూ ఉన్నాయని అంటున్నారు.

అందుకే చంద్రబాబు తో షేక్ హ్యాండ్ ఇచ్చిన మోడీతో నవ్వుతూ లంచ్ చేయగిలిగారు అని చెబుతున్నారు. ఏపీలో ఈ ఇద్దరు నేతలకు అసలు పడదు, పడదు అంటే మామూలుగా కాదు, ఉప్పూ నిప్పుల మాదిరిగా వైసీపీ టీడీపీ ఉంటాయి. అయితేనేమి బీజేపీ వల్ల ఇద్దరూ ఢిల్లీలో కలుస్తున్నారు. బాబుతో మోడీ బాగా ఉంటున్నారని తెలిసి జగన్ కమలానికి తలాక్ అని అసలు అనరు,అనలేరు కూడా. ఎందుకంటే ఆయనకు తన గురించి, తన పార్టీ గురించి, బీజేపీ గురించి మోడీ గురించి కూడా బాగా తెలుసు కాబట్టి.

అదే విధంగా చంద్రబాబు కూడా బీజేపీ నీడ తాకినా చాలు వెచ్చగా ఉంటుందనుకుని మురిసిపోతున్నారు. ఇవాళ్టి షేక్ హ్యాండ్ రేపటి గోల్డెన్ హ్యాండ్ అని బాబు ఆలోచిస్తున్నారు. ఇలా ఈ ఇద్దరు నేతలూ ఏపీలో ఎన్ని అయినా అనుకుంటారు కానీ మోడీ విషయంలో మాత్రం కోరస్ గా జై అనెస్తున్నారు. అలాంటి ఈ రెండు పార్టీల అధినాయకులకు ఇపుడు బిగ్ ట్రబుల్స్ ఇచ్చేలా మోడీ సర్కార్ పావులు కదుపుతోంది అంటున్నారు.

ఉచితాల మీద సుప్రీం కోర్టులో ఫైల్ అయిన పిటిషన్ మీద విచారణ సాగుతోంది. దాంతో ఉచితాల మీద కేంద్రం అభిప్రాయం కూడా చెప్పింది. తనకు ఉచితాలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కావని కేంద్రం తరఫున న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు. రానున్న రోజుల్లో దీని మీదనే నిలబడి ఉచితాలు వద్దు అంటూ కేంద్రం ఒక చట్టాన్నే తీసుకురాబోతోందిట.

అదే కనుక జరిగితే దేశంలోని అన్ని రాష్ట్రాలకు ముకుతాడు బిగించినట్లే. ఇక ఏపీలో చూస్తే చంద్రబాబు, జగన్ ఇద్దరూ కూడా ఉచితాల మీద ఉచితాలు అంటూ జనాలకు ఫ్రీ స్కీమ్స్ ఇస్తూ అధికారంలోకి వచ్చారు. ఈ రోజు బాబు అధికారంలో లేరు కాబట్టి అప్పులు పెరిగాయి అని అంటున్నారు తప్ప ఉచితాల మీద నోరు మెదపడంలేదు. రేపటి ఎన్నికల్లో టీడీపీ కూడా ఉచిత హామీలు చాలానే ఇవ్వాలని చూస్తోంది.

ఇక జగన్ అయితే ఉచితాలే మళ్లీ గెలిపిస్తాని భావిస్తున్నారు. అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. ఎన్నికల ముంద్రన మరిన్ని ఉచిత పధకాలకు కూడా ఆయన శ్రీకారం చుట్టనున్నారని అంటున్నారు. ఈ టైమ్ లో వీటికి కత్తెర వేస్తూ మోడీ సర్కార్ ఒక చట్టాన్ని తెస్తే అపుడు బాబు జగన్ ల పరిస్థితి ఏంటి అన్నదే చర్చ. అంతే కాదు ఉచితాల మీద బిల్లు ప్రవేశపెట్టి వాటికి మద్దతు ఇవ్వమంటే ఈ ఇద్దరు నాయకులూ ఇస్తారా అన్నది కూడా మరో చర్చ.

తమకు ఉచితాలు రాజకీయ పరమ పధ సోఫాలాను కాబట్టి నో అంటే మోడీ మాస్టారు తోనే నేరుగా ముప్పు. అలాగని ఎస్ అంటే తమ రాజకీయ జీవితానికే కత్తెర పడుతుంది. మరి ఏ విధంగా ఈ పార్టీలు రియాక్ట్ అవుతాయన్నది కూడా ఇపుడు చర్చగా ఉంది. ఏది ఏమైనా మోడీకి తాము బాగా నచ్చామని ఈ ఇద్దరు నాయకులు అనుకున్నా ఆయనకు కావాల్సింది బీజేపీ రాజకీయం తప్ప మరోటి కాదు, ఆ సంగతి ఎంత తొందరగా తెలుసుకుంటే అంత తొందరగా ఏపీ బాగుపడుతుంది అనే వాళ్ళూ ఉన్నారు. కానీ మరి ఈ నేతలు వింటారా.